మామిళ్లగూడెం, మే 2 : పొరుగూరు నుంచి వచ్చిన ఓ మహిళను కిడ్నాప్ చేసిన దుండగులు.. ఆపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అపస్మారక స్థితికి చేరుకున్న ఆమెను ఖమ్మం ప్రభుత్వ దవాఖానలో వదిలేసి వెళ్లగా.. చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన మంగళవారం సాయంత్రం ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలానికి చెందిన ఓ మహిళ (45) వృద్ధురాలైన తన అత్తను దవాఖానలో చూపించేందుకు ఏప్రిల్ 27న ఖమ్మం వెళ్లింది. ఖమ్మం రైల్వే స్టేషన్లో కృష్ణా ఎక్స్ప్రెస్ రైలు దిగిన వారు ఆటోలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం తిరిగి వెళ్తున్న క్రమంలో వృద్ధురాలికి విరేచనాలు కాగా ఖమ్మం బైపాస్ రోడ్డు వైపు ఆటోలో వెళ్లారు. ఈ క్రమంలో బాధితుల అమాయకత్వాన్ని గుర్తించిన దండగులు వృద్ధురాలిని బహిర్భూమి కోసం దించిన వెంటనే.. మహిళను ఆటోలో బలవంతంగా ఎక్కించుకుని వెళ్లారు. ఆ రాత్రంతా సదరు మహిళను చిత్రహింసలకు గురిచేసినట్లు తెలిసింది. మరుసటి రోజు 28న ఉదయం 10 గంటల సమయంలో తీవ్ర గాయాలతోపాటు అపస్మారక స్థితిలో ఉన్న మహిళను దండగులు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి వెళ్లిపోయారు. అక్కడ చికిత్స పొందుతున్న మహిళ అదేరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించి.. బంధువుల కోసం ఆరా తీశారు. అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో గుర్తుతెలియని మృతదేహంగా గుర్తించి మార్చురీలో భద్రపరిచారు. అనంతరం పోలీసులకు వారు సమాచారం అందించారు.
వెలుగు చూసింది ఇలా…
మహిళ కిడ్నాప్ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోడలితోపాటు వైద్యం కోసం వచ్చిన అత్త వృద్ధురాలు తనను ఆటో దించిన ప్రాంతం నుంచి దిక్కుతోచని స్థితిలో ఖమ్మం రైల్వే స్టేషన్కు చేరుకుని తోటి ప్రయాణికులను యాచించి తన గ్రామానికి వెళ్లింది. ఖమ్మంలో జరిగిన విషయాలను కుటుంబ సభ్యులకు వివరించింది. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఖమ్మం చేరుకుని పరిసరాల్లో మహిళ కోసం వెతికారు. ఎంతకూ ఆచూకీ లభించకపోవడంతో తప్పిపోయిందని ఖమ్మం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఆస్పత్రిలో మహిళ మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. అక్కడి ఫొటోలు, బంధువులు తెచ్చిన ఫొటోలు చూసి గుర్తించారు. దీనిపై బంధువులు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రంగంలోకి ప్రత్యేక బృందాలు : ఏసీపీ
ఖమ్మం నగరంలో మహిళ అపహరణ, లైంగిక దాడి, మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఖమ్మం పట్టణ ఏసీపీ పీవీ గణేశ్ తెలిపారు. నగరంలోని సీసీ కెమెరాలు, ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న సీసీ ఫుటేజీల ఆధారంగా వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. ప్రత్యేక బృందాలతో నిందితులను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.