ఒకప్పుడు రోజులు, నెలల తరబడి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తే తప్ప కాని భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేస్తూ కేసీఆర్ సర్కారు తెచ్చిన ‘ధరణి’ రైతన్నకు కొండంత ధీమానిచ్చింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన పోర్టల్ ద్వారా వేగంగా పట్టాలు చేతికి అందిస్తూ, భూ రికార్డులు సైతం భద్రంగా ఉంచుతూ వారిలో భరోసా నింపుతున్నది. అంతేగాక అవినీతికి తావులేకుండా, పైరవీలు, అవకతవకలకు అవకాశం లేకుండా పూర్తి పారదర్శకంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నది. ఇప్పటివరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 20,977, ములుగులో 8,503 కలిపి మొత్తం 29,480 రిజిస్ట్రేషన్లు కాగా రూపాయి ఖర్చు లేకుండా అందిస్తున్న ధరణి సేవలపై అందరిలో సంతోషం వ్యక్తమవుతున్నది.
ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మే 28(నమస్తే తెలంగాణ) : భూ సంస్కరణల్లో భాగంగా సీఎం కేసీఆర్ సర్కారు తీసుకొచ్చిన ధరణి పోర్టల్ సత్ఫలితాలనిస్తున్నది. భూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సులభంగా, వేగంగా పూర్తిచేస్తూ రైతులకు ధీమా ఇస్తున్నది. స్లాట్ బుక్ చేసుకున్న నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయి భూ పత్రాలు సంబంధిత రైతు చేతికి అందుతున్నాయి. రెండున్నర ఏండ్ల కింద ప్రవేశపెట్టిన పోర్టల్ ద్వారా అమ్మకం, కొనుగోలు, బహుమతి, వారసత్వం, తనఖా, పెండింగ్ మ్యుటేషన్, భూమి విషయాలపై ఫిర్యాదు, నిషేధించిన వివరాలు, కోర్టు కేసులు, ఇతర అంశాలు ధరణి పోర్టల్లో అందుబాటులోకి రావడంతో తహసీల్దార్ కార్యాలయాల్లో భూ రిజిస్ట్రేషన్ సేవలు మరింత సులభమయ్యాయి.
భూముల రిజిస్ట్రేషన్లు, ఇతర లావాదేవీల విషయంలో అడ్వాన్స్ స్లాట్ బుకింగ్, ప్రతి సర్వే నంబర్కు మార్కెట్ విలువ వివరాలు, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు లెక్కింపు, ఆన్లైన్ చెల్లింపులు, నిషేధిత భూములను ఆటోలాక్ చేయడం, పౌరుల సౌలభ్యం, పారదర్శకత వంటి అనుకూల అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా బయోమెట్రిక్ విధానం ధరణి పోర్టల్లో ప్రధాన అంశమని చెప్పవచ్చు. భూ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కాగానే ఈ-పట్టాదార్ పాస్బుక్ను వెంటనే విడుదల చేయడం, పట్టాదారు పాస్ పుస్తకాన్ని పోస్టు ద్వారా కానీ, నేరుగా కానీ రైతుకు చేరవేయడం వంటి సదుపాయాలు ధరణి పోర్టల్ ద్వారా రైతులకు కలిగాయి.
ఇప్పటివరకు భూపాలపల్లిలో 20,977 రిజిస్ట్రేషన్లు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ధరణి వ్యవస్థ 2020 నవంబర్ 2న అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి ఈ నెల 27వరకు జిల్లాలో 20,977 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. ఇందులో భూపాలపల్లి మండలంలో 2,787, గణపురంలో 1,973, చిట్యాలలో 2,592, మహాముత్తారంలో 650, మహదేవపూర్లో 1,166, కాటారంలో 2,523, మొగుళ్లపల్లిలో 2,100, పలిమెలలో 151, మల్హర్లో 1,807, టేకుమట్లలో 1,967, రేగొండ మండలంలో 3,261 ఉన్నాయి.
