సబ్సిడీ గొర్రెల పంపిణీతో గొల్ల, కురుమల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి. రాష్ట్ర సర్కారు అండతో వారి కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకొంటున్నాయి.వరంగల్, హనుమకొండ జిల్లాల్లో మొత్తం 44,296 యూనిట్లు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడుతలో వరంగల్ జిల్లాలో 10,207 మందికి,
హనుమకొండ జిల్లాలో 13,829 గొర్రెల యూనిట్లను లబ్ధిదారులకు అందజేసింది. రెండో విడుతలో 19,979 యూనిట్లను పంపిణీ చేసేందుకు ప్రణాళికరూపొందించింది. ఈ సారి యూనిట్ విలువను రూ.1.25 లక్షల నుంచి రూ.1.75 లక్షలకు పెంచింది. ఇప్పటికే 1227 మందికి పంపిణీ చేశారు. కాగా, ఈ దఫా గ్రేటర్
వరంగల్ కార్పొరేషన్ పరిధిలోని వారికీ గొర్రెలు అందజేయాలని నిర్ణయించింది. మొదటి విడుత యూనిట్ల గొర్రెల పిల్లలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. గొర్రెలపంపిణీతో గ్రామాల్లో మందల సవ్వడి పెరిగిందని, ఒకప్పుడు కూలినాలి చేస్తే గాని పూట గడవని పరిస్థితి ఉండేదని, ఇప్పుడు సీఎం కేసీఆర్ సారు అండదండలతో తమకుటుంబాలు మంచిగ ఉన్నాయని గొల్ల, కురుమలు సంబుర పడుతున్నారు.
– వరంగల్ (నమస్తేతెలంగాణ)/హనుమకొండ సబర్బన్, సెప్టెంబర్ 9
కూలి పనికి పోవడం బందైంది..
హనుమకొండ సబర్బన్ : మాది నిరుపేద కుటుంబం. కూలి పనితో పాటు రెండు బర్రెలను నమ్ముకొని జీవించేవాడిని. పనులు దొరకని నాడు పస్తులుండాల్సిన పరిస్థితి.ఇలా కష్టాల కడలిలో సాగుతున్న నా జీవితానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం చుక్కానిలా మారింది. నాకు వచ్చిన గొర్రెల యూనిట్తోపాటు బర్రెలను అమ్మి మరికొన్ని గొర్రెలను కొన్నా. కొన్నాళ్లకు ఈ గొర్రెల పిల్లలు ఎదిగాక వాటిని అమ్ముకొని తొలి ఆదాయం గడించా. సరిపడా పైసలు వస్తుండడంతో ఇప్పుడు కూలి పనులకు పోవడం కూడా బందైంది. ఇంటికాడ కొన్ని చిన్న పిల్లలతో పాటు సూడి గొర్లు మస్తు ఉన్నయి. ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన ఈ పథకం వల్ల నేను సగౌరవంగా బతుకుతననే నమ్మకం ఏర్పడింది.
– జక్కుల సమ్మయ్య, లబ్ధిదారుడు,
దామెర గ్రామం, ఎల్కతుర్తి మండలం, హనుమకొండ జిల్లా
వరంగల్, సెప్టెంబర్ 9(నమస్తేతెలంగాణ) : గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కులకృత్తులను ప్రోత్సహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం గొల్ల, కురుమల కోసం గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. గొర్రెల పెంపకందారుల్లో ప్రతి ఒకరికి డబ్బు ఐదు శాతం సబ్సిడీతో గొర్రెల యూనిట్లను అందజేస్తున్నది. ఇప్పటికే తొలివిడుత ‘ఏ’ జాబితాలోని గొర్రెల పెంపకందారులకు యూనిట్లను పంపిణీ చేసింది. ఇటీవల రెండోవిడుత ‘బీ’ జాబితాలోని గొర్రెల పెంపకందారులకు యూనిట్లను అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. జిల్లాలో 199 ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘాలు పని చేస్తున్నాయి. వీటిలో 23,252 మంది గొర్రెల పెంపకందారులు సభ్యులుగా ఉన్నారు. పశు సంవర్థక శాఖ అధికారులు 2017-18లో ఈ సహకార సంఘాల సభ్యులతో కలిసి గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహించారు. సబ్సిడీ గొర్రెలను రెండు విడుతల్లో అందజేయడానికి సభ్యుల పేర్లతో ‘ఏ’, ‘బీ’ జాబితాలను రూపొందించారు.
