విద్యార్థుల్లోని సృజనాత్మకతను పెంపొందించి వారిని నూతన ఆవిష్కరణల దిశగా కేంద్ర సాంకేతిక శాఖ, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్లు ప్రోత్సహిస్తున్నాయి. ఇందుకోసం ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థుల నుంచి ‘ఇన్స్పైర్ మనక్’ అవార్డుల కోసం కేంద్రం ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఆగస్టు 31 వరకు గడువు ఉండడంతో ఈలోగా ప్రధానోపాధ్యాయులు, సైన్స్ టీచర్లు ఆసక్తి ఉన్న విద్యార్థుల వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 15 ఏళ్లలోపు విద్యార్థుల్లోని శాస్త్రీయ, సాంకేతికత, సృజనాత్మకతను పెంపొందించే లక్ష్యంతో కేంద్ర సాంకేతిక శాఖ(డీఎస్టీ), గుజరాత్లోని నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్(నిప్)లు సంయుక్తంగా దశాబ్దకాలం నుంచి దీనిని అమలుచేస్తున్నాయి. ఏటా 10లక్షల మంది విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తింపచేస్తూ వారికి ఒక్కొక్కరికీ రూ.10వేలు అందిస్తూ నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతున్నా యి. ప్రాథమికోన్నత, ఉన్న త పాఠశాలల్లోని విద్యార్థుల్లో సృజనాత్మకతను, వినూత్న ఆలోచన విధానాన్ని పెంపొందించి నూతన ఆవిష్కరణలకు నాంది పలికేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఇన్స్పైర్ మనక్’ అవార్డుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఇందుకోసం www.inspireawards-dst.gov.in వెబ్సైట్లోకి వెళ్లి మొదట స్కూల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
అవార్డుకు ఎంపికైన ప్రతి విద్యార్థికీ ఏడాదికి రూ.10 వేలు ఇచ్చి వారితో నూతన ఆవిష్కరణలు చేయిస్తారు. గతేడాది మహబూబాబాద్ జిల్లా నుంచి 74మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఎగ్జిబిట్స్ను అప్లోడ్ చేసేందుకు సౌకర్యంగా ఉండేలా ఈ ఏడాది పాటు ప్రత్యేకంగా ఇన్స్పైర్ మనక్ యాప్ను రూపొందించారు. 2021-22 విద్యాసంవత్సరంలో మహబూబాబాద్ జిల్లాలోని జిల్లా పరిషత్ బలపాల విద్యార్థిని నక్క భవాని, కొరిపల్లి ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థిని ఎడ్ల నానిలు ఇన్స్పైర్ మనక్ జాతీయస్థాయి సైన్స్ ప్రదర్శనలో టాప్-60 ఎగ్జిబిట్స్లో గెలుపొంది రాష్ట్రపతి భవనంలో భారత రాష్ట్రపతి నుంచి ప్రశంసలు పొంది జపాన్లో నిర్వహించే అంతర్జాతీయ సైన్స్ ప్రదర్శనకు ఎంపికయ్యారు. 2023-24 విద్యా సంవత్సరానికి గాను ఇన్స్పైర్ మనక్ అవార్డుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ప్రభుత్వ విద్యారంగ సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యా యులు, సైన్స్ టీచర్లు ఆసక్తి ఉన్న విద్యార్థుల వివరాలను ఆన్లైన్లో నిర్దిష్ట గడువులోపు నమోదు చేయాలి. గడువు ఆగస్టు 31తో ముగుస్తుంది.