ములుగులో 8,503
ములుగు జిల్లాలో 8,503 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. మొత్తం 9 మండలాలు ఉండగా అత్యధికంగా జిల్లాకేంద్రం లోని తహసీల్దార్ కార్యాలయంలో ధరణి పోర్టల్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 4667 రిజిస్ట్రేషన్లు అయ్యా యి. ఆ తర్వాత వెంకటాపూర్ మండలంలో 2527, గోవిందరావుపేటలో 283, వాజేడులో 227, ఏటూరునాగారం లో 209, సమ్మక-సారలమ్మ తాడ్వాయిలో 199, కన్నాయిగూడెంలో 144, వెంకటాపురం(నూగూరు)లో 146 ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంత భూములు ఎక్కువగా ఉన్న మంగపేట మండలంలో 101 రిజిస్ట్రేషన్లు అయ్యాయి. వీటి లో మొత్తం గిఫ్ట్ రిజిస్ట్రేషన్ కింద 992, భూ కొనుగోలు రిజిస్ట్రేషన్ల కింద 4358, సక్సెషన్ కింద 978, పార్టిషన్ కింద 383, మార్టిగేజ్ కింద 464, మ్యుటేషన్ కింద 578, నాలా కన్వర్షన్ కింద 593, ఎన్ఆర్ఐ భూ కొనుగోలు, భూ రిజిస్ట్రేషన్ల కింద 6, వివిధ అంశాల కింద మరో 151 దరఖాస్తులు వచ్చాయి. వీటన్నింటికి ఆన్లైన్ విధానం ద్వారా స్లాట్ బుక్ చేసుకొని రైతులు నేరుగా తహసీల్దార్ కార్యాలయాలకు వచ్చి ప్రక్రియను పూర్తి చేసుకున్నారు. వివిధ అనారోగ్య కారణాలతో కార్యాలయాలకు రాలేని వారి చెంతకు రెవెన్యూ అధికారులే నేరుగా వెళ్లి అక్కడికక్కడే బయోమెట్రిక్ వేలిముద్రలను తీసుకొని భూ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసి పత్రాలను అందజేశారు.
భూ మార్పిడి ప్రక్రియ సులభతరం
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలోనే నిమిషాల వ్యవధిలో జరుగుతుండడంతో భూ మార్పిడి ప్రక్రియ ఎంతో సులభతరమైంది. ధరణి కంటే ముందు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పరిమిత సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరిగేవి. ప్రజలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద ఎక్కువ సమయం వేచి ఉండే పరిస్థితి ఉండేది. ధరణి సేవలు విజయవంతంగా కొనసాగుతుండడంతో రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకొని అనుకున్న సమయానికి వచ్చి తమ పనిని పూర్తి చేసుకొని సంతోషంగా వెళ్తున్నారు.
ధరణి సిస్టం చాలా బాగుంది..
నేను మొదటిసారి 20 గుంటల భూమి కొనుక్కున్నా. మూడు రోజుల క్రితం స్లాట్ బుకింగ్ చేశాను. భూపాలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో గంటలోనే రిజిస్ట్రేషన్ను పూర్తి చేసి కొనుగోలు చేసిన పట్టా హక్కుపత్రం నా చేతికి ఇచ్చారు. ఇంతకుముందు ఎవరి దగ్గరన్నా భూమి కొనుక్కొని పట్టా చేయించుకోవాలంటే చాలా రోజులు పట్టేదని చాలామంది చెబుతుంటే విన్నాను. కానీ ఇప్పుడు సీఎం కేసీఆర్ ధరణి తీసుకురావడం వల్ల త్వరగా రిజిస్ట్రేషన్ పూర్తయింది. డబ్బులు కూడా ఖర్చు కాలేదు. ఇంత వేగంగా రిజిస్ట్రేషన్ కావడం చాలా ఆనందంగా ఉంది. ధరణి సిస్టం బాగుంది.
– ఓరుగంటి అనూష, కొంపల్లి, భూపాలపల్లి మండలం
గతంల ఆగమాగముండేది..
