ఆ రైతుకు ఏడెకరాల భూమి ఉంది. వ్యవసాయమంటే ఇష్టమే కానీ అందరిలా సంప్రదాయ పంటలు వేయలేదు. ఏదైనా కొత్త రకం పంట వేస్తే బాగుంటుందనే ఆలోచనకు వచ్చాడు. చాలా ప్రాంతాలు తిరిగి ఒక నిర్ణయానికి వచ్చాడు. అధికారుల సూచనలూ తీసుకొని తనకున్న రెండున్నర ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగుకు శ్రీకారం చుట్టాడు. మొక్కల కోసం సిమెంట్ పోల్స్, రింగ్స్ వేని నీళ్లు అందేలా డ్రిప్ సౌకర్యం.. ఇలా రూ.22లక్షలు పెట్టుబడి పెట్టిన ఆ రైతు.. ఇప్పుడు ఏడాదికి రూ.13లక్షలు ఆర్జిస్తున్నాడు. కొంగొత్త ఆలోచన సత్ఫలితాలనివ్వడంతో ఉత్సాహంగా ముందుకు‘సాగు’తున్నాడు కూనూరు రైతు కృష్ణారెడ్డి.
జఫర్గఢ్ మండలం కూనూరుకు చెందిన పల్లె కృష్ణారెడ్డి మూడేళ్ల క్రితం రెండున్నర ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేశాడు. ఉద్యాన శాఖ అధికారుల సూచనల మేరకు పంట కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశాడు. ఇందుకోసం 1300 సిమెంట్ స్తంభాలను చుట్టూరా పాతి సిమెంట్ రింగ్లను వాటిపై అనుసంధానం చేశాడు. 5,200 డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు నాటి నీటి సౌకర్యం కోసం డ్రిప్ అమర్చాడు. ఇలా అన్నింటికి కలిపి పెట్టుబడి ఖర్చు రూ.22 లక్షలు వరకు అయిందని రైతు కృష్ణారెడ్డి చెప్పాడు. డ్రాగన్ ఫ్రూట్ సాధారణంగా మొక్కలు నాటిన ఏడాదికి కాతకు వస్తుంది. ఈ క్రమంలో తొలి రెండేళ్లలో కాపు తక్కువగా వస్తుంది, మూడో ఏడాది పూర్తి స్థాయిలో దిగుబడి పొందవచ్చు. తొలి ఏడా ది పెట్టుబడి ఖర్చు ఎక్కువగా ఉన్నా, తర్వాతి ఏడాది నుంచి కేవలం తోట నిర్వహణ ఖర్చు మాత్రమే ఉంటుంది.
ఏడాదికి ఎనిమిది సార్లు పంట తీయవచ్చని 25 యేండ్ల వరకు దిగుబడి వస్తుందని కృష్ణారెడ్డి చెబుతున్నాడు. ప్రతి ఏడాది జూన్ నుంచి నవంబర్ వరకు పంటను కోయవచ్చని రెండున్నర ఎకరాల్లో సుమారు ఎనిమిది టన్నుల ఫ్రూట్ను అమ్మినట్లు కృష్ణారెడ్డి చెప్పాడు. పంటలో సేంద్రియ ఎరువులు, కోళ్ల వ్యర్థాలు, వర్మీ కంపోస్ట్ వంటివి వాడితే డ్రాగన్ ఫ్రూట్ పరిమాణం, నాణ్యత బాగుంటుంది. తెగుళ్లు, చీమల బెడద ఉండదు, ఫంగస్ వ్యాప్తికి అవకాశం ఉన్నా సాధారణ పద్ధతిలో వీటిని నివారించవచ్చు. ప్రస్తుత ఏడాది తన రెండున్నర ఎకరాల సాగులో డ్రాగన్ ఫ్రూట్ పంటకు రూ.13 లక్షల ఆదాయం వచ్చిందని కృష్ణారెడ్డి సంతోషంగా చెప్పాడు. రైతులు సంప్రదాయ పంటల జోలికి వెళ్లకుండా డ్రాగన్ ఫ్రూట్ లాంటి పంటలను సాగు చేస్తే లాభదాయకంగా ఉంటుందని రైతు కృష్ణారెడ్డి స్వీయానుభవంతో సలహా ఇస్తున్నాడు.
డ్రాగన్ ఫ్రూట్ సాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యాన ఆధ్వర్యంలో హెక్టార్కు రూ.2 లక్షల సబ్సిడీ ఇస్తున్నది. డ్రిప్ ఏర్పాటుకు కూడా సబ్సిడీ లభిస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నుంచి కొనుగోలు చేశానని కృష్ణారెడ్డి తెలిపారు. మొక్క ఒక్కంటికి రూ.40 చొప్పున 5200 మొక్కలను ఖరీదు చేశాడు. హైదరాబాద్, వరంగల్ పట్టణాల్లో మార్కెటింగ్ జరుగుతుందని, రిటైల్గా కిలోకు రూ.150 చొప్పున విక్రయించినట్లు రైతు కృష్ణారెడ్డి చెబుతున్నాడు.