తొలి విడుత 10,470 మందికి, రెండో విడుత 12,782 మందికి గొర్రెల యూనిట్లను ప్రభుత్వం పంపిణీ చేయనుందని ప్రకటించారు. 20 ఆడ గొర్రెలు, ఒక మగ గొర్రెతో కూడిన యూనిట్ విలువ అప్పట్లో రూ.1.25 లక్షలు. గొర్రెల పెంపకందారులు తమ వాటాధనం కింద ఇరవై శాతం రూ.31,250 డీడీ రూపంలో చెల్లిస్తే ప్రభుత్వం డబ్బు ఐదు శాతం సబ్సిడీ రూ.93,750 ఇచ్చింది. ఈ లెక్కన తొలి విడుతలో 10,189 మందికి యూనిట్లను పంపిణీ అందజేసింది. వీటికి ఇన్సూరెన్స్ చేసి దాణా, మందులను కూడా పంపిణీ చేసింది. తొలి విడుత సబ్సిడీ గొర్రెలను పొందిన లబ్ధిదారులు ఆశించిన ఆదాయాన్ని పొందుతున్నారు. గ్రామాల్లో గొర్రెల సంపద పెరిగింది. మాంసం దిగుమతి చేసుకోవడం నుంచి ఎగుమతి చేసే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా గతంలో పాలేరుగా పనిచేసిన అనేక మంది సబ్సిడీ గొర్రెలను పొందడం ద్వారా ఓనర్లుగా మారారు.
రెండో విడుత లక్ష్యం ఎంతంటే..
రెండోవిడుత ‘బీ’ జాబితాలోని గొర్రెల పెంపకందారులకు యూనిట్లను పంపిణీ చేయాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయించింది. ఈ జాబితాలోని 12,782 మందిలో 18 మందికి కొన్నేళ్ల క్రితమే గొర్రెల యూనిట్లను పంపిణీ చేసింది. దీంతో ప్రస్తుతం 12,764 మంది గొర్రెల పెంపకందారులకు యూనిట్లను అందజేయాల్సి ఉంది. వీరిలో మండలం వారీగా సంగెంలో వెయ్యి మంది, గీసుగొండలో 836, నెక్కొండలో 1,084, దుగ్గొండిలో 942, ఖానాపురంలో 1,036, చెన్నారావుపేటలో 869, నల్లబెల్లిలో 921, నర్సంపేటలో 1,029, వర్ధన్నపేటలో 812, పర్వతగిరిలో 768, రాయపర్తిలో 1,120, వరంగల్లో 239, ఖిలావరంగల్లో 2,108 మంది ఉన్నారు. మార్కెట్లో గొర్రెల ధర పెరిగినందున ప్రభుత్వం సబ్సిడీ గొర్రెల యూనిట్ విలువ మొత్తాన్ని రూ.1.25 లక్షల నుంచి రూ.1.75 లక్షలకు పెంచింది. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు తమ ఇరవై ఐదు శాతం వాటాధనం కింద రూ.43,750 చెల్లిస్తే ప్రభుత్వం 75 శాతం సబ్సిడీ రూ.1,31,250 ఇస్తున్నది. వాటాధనం చెల్లించాలని ప్రభుత్వం చెప్పడంతో ‘బీ’ జాబితాలో ఉన్న గొర్రెల పెంపకందారుల్లో 866 మందికిపైగా ఇరవై ఐదు శాతం డబ్బు చెల్లించినట్లు తెలిసింది.
కొద్దిరోజుల క్రితం వరకు వీరిలో 255 మందికి అధికారులు గొర్రెల యూనిట్లను కొనుగోలు చేసి అందజేసినట్లు సమాచారం. వాటాధనం డబ్బు చెల్లించిన వారికి ప్రభుత్వం డబ్బు ఐదు శాతం సబ్సిడీపై గొర్రెల యూనిట్లను కొనుగోలు చేసి పంపిణీ చేసే దిశగా ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నది. ఇటీవల గొర్రెల
పెంపకందారులు తమ వాటాధనం చెల్లిస్తుండడం, ప్రభుత్వం గొర్రెల యూనిట్లను కొనుగోలు చేసి లబ్ధిదారులకు అందజేయడం జిల్లాలో ఊపందుకొన్నది. ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో ఈ రెండో విడుత కార్యక్రమం అమలవుతున్నది.