కృష్ణకాలనీ, మే 28: ధరణి పోర్టల్ రాకముందు ఊర్లో శాన గొడవలయ్యేవి. ఒకల భూమిని మరొకలు పట్టా చేయించుకునేటోళ్లు. ఇంట్లో అన్నదమ్ములకు కూడా అనేక తగాదాలొచ్చేవి. రెవెన్యూ అధికార్లు కూడ ఇష్టమొచ్చినట్లు పట్టాలిచ్చేటోళ్లు. సీఎం కేసీఆర్ సారు ధరణి పోర్టల్ తీసుకువచ్చి వీటికి అడ్డుకట్ట వే సిండు.గిప్పుడు అసలైన పట్టాదార్లకు న్యాయం జరుగుతాంది. నేను కొన్నేండ్ల కింద నుంచి భూమి ని పట్టా చేసుకోవాలని తిరిగితే ఎవ్వలు కూడా చేయలే. ఆఫీసు సుట్టు తిరిగి అలిసిపోయిన. ఈ ధరణి పోర్టల్ల దరఖాస్తు చేసుకోంగనే అధికార్లే ఫోన్ చేసి నా 4 ఎకరాల భూమికి పట్టా చేసి పాస్బుక్ ఇచ్చిండ్రు. చాలా సంతోషంగ ఉంది. ధరణి లేకపోతే నా భూమి పట్టా అయ్యేది కాదు. సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– కొడారి కొమురయ్య, రైతు, వేశాలపల్లి(భూపాలపల్లి)
ధరణితో భరోసా
మొగుళ్లపల్లి, మే 28: : మేము ఆరు నెలల కింద మా ఊల్ల ఓ రైతు నుంచి ఎకరంబావు వ్యవసాయ భూమి కొన్నం. దాన్ని మా పట్టా పుస్తకంల ఎక్కించుకునేందుకు తహసీల్దార్ కార్యాలయంకు వెళ్తే స్లాట్ బుక్ చేసుకొమ్మన్నరు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకుని మా పట్టా పుస్తకంల కొనుగోలు భూమిని ఎక్కించుకున్నాం. గతంల అయితే అధికార్ల సుట్ట్టు తిరిగినా పట్టాకు ఎక్కించే వారు కాదు. భూములు ఎప్పుడు ఎవరి పేరు మీదకు మారేది తెలిసేది కాదు. ధరణి వచ్చాక ఆ పరిస్థితి మారింది. భరోసా కలిగింది.
– గైకోటి సంధ్య, మొగుళ్లపల్లి
రైతులకు ఎంతో మేలు
మహదేవపూర్, మే 28: నాకు మా ఊల్ల రెండున్నర ఎకరాల భూమి ఉన్నది. ధరణిల నా భూమి వివరాలు నమోదైనయ్. కొత్త పట్టా పాస్ పుస్తకం వచ్చింది. ఈ మధ్యనే నా భార్య స్వరూప పేర కొంత భూమి కొన్న. మీసేవల స్లాట్ బుక్ చేయంగనే అధికారులు రిజిస్ట్రేషన్ చేసిండ్లు. ఎక్కడికో పోకుండా మండలంలనే శాన అల్కగాగా పనైపోయింది. రిజిస్ట్రేషన్ అయిన ఎంబడే మాకు కాయితాలు ఇచ్చిన్రు. ఇంతకుముందు గిట్ల లేదు. భూమి రికార్డుల ఉన్నదో లేదో తెలియక శాన ఇబ్బందయ్యేది. చిన్న చిన్న సమస్యలకు కూడా ఎవుసం పనులు ఇడిసిపెట్టి నెలల తరబడి తిరిగేడిది. తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్ రైతుల కష్టాలను అర్థం చేసుకొని ధరణి తీసుకురావడంతో రైతుల భూ రికార్డులు భద్రంగ ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడినుంచైన మన భూమి వివరాలు చూసుకోవచ్చు. సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటం.
– సోమనపల్లి మహేశ్, బొమ్మాపూర్(మహదేవపూర్)
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటం
గణపురం, మే 28: గతంల పట్టాలు చేసుకోవాలంటే రెవెన్యూ ఆఫీసర్ల చుట్టు తిరిగేటోళ్లం. అయినా పనికాక పోయేది. నా భూమిని పట్టా చేయించుకోవడానికి అనేక ఇబ్బందులు పడ్డ. భూములు ఒకరివైతే పట్టాలు మరొకరి పేరు మీద వచ్చేటివి. మా తాత ముత్తాల నుంచి ఉన్న భూమి పట్టా కాకపోయే సరికి భయమయ్యేది. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ధరణి రైతులకు ఎంతో మేలు చేస్తాంది. నా భూమి వివరాలతో ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్నాక 15 రోజుల్లో రెవెన్యూ అధికారులే పిలిచి పట్టా చేసిన్రు. చాలా సులువుగా పనైంది. ధరణి పోర్టల్ తీసుకువచ్చిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటం.
