ఐనవోలు, నవంబర్ 24: ‘వచ్చేది కారే.. రాష్ర్టాన్ని అభివృద్ధి చేసేది కేసీఆర్ సారే’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. ళెణ్కవారం మండలంలోని రెడ్డిపాలెం, నందనం, కక్కిరాలపల్లి, పంథిని, పున్నేల్, ఐనవోలులో డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావుతో కలిసి ఇంటింటా ప్రచారం చేశారు. తొలుత అరూరికి మహిళలు మంగళహారతులు, కార్యకర్తలు గజామాలతో ఘన స్వాగతం పలికారు. కక్కిరాలపల్లిలో అన్ని కుల సంఘాలతోపాటు సర్వమత పెద్దలు అరూరికి శాలువాలతో సన్మానించి మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పే వారెంటీ లేని కార్డును ప్రజలు నమ్మొద్దని అన్నారు. గతంలో ఎన్నో ఏండ్లు పరిపాలించిన కాంగ్రెస్ హయాంలో మంచినీరు, కరెంటు, మౌలిక సదుపాయాలు ఎందుకు కల్పించలేదో ఒక్కసారి ప్రజలు ఆలోచించాలన్నారు. తాను నియోజకవర్గానికి రూ.53కోట్ల నిధులతో పలు పనులు చేసినట్లు తెలిపారు. నియోజకవర్గ కేంద్రాన్ని గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ చేసి రూ.124కోట్లతో నలువైపులా డబుల్ లేన్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ కూడలి విస్తరించిన విషయం గుర్తుచేశారు. 30 పడకల ఆస్పత్రిని 100 పడకలకు అప్గ్రేడ్ చేసినట్లు తెలిపారు. నియోజకవర్గ కేంద్రంలో జూనియర్ కాలేజీ కోసం రూ.14కోట్లతో మంజూరు చేయించినట్లు చెప్పారు. ఐనవోలును మండల కేంద్రం చేసుకున్నామని, నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని చూసి తనను అధిక మెజార్టీలో గెలిపించాలని అభ్యర్థించారు. తన గొంతులో ప్రాణం ఉండగా ల్యాండ్ ఫూలింగ్ ఉండదని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ మళ్లీ మాకు ఒక్క అవకాశం ఇవ్వాలని మాయమాటలు చెబుతున్నారని, రాష్ట్ర సంక్షేమాన్ని చూసి ఓర్వలేక ఆగం చేయడానికి వస్తున్నారు. కరెంటు మూడు గంటలు చాలని, రైతుబంధు వద్దంటున్న, ఇంకో తీరుగా మాట్లాడుతున్న మరో ఢిల్లీ పార్టీలు మనకు అవసరమా? అని ప్రశ్నించారు. కేసీఆర్ కొట్లాడి తెచ్చిన తెలంగాణను అభివృద్ధి చేస్తుంటే ఢిల్లీ పార్టీలు అధికారం కోసం మాయమాటలు చెబుతూ వస్తున్నాయని తెలిపారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే అన్నిరకాల పింఛన్లు రూ.2,016 నుంచి రూ.5,016 పెరుగుతాయని పేర్కొన్నారు. అసైండ్ ల్యాండ్కు పట్టాలు ఇవ్వనున్నట్లుగా వివరించారు. నియోజకవర్గంలో అర్హులందరికీ దళితబంధు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురించి ప్రజలకు తెలుసని, ఉద్యోగ విరమణపొంది, నేరుగా డబ్బులు పెట్టి కాంగ్రెస్ పార్టీలో సీటు కొన్న వ్యక్తి సేవ చేస్తాడా అనేది ఆలోచన చేయాలన్నారు. బూటకపు ఎన్కౌంటర్ల పేర అమాయ ప్రజలను కాల్చి చంపాడని, బీజేపీ అభ్యర్థి ఐదేండ్లు పరిపాలించిన సమయంలో మనం పదేండ్లు వెనక్కిపోయామని తెలిపారు. మీ బిడ్డగా నియోజకవర్గ ప్రజలు తల ఎత్తుకునేలా పని చేసిన తనను ఆశీర్వదించాలని కోరారు. డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, జడ్పీ వైస్ చైర్మన్ గజ్జెల్లి శ్రీరాములు, జిల్లా రైతుబంధు సమిగి కోఆర్డినేటర్ లలితాయాదవ్, ఎంపీపీ మధుమతి, వైస్ ఎంపీపీ మోహన్, సొసైటీ వైస్ చైర్మన్లు టీసీఆర్, బాబు, మండల రైతుబంధు సమితి కోఆర్డినేటర్ సంపత్కుమార్, పార్టీ మండల అధ్యక్షుడు శంకర్రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, నియోజకవర్గ అధికార ప్రతినిధి రవీందర్, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ జయపాల్, ఆత్మ కమిటీ జిల్లా డైరెక్టర్ రాజు పాల్గొన్నారు.