హనుమకొండ జిల్లాలో..
హనుమకొండ సబర్బన్ : ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకం జిల్లాలోని యాదవ, కురుమ వర్గాలకు చెందిన అనేక మంది ఆర్థిక పరిపుష్టికి దోహదపడింది. 2017 జూన్ 20న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ పథకం ద్వారా విడుతల వారీగా గొర్రెలను పంపిణీ చేశారు. ఈ పథకం ద్వారా హనుమకొండ జిల్లాలో 21,044 మంది లబ్ధిదారులను పశుసంవర్థక శాఖ గుర్తించింది. ఇందులో మొదటి విడుతలో లిస్ట్-ఏ ద్వారా 8417 మందికి, లిస్ట్-బీ ద్వారా 5412 మందికి మొత్తం 13,829 మందికి ఒక్కొక్కరికి 21 గొర్రెల చొప్పున 2లక్షల 90వేల 409గొర్రెలను పంపిణీ చేశారు. వీటి ద్వారా కొత్తగా లక్షా10వేల పిల్లలు పుట్టినట్లుగా అధికారులు అంచనా వేశారు. ఒక్కో గొర్రె పిల్ల 10కిలోల చొప్పున తూగినా 110 టన్నుల మాంసం అధికంగా ఉత్పత్తి చేసినట్లు గణాంకాలు చెపుతున్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లో గొల్ల, కురుమల ఆర్థిక గణాంకాలు ఈ గొర్రెల పంపిణీ పథకం వల్ల మార్పులు చెందాయి. గతంలో కూలీనాలి చేసుకునే వారు కూడా ప్రభుత్వం ఇచ్చిన గొర్రెలను పెంచుకొని సొంతంగా జీవిస్తున్నారు. ప్రపంచంలోనే పెద్ద మొత్తంలో పశు సంపద ఉన్న దేశంగా భారత్ కీర్తికెక్కితే, అందులో తెలంగాణ వాటానే అత్యధికంగా ఉన్నట్లు 2022లో ‘తెలంగాణ ఎట్ ఏ గ్లాన్స్’ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఈ దఫా జిల్లాలో కేవలం గ్రామీణ మండలాల్లోనే కాకుండా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కూడా గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది.
నగరంలో 4112 మంది లబ్ధిదారులను గుర్తించింది. 2వ విడుతలో వారికి అవకాశం కల్పించింది. జిల్లాలో మొత్తం 7215 మంది లబ్ధిదారులను గుర్తించగా, ఇందులో జీహెచ్ఎంసీతో పాటు అర్బన్ మండలాల వారు కలిపి 2వేల మంది డీడీలు తీశారు. ఇందులో మొదట 972 మందికి బడ్జెట్ విడుదలవగా ఇప్పటికే 930యూనిట్ల గ్రౌండింగ్ పూర్తయింది. మరో వారం పదిరోజుల్లో మిగతా యూనిట్లకు కూడా బడ్జెట్ విడుదలవనుంది. అందరికీ గొర్రెలు పంపిణీ జరిగేలా అధికారులు చూస్తున్నారు.మొదటి విడుతలో గొర్రెలను పొందిన లబ్ధిదారులకు ఇప్పటికే పుట్టిన పిల్లల అమ్మకాలు కూడా మొదలై ఆదాయం సమకూరుతున్నది. పుట్టిన పిల్లల్లో ఆడవాటిని మందల్లోనే ఉంచుకుంటున్న లబ్ధిదారులు పొట్టేలు పిల్లలను మాత్రం అమ్ముకొని ఆదాయం పొందుతున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి అందిన గొర్రెల ద్వారా గొర్రెల పెంపకందారులకు సుమారు రూ.55కోట్ల అదనపు ఆదాయం సమకూరింది. దీనివల్ల గ్రామాల్లో గతంలో కూలి పనులకు వెళ్లే వారు ప్రభుత్వం నుంచి వచ్చిన గొర్రెలను మేపుకొని బతుకుతున్నారు. మరి కొంతమంది 3, 4 యూనిట్లను కలుపుకొని ఒకే మందగా మార్చుకుని సాదు