హనుమకొండ సిటీ/నెల్లికుదురు, జూన్ 19 : ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన ‘సర్కారు విద్య’కు బీఆర్ఎస్ ప్రభుత్వం జీవం పోసింది. రూ.కోట్లాది నిధులు వెచ్చించి అన్ని పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పించింది. అవసరమున్న చోట్ల కొత్త తరగతి గదులు, అదనపు గదులు నిర్మించింది. బోధనా పద్ధతుల్లోనూ అనేక మార్పులు చేసింది. ఆంగ్లమాధ్యమాన్ని అమలు చేస్తున్నది. కేజీ టు పీజీ ఉచిత విద్యలో భాగంగా గురుకులాలను నెలకొల్పింది. ఆదర్శ పాఠశాలలను బలోపేతం చేసింది. ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్లు, యూనిఫాంలను అందిస్తున్నది. మధ్యాహ్నం విద్యార్థులకు నాణ్యమైన సన్నబియ్యంతో భోజనం పెడుతున్నది. పరీక్షల సమయాల్లో ప్రత్యేక తరగతుల నిర్వహణ సమయంలో అల్పాహారం పెడుతున్నది.
‘మన ఊరు-మన బడి’ ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశను తెచ్చింది. బాలికా విద్యాభివృద్ధి కోసం ప్రత్యేకంగా కస్తూర్బా గాంధీ పాఠశాలలను ఏర్పాటు చేసి ఇంటర్ వరకు బోధన అందిస్తున్నది. బాలికల సమగ్రాభివృద్ధి, ఆత్మరక్షణ కోసం కరాటే నేర్పిస్తున్నది. సృజనాత్మకతను పెంపొందించే కార్యక్రమాలు చేపడుతున్నది. తల్లిదండ్రుల ఆకాంక్ష మేరకు ఆంగ్ల మాధ్యమాన్ని అందుబాటులో తెచ్చి తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్తో కూడిన నాణ్యమైన ద్విభాషా వాచకాలను ఉచితంగా అందిస్తున్నది.
– ‘మన ఊరు- మన బడి’తో
విప్లవాత్మక మార్పులు..
‘మన ఊరు- మన బడి’, ‘మన బస్తీ- మన బడి’ కార్యక్రమాలతో ప్రభుత్వ పాఠశాలలు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయి. శిథిలావస్థకు చేరిన భవనాలన్నీ సరికొత్తగా రూపుదిద్దుకుంటున్నాయి. బాలబాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లు, మూత్రశాలలు, తాగునీరు, డ్యు యల్ డెస్క్లు, ప్రహరీలు, డైనింగ్ హాల్స్, గార్డెనింగ్, డిజిటల్ బోర్డులు, ఫ్యాన్లు, విద్యుత్లైట్లు, భవనాలకు రంగులు, అవసరమైన చోట అదనపు తరగతి గదులు, సైన్స్ ల్యాబ్స్, గ్రంథాలయాలను ఏర్పాటు చేసింది. వారంలో మూడు రోజులు కోడిగుడ్లు అందిస్తున్నది. విద్యార్థుల శారీరక దృఢత్వం కోసం వారంలో మూడు రోజుల పాటు రాగిజావ అందించే కార్యక్రమాన్ని మంగళవారం నుంచి ప్రారంభించనుంది. తల్లిదండ్రులపై ఆర్థిక భారాన్ని తొలగించేందుకు 1 నుంచి 5 వరకు ప్రింటెడ్ వర్క్బుక్స్తో పాటు 6 నుంచి 12 వరకు నోట్బుక్స్ పంపిణీ చేస్తున్నది. ప్రభుత్వం కల్పిస్తున్న అనేక సాకర్యాలతో పాటు ఉపాధ్యాయుల కృషితో ఏటేటా సర్కారు బడుల్లో విద్యార్థుల నమోదుశాతం గణనీయంగా పెరుగుతున్నది.
ప్రాథమిక విద్య బలోపేతానికి ‘తొలిమెట్టు’..
ప్రాథమిక విద్య బలోపేతం కోసం గతేడాది తొలిమెట్టు కార్యక్రమాన్ని విద్యాశాఖ ప్రారంభించింది. ఉపాధ్యాయులు పాఠ్య ప్రణాళికలు, బోధనోపకరణాలతో బోధిస్తున్నారు. దీని ద్వారా విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పునకు బీజం పడింది. నిరంతర పర్యవేక్షణ, మార్గదర్శనం సాధ్యమైంది. ఉపాధ్యాయుల పనితనం, సృజనాత్మకతను వెలికితీసేందుకు పాఠశాల, మండల, జిల్లా స్థాయిలో టీఎల్ఎం మేళాలు నిర్వహించారు. తద్వారా విద్యార్థుల అభ్యసన సులభమవడమే కాకుండా తోటి ఉపాధ్యాయుల్లో బోధనోపకరణాల తయారీపై ప్రేరణ కలిగింది. కాగా, నేటి విద్యా దినోత్సవంలో టీఎల్ఎం మేళాను ఏర్పాటు చేయనున్నారు.
గ్రంథాలయాల ఆధునీకరణ..
