పోచమ్మమైదాన్, మార్చి 28: వరంగల్ పోచమ్మమైదాన్లోని జకోటియా కాంప్లెక్స్లో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో కాంప్లెక్స్ మొత్తం అంటుకుంది. వరంగల్ ఫైర్ స్టేషన్ నుంచి మూడు ఫైరింజన్లు వచ్చినప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు. పోచమ్మమైదాన్ నుంచి కాశీబుగ్గ రహదారిలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కావడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. వివరాల్లోకి వెళ్తే.. జకోటియా కాంప్లెక్స్లోని ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఫర్నిచర్, కంప్యూటర్లు, ఏసీలు ఇతర పరికరాలు అంటుకొని మంటలు మరింత వ్యాపించాయి. ఆ సమయంలో 20 మంది మంటలు ఆర్పేందుకు సేఫ్టీ పరికరం ద్వారా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. వెంటనే వారు కార్యాలయం నుంచి బయ టకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను ఆర్పేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. హనుమకొండ నుంచి మరో రెండు ఫైరింజన్లు తెప్పించి ప్రయ త్నించినా మంటలు తగ్గకపోగా, కింది ఫ్లోర్లో ఉన్న రిలయన్స్ డిజిటల్కు వ్యాపించాయి. ఇందులో ఉన్న కంప్యూటర్లు, సెల్ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రా నిక్ పరికరాలు కాలిపోయాయి. ప్రమాదంలో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్కు రూ. 50లక్షలకు పైగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తున్నది. రిలయన్స్ డిజిటల్కు కూడా లక్షల్లో నష్టం వాటిల్లినట్లు భావిస్తున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పోచమ్మమైదాన్ సెంటర్ సమీపంలోనే ప్రమాదం జరగడం వల్ల ప్రజలు పెద్ద ఎత్తున పోగయ్యారు. ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు ఇరువైపులా రాకపోకలను నిలిపి వేసి వాహనాలను ఆటోనగర్ మీదుగా పంపించారు. రాత్రి 10.30 గంటల వరకు మంటలు అదుపులోకి వచ్చాయి. ఆస్తి నష్టం అంచనా వేస్తున్నట్లు అగ్నిమాపక అధికారి భగవాన్రెడ్డి తెలిపారు.
మంటలు ఆర్పే క్రమంలో మట్టెవాడ సీఐ తుమ్మ గోపి ఊపిరి ఆడక అస్వస్థతకు గురయ్యారు, ఫైర్ హోంగార్డు గిరి చేయి కాలిపోగా ఇద్దరినీ 108లో ఎంజీఎం దవాఖానకు తరలించారు. ఘటనా స్థలాన్ని మంత్రి కొండా సురేఖ, కలెక్టర్ ప్రావీణ్య, కమిషనర్ అశ్విని తానాజీ వాకడే పరిశీలించారు.