– మామిళ్ల కృష్ణస్వామి గౌడ్, రైతు, గణపురం
పైసా ఖర్చులేదు..
రేగొండ, మే 28: ధరణితో పైసా ఖర్చు లేకుండా, తొందరగ పని అయితాంది. కేసీఆర్ సారు రైతు ఇబ్బందులు తెలుసుకొని ధరణిని తీసుకురావడం సంతోషంగ ఉంది. గతంల కొడుకులు, బిడ్డలకు పంచి ఇచ్చినా, అవసరాల కోసం భూములు అమ్ముకున్నా పట్టా చేసుకోవడానికి పట్వారి, గిర్దావరికి పైసలిచ్చి నెలలు తరబడి తిరిగేటోళ్లం. అయినా కూడా పనికాకపోయేది. ఒక వేళ అయినా తప్పులతోపాటు కొద్ది భూమికే పట్టా వచ్చేది. ఇదేంది సార్ అని అడిగితే ఖర్చు అయితది అనేవాళ్లు. గట్టిగ అడిగితే ఎక్కడైన చెప్పుకోపో అని చీదరించుకునేటోళ్లు. కానీ ఇప్పుడు ఆ గోస తప్పింది. పట్టాల కోసం దరఖాస్తులు పెట్టుకున్న వెంటనే ధరణిలో పేర్లు ఎక్కుతున్నయ్. తొందర్ల దస్తావేజులు చేతికి వస్తున్నాయ్. కేసీఆర్ సారు సల్లంగ ఉండాలి.
– లింగంపెల్లి రాజేశ్వర్రావు, రైతు, గూడెపల్లి(రేగొండ)
రైతుల భూములకు రక్షణ
కాటారం, మే 28: తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ రైతుల భూములకు రక్షణగా మారింది. మనం ఎక్కడ ఉన్నా భూమి భద్రంగా ఉంటుందన్న నమ్మకం వచ్చింది. ధరణి వచ్చినప్పటి సంది భూమి గొడవలు తగ్గినయ్. లేదంటే పైసలున్నోళ్లు రైతులకు తెలియకుండనే పట్టాలు చేయించుకునే పరిస్థితి ఉండేది. గతంల భూమి మన పేరు మీద ఉందో లేదో కూడా తెల్వకపోయేది. భూమి అమ్ముకున్నప్పుడో, తాకట్టు పెట్టినప్పుడో బయటపడే ది. కానీ, ధరణి భూములకు రక్షణ కవచంగా నిలిచింది. హక్కుదారుకు తెలియకుండా పట్టా మార్పు చేసే అవకాశం లేదు. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా మన భూమి మన చేతుల్లోనే ఉంటుంది. – పీచర రామకృష్ణా రావు, కాటారం
ధరణి పోర్టల్ భేష్
మహాముత్తారం, మే28: తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి సేవలు బాగున్నాయి. అంతకుముందు రెవెన్యూ కార్యాలయంల రాత పూర్వకంగ పట్టాలిచ్చేటోళ్లు. ఇది శాన కష్టంతో కూడుకొని ఉండేది. ప్రస్తుతం ఉన్న ధరణి వ్యవస్థ సులువుగా పట్టాలు చేసుకునేలా ఉంది. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి, కొనేటోళ్లు, అమ్మేటోళ్లు ఉంటే క్షణాల్లో పట్టా చేతికి వస్తుంది. నేను కొన్ని నెలల కింద సర్వే నంబర్ 88/1లో విరాసత్ కింద 0.30 గుంటల భూమిని పట్టా చేసుకున్న.
– బౌతు బాలయ్య, స్తంభంపల్లి పీపీ(మహాముత్తారం)