ప్రతి పాఠశాలలో ప్రత్యేక గదిని గ్రంథాలయం కోసం కేటాయించారు. ఆ గదుల్లో సౌకర్యాలు కల్పించారు. పాఠశాల టైంలోనే ప్రత్యేకంగా లైబ్రరీ పీరియడ్ కేటాయించారు. ఎంపిక చేసిన ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేసి పుస్తకాలు, పోస్టర్లు, కార్పెట్స్, చెక్క కాణాలను అందించారు.
ప్రవేశాల తాకిడి..
బడీడు పిల్లలను బడుల్లో చేర్చడంతో పాటు చదువు మధ్యలో మానేసిన విద్యార్థులను తిరిగి పాఠశాలల్లో చేర్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘బడిబాట’ సత్ఫలితాలనిస్తున్నది. ఉపాధ్యాయులు ర్యాలీగా ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలపై వివరిస్తుండడంతో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు సంతోషంగా ముందుకొస్తున్నారు. మధ్యలో మానేసిన విద్యార్థులను టీసీ అక్కర్లేకుండానే వయస్సును బట్టి ఆయా తరగతుల్లో చేర్చుకుంటున్నారు. విద్యార్థుల ఫలితాలను తల్లిదండ్రులు చూసేలా సీసీఈ విధానం ద్వారా పరీక్షలు నిర్వహించి ప్రగతిని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. డిజిటల్ విద్యలో భాగంగా 8,9,10 తరగతుల కోసం ఉన్నత పాఠశాలల్లో ఇంటరాక్ట్ ప్లాట్ పానల్స్ (ఐఎఫ్పీ) సరఫరా చేశారు. పలు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు మంగళవారం ట్యాబ్స్ అందజేయనున్నారు.
ఏర్పాట్లు పూర్తి..
హనుమకొండ సిటీ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం విద్యా దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఆ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ వేడుకలను మూడు స్థాయిలుగా విభజించింది. గ్రామ స్థాయిలో విద్యార్థులు ఉదయం ఇంటింటికీ వెళ్లి సీఎం సందేశ కరపత్రాలను పంపిణీ చేస్తారు. ప్రధానోపాధ్యాయులు స్కూల్ అభివృద్ధి గురించి గ్రామ కూడళ్లలో వివరిస్తారు. 9 గంటలకు జాతీయ జెండా ఆవిష్కరించి, విద్యార్థులకు విజన్ అండ్ ఆక్టివేషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్పై ఉపన్యాప పోటీలు నిర్వహిస్తారు. అదే విధంగా మన ఊరు-మన బడిలో భాగంగా పూర్తిస్థాయిలో సిద్ధమైన 9 పాఠశాలలు, 74 ఉన్నత పాఠశాలల్లో 222 డిజిటల్ బోర్డులను ప్రారంభించడం, 6 నుంచి 10 తరగతి విద్యార్థులకు రెండో జత యూనిఫాం, పాఠ్య పుస్తకాలు అందజేస్తారు. మండల స్థాయిలో నూతనంగా నిర్మించిన కాజీపేట, ఐనవోలు, వేలేరు, దామెర మండలాల్లోని విద్యావనరుల భవనాలను ప్రారంభిస్తారు. జిల్లా స్థాయి వేడుకలను హనుమకొండ అంబేద్కర్ భవన్లో సాయంత్రం 4 గంటలకు ప్రారంభిస్తారు. ముఖ్యఅతిథిగా చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ హాజరవుకానున్నారు. సుమారు 500 మంది విద్యార్థులు వేడుకల్లో పాల్గొంటారు.
సౌకర్యాల కల్పనపై ప్రభుత్వం దృష్టి..
– ఎండీ అబ్దుల్ హై, డీఈవో, హనుమకొండ
సర్కారు బడుల మనుగడకు ప్రభుత్వ చాలా నిధులు కేటాయించింది. కార్పొరేటర్ను తలదన్నేలా సర్కారు పాఠశాలలు రూపుదిద్దుకున్నాయి. ప్రధానంగా ఇంగ్లిష్ మీడియంలో బోధించడంతో చాలా మంది తల్లిదండ్రులు సర్కారు బడుల వైపు మొగ్గు చూపుతున్నారు. పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పించి విద్యార్థులకు ఖర్చు లేకుండా విద్యనందిస్తున్నది. ప్రాథమిక విద్య బలోపేతానికి ప్రవేశపెట్టిన తొలిమెట్టు ద్వారా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పెరిగాయి. ఈ సంవత్సరం నుంచి ఉచితంగా నోట్బుక్స్ సరఫరా చేస్తున్నది.
స్వరాష్ట్రంలోనే విద్యాభివృద్ధి..
పీ రామారావు, డీఈవో, మహబూబాబాద్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాతే విద్యా వ్యవస్థలో అభివృద్ధి జరిగింది. నాడు ప్రభుత్వ బడుల్లో అరకొర వసతులతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడేవారు. నేడు అత్యాధునిక సౌకర్యాలు కల్పించిన సర్కారు అన్ని సమస్యలను పరిష్కరించింది. విద్యార్థుల నమోదు శాతం కూడా పెరిగింది. ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించడానికి మొగ్గు చూపుతున్నారు.