వరంగల్,సెప్టెంబర్ 11 : పేదల ఆరోగ్యానికి సీఎం సహాయ నిధి గొప్ప వరమని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని పలువురు అనారోగ్యంతో బాధపడుతుండడంతో వారికి సీఎం సహాయ నిధి నుంచి వైద్య ఖర్చులను మంజూరు చేయించి, వాటికి సంబంధించిన చెక్కులను సోమవారం చీఫ్విప్ అందజేశారు. వరంగల్ సూపర్బజార్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 14 మందికి ఆయన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చీఫ్విప్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోందన్నారు. బీసీ బంధు, దళిత బంధు, గృహలక్ష్మీ పథకాలను అమలు చేస్తూ పేదలకు అండగా నిలుస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణదే అన్నారు. అన్నివర్గాలకు ప్రభుత్వం అండగా ఉంటోందన్నారు. నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న అనేక మందికి సీఎం సహాయ నిధి నుంచి రూ.కోట్ల సాయం అందించినట్లు చెప్పారు. భవిష్యత్లో ఇంకా సాయం అందజేస్తానని తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారు స్థానికుల నాయకుల ద్వారా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, కల్పలత సూపర్ బజార్ అధ్యక్షుడు వర్ధమాన్ జనార్దన్, ఉపాధ్యక్షులు ఎండీ షఫీ, బీఆర్ఎస్ నాయకులు చీకటి ఆనంద్, మాడిశెట్టి శివశంకర్, మాలకుమ్మరి పరశురాములు తదితరులు పాల్గొన్నారు.
కాళోజీ కళాక్షేత్రం పనులపై సమీక్ష
హనుమకొండ : కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కాళోజీ కళాక్షేత్రం పురోగతి పనులను క్షేత్ర స్థాయిలో ఆయన పరిశీలించారు. అక్కడే కుడా చైర్మన్ సుందర్ రాజు యాదవ్, మున్సిపల్ అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ వినయ్భాసర్ కాళోజీ కళాక్షేత్రం కలియ తిరుగుతూ పనులను పరిశీలించారు. కాళోజీ కళాక్షేత్రంలో అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయనే విషయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనులను పూర్తి చేయడానికి వారికి తగిన సలహాలు, సూచనలు ఇచ్చారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని చీఫ్ విప్ సూచించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా, అధికారులు పాల్గొన్నారు.