ప్రతి పాఠశాల నుంచీ దరఖాస్తులు రావాలి
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు తప్పనిసరిగా ఇన్స్పైర్ అవార్డుకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఏడాది జిల్లా నుంచి ఎక్కువ సంఖ్యలో రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎంపికవ్వాలి. ఇందుకు ఉపాధ్యాయులు ఎక్కువగా కృషిచేయాలి. నేటి కంప్యూటర్ యుగంలో విద్యార్థుల్లో శాస్త్ర, సాంకేతికతపై మక్కువ పెంచి వారికి ఆ రంగాలపై దృష్టి కలిగేలా ప్రోత్సహించాలి. గతంలో వలె ఈ ఏడాది కూడా ఎక్కువ మంది విద్యార్థులు ఇన్స్స్పైర్ మనక్లో పాల్గొని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జిల్లా ఖ్యాతిని వ్యాపింపజేయాలి. ఆ దిశగా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయలు విద్యార్థుల్లో ఆలోచనలు రేకెత్తించాలి. పూర్తి వివరాల కోసం 7036860226ను సంప్రదించవచ్చు.
– పి.రామారావు, జిల్లా విద్యాశాఖ అధికారి, మహబూబాబాబాద్
ముందుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇలా..
www.inspireawards-dst.gov.in వెబ్సైట్లోకి వెళ్లి మొదట స్కూల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ వెబ్సైట్లోకి వెళ్లి పాఠశాల యూడైస్, ఈ-మెయిల్ ఐడీ, విద్యార్థుల సంఖ్య, ప్రధానోపాధ్యాయుడి పేరు, ఫోన్ నంబర్, పాఠశాల ఇన్స్పైర్ ఇన్చార్జి ఉపాధ్యాయుడి పేరు, ఫోన్ నంబర్, పాఠశాల చిరునామా తదితర వివరాలను నమోదు చేసి మొదట రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. 5 నిమిషాల్లో యూజర్ ఐడీ, పాస్వర్డ్ జనరేట్ అవుతుంది. గతంలో దరఖాస్తు చేసుకున్న పాఠశాలలవారైతే నేరుగా యూజర్ ఐడీ, పాస్వర్డుతో లాగిన్ కావచ్చు.
ఇదీ నామినేషన్ విధానం..
ఇన్స్పైర్ వెబ్సైట్లో యూజర్ ఐడీ, పాస్వర్డ్లను ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. ప్రాథమికోన్నత పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థులు, ఉన్నత పాఠశాల నుంచి 6 నుంచి 10వ తరగతి వరకు ఐదుగురు విద్యార్థుల పేర్లు. వారి తండ్రి పేరు, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, బ్యాంకు ఖాతా నంబర్ వివరాలను నమోదు చేయాలి. విద్యార్థులు చేసే ప్రాజెక్టు సమాచారాన్ని ఎంటర్ చేయాలి. ఐదుగురు విద్యార్థుల వివరాలు, ప్రాజెక్టు వివరాలు నమోదు చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ అథారిటీ అనుమతి కోసం ఫార్వార్డ్ చేయాల్సి ఉంటుంది.
ఒక చిన్న ఆలోచన విద్యార్థిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది
విద్యార్థిలో కలిగిన ఒక చిన్న ఆలోచన జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు తీసుకెళ్లి భారత రాష్ట్రపతితోనే ప్రశంసలు పొందగలిగింది. అందుకు నిదర్శనం మన జిల్లా విద్యార్థులు నక్క భవాని, ఎడ్ల నాని. విద్యార్థులు ఆలోచించేలా ఉపాధ్యాయులు ప్రయత్నిస్తే ఎన్నో అద్భుతాలు సాధించగలరు. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు తగిన సలహాలు, సహకారం అందించి వారిలోని సృజనాత్మకతను వెలికితీయాలి. ఇన్స్పైర్ అవార్డుకు ఆన్లైన్ చేసే అవిష్కరణలు నాణ్యమైనవిగా ఉండాలి. హెచ్ఎం, సైన్స్ టీచర్లు ప్రత్యేక శ్రద్ధ వహించి వినూత్నంగా అలోచనలను నామినేట్ చేయాలి. సమాజంలో తరుచూ ఎదురయ్యే సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపే విధంగా ఆవిష్కరణలు ఉన్నట్లయితే అధిక ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతీ ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి 2, ఉన్నత పాఠశాలల నుంచి 5 ఆవిష్కరణలను నామినేట్ చేయవచ్చు.
– బి.అప్పారావు, జిల్లా సైన్స్ అధికారి, మహబూబాబాద్ జిల్లా