సుబేదారి, మార్చి 13 : క్షుద్ర పూజలతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న తండ్రి, కొడుకులను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం హనుమకొండ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సెంట్రల్ డీసీపీ బారి నిందితుల అరెస్ట్ వివరాలు వెల్లడించారు. డీసీపీ కథనం ప్రకారం.. హనుమకొండలోని రాంనగర్కు చెందిన పోలీసు సయ్యద్ ఖదీర్ అహ్మద్, హైదరాబాద్కు చెందిన సయ్యద్ షబ్బీర్ అహ్మద్ తండ్రి కొడుకులు. వీరు ఫారహీన పేరిట దవాఖాన ప్రారంభించి, దాని ముసుగులో క్షుద్ర పూజలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు.
పక్కా సమాచారంతో ఈ నెల 13వ తేదీన టాస్క్ఫోర్స్ పోలీసులు హాస్పిటల్పై దాడులు తండ్రీ కొడుకును అరెస్టు చేశారు. చేతబడి చేసిన వారికి తగ్గిస్తామని, సంతానం లేమి వారికి సంతానం కలిగేలా వైద్యం చేస్తామని, ఆరోగ్యం, ఉద్యోగ, ఇతర సమస్యలు పరిష్కరిస్తామని ప్రజలను నమ్మించారు. ములుగు, కరీంనగర్, జమ్మికుంట, కొంకపాక, అదిలాబాద్ తదితర ప్రాంతాలకు చెందిన వారిని క్షద్రపూజలతో మోసం చేసేవారు. వారి నుంచి అధిక మొత్తంలో డబ్బులు దండుకునేవారు. గతంలో ఓ డాక్టర్ వద్ద పనిచేసిన అనుభవంతో సయ్యద్ ఖదీర్ నకిలీ డాక్టర్గా నయీంనగర్ కేయూసీ రోడ్డులో ఫారహీన పేరుతో హాస్పిటల్ పెట్టి మోసాలకు పాల్పడ్డారు. తండ్రి, కొడుకుపై 447,427, 420 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని డీసీసీ తెలిపారు. అలోపతి మందులు, క్షద్రపూజల సామగ్రి, ల్యాబ్ టెస్ట్ సామగ్రి, ఫోన్, టవేరా వాహనం, పేషెంట్ రిజిస్టర్, రూ.3 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ సమావేశంలో టాస్క్ఫోర్స్ ఏసీపీ జితేందర్రెడ్డి, కాజీపేట ఏసీపీ శ్రీనివాస్, హనుమకొండ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్జీ, టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్లు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్రావు, ఎస్సై లవన్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.