బయ్యారం, డిసెంబర్ 27 : ఏజెన్సీ పాంతాల్లో గిరిజన విద్యార్థులకు ఉపయుక్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు కలిసి ఏకలవ్య పాఠశాలలను నిర్మిస్తున్నాయి. మానుకోట జిల్లాలోని బయ్యారం, కొత్తగూడెం, గూడూరు, సీరోలు, కురవి ఏకలవ్య పాఠశాలలున్నాయి. బయ్యారం మండలం నామాలపాడులో 9.2 ఎకరాల విస్త్రీర్ణంలో రెండేళ్ల క్రితం మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ ఎఫ్సైర్ (mota) నుంచి తొలివిడుత రూ.16కోట్లు, రెండో విడుత మరో రూ.16కోట్ల మంజూరు కావడంతో పనులు పూర్తి చేశారు. అత్యాధునిక డైనింగ్ హాల్, క్లాస్ రూంలు, బాల బాలికల హాస్టళ్ల నిర్మాణాలు పూర్తయి పాఠశాల ప్రారంభానికి ముస్తాబైంది. ఉపాధ్యాయులు, సిబ్బందికి క్వార్టర్స్తో పాటు బాలబాలికలకు మరో వసతిగృహం నిర్మించనున్నారు. ప్రస్తుతం పాత ఏకలవ్య పాఠశాలలో 240 మంది గిరిజన బాల బాలికలు చదువుతుండగా వీరంతా కొత్త పాఠశాలలోకి వెళ్లనున్నారు. రెండో విడుత నిర్మాణాలు పూర్తయితే 480మంది బాలబాలికలకు ఆరో తరగతి నుంచి ఇంటర్ దాకా కో ఎడ్యుకేషన్ అందించనున్నారు. ఇందులో సీబీఎస్ఈ సిలబస్ను అందిస్తున్నారు. డిజిటల్ విద్యాబోధన చేస్తున్నారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, బాటనీ, కంప్యూటర్ ల్యాబ్లు, లైబ్రరీ, స్పోర్ట్స్, మిర్రర్ రూంలను ఏర్పాటు చేశారు. సువిశాలమైన ఆట స్థలాన్ని అందుబాటులోకి తెచ్చారు. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం, దుస్తులు ఇస్తున్నారు.
పూర్తిగా ఏజెన్సీ మండలమైన బయ్యారంలోని గ్రామాల్లో అత్యధికంగా గిరిజనులు నివసిస్తున్నారు. వీరు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చదివించే స్తోమత లేక తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం సర్కారు పాఠశాలలను కార్పొరేట్టు దీటుగా బలోపేతం చేసింది. ఇందులో భాగంగా కేంద్ర భాగస్వామ్యంతో ఇప్పుడు సకల సౌకర్యాలు, అధునాతన హంగులతో ఏకలవ్య పాఠశాలను అందుబాటులోకి తేవడంతో పేద గిరిజన విద్యార్థుల చదువులకు భరోసా లభించినట్లయింది.
నామాలపాడులో తొలి విడుత రూ.16కోట్లతో నిర్మించిన తరగతి గదులు, హాస్టళ్లు, మీటింగ్ హాల్, కిచెన్, డైనింగ్ హాల్ భవనాల సముదాయాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించనున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆమె బుధవారం భద్రాచలం సీతారామచంద్ర స్వామి దర్శనం చేసుకోనున్నారు. అక్కడి నుంచే వర్చువల్ విధానంలో నామాలపాడు ఏకలవ్య పాఠశాలను ప్రారంభిస్తారు. కార్యక్రమంలో ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్, మహబూబాబాద్ జడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందు, కలెక్టర్ శశాంక పాల్గొననున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. పాఠశాలను సుందరంగా అలంకరించారు. వర్చువల్ కోసం స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఏర్పాట్లను ఆర్సీవో రాజ్యలక్ష్మి పర్యవేక్షిస్తున్నారు.