వెంకటాపూర్/ఏటూరునాగారం/ వాజేడు/ములుగు రూరల్, మార్చి 27 : తాగునీటి సరాఫరాలో సమస్యలు తలెత్తకుండా చూడాలని పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, ఆర్డబ్ల్యూఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా అన్నారు. బుధవారం ఆయన వెంకటాపూర్, ఏటూరునాగారం, వాజేడు మండలాల్లో పర్యటించారు. రామప్ప సరస్సు వద్ద ఇన్టేక్వెల్, ఏటూరునాగారం మండలం రాంనగర్ సమీపంలోని మిషన్ భగీరథ ఇన్టేక్ వెల్, వాజేడు మండలం పూసూరు గోదావరి బ్రిడ్జి సమీపంలోని ఉన్న మిషన్ భగీరథ ఇంటేక్వెల్ను కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి పరిశీలించారు. ప్రస్తుతం ఇన్టేక్వెల్ పనితీరు, నీటి పంపింగ్ వివరాలను ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీర్ ఇన్ చీఫ్ కృపాకర్రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సందీప్కుమార్ మాట్లాడుతూ వేసవిలో ప్రజలకు సమృద్ధిగా తాగునీరు అందించాలన్నారు.
పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, అందులో భాగంగానే ఇన్టేక్ వెల్లను పరిశీలించినట్లు తెలిపారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ రామప్ప పంప్హౌస్ ద్వారా గోవిందరావుపేట, ములుగు, వెంకటాపూర్ మండలాల్లోని 165 గ్రామాలకు తాగునీరు అందిస్తున్నామని చెప్పారు. ములుగు జిల్లావ్యాప్తంగా 2,346 బోర్వెల్స్ ప్రజలకు అందుబాటులో ఉన్నాయని, జిల్లాలో తాగునీటి సమస్య లేదని వివరించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ శ్రీజ, ఆర్డబ్ల్యూఎస్ చీఫ్ శ్రీనివాసరావు, ఎస్ఈ మల్లేశం, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మాణిక్యరావు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ శ్రీజ.. ప్రిన్సిపల్ సెక్రటరీకి స్వాగతం పలికి మేడారం సమ్మక్క-సారలమ్మ ప్రతిమలను జ్ఞాపిక రూపంలో అందజేశారు.