రాయపర్తి, మార్చి 30 : ఎంతో చరిత్ర కలిగిన మండలకేంద్రంలోని వరదరాజ వేణుగోపాల సీతారామచంద్రస్వామి ఆలయం అభివృద్ధికి రూ. 50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పారు. మండలకేంద్రంలో గురువారం సర్పంచ్ గారె నర్సయ్య, ఉత్సవ కమిటీల సారథ్యంలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకలకు దయాకర్రావు-ఉష దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాయపర్తి రామాలయానికి సుమారు 850 ఏళ్ల చరిత్ర ఉందని అనువంశిక పూజారులు చెబుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత అన్ని ప్రాంతాల్లో ఉన్న చారిత్రక ఆలయాలు, మసీదులు, ఈద్గాలు, దర్గాలు, చర్చిలు, ప్రార్థనా స్థలాల సంరక్షణ, సమగ్రాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ పాలకుర్తిలోని పలు ప్రాంతాలను ఆధ్యాత్మిక కేంద్రాలు, పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. మండలకేంద్రంలోని సీతారామచంద్రస్వామి ఆలయ సమగ్రాభివృద్ధికి తొలుత రూ. 50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రణాళికలు తయారు చేసుకోవాలని సూచించారు.
మండల కేంద్రంలోని చారిత్రక వరదరాజ వేణుగోపాల సీతారామచంద్ర స్వామి ఆలయంలో సర్పంచ్ గారె నర్సయ్య ఆధ్వర్యంలో ఆలయ అనువంశిక పూజారులు ఆరుట్ల రంగాచార్యులు, వెంకట రామకృష్ణమాచార్యులు, వెంకట రమణాచార్యుల నేతృత్వంలో స్వామి వారి కల్యాణోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దంపతులు కల్యాణోత్సవాలకు హాజరై స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. మండలంలోని కొత్తూరు, మైలారం, కాట్రపల్లి, కొండూరు, కొలన్పల్లి, పెర్కవేడు, కొండాపురం గ్రామాల్లోని శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మునావత్ నర్సింహనాయక్, జిల్లా నాయకుడు బిల్ల సుధీర్రెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్రావు, ఆయా గ్రామాలకు చెందిన ప్రజా ప్రతినిధులు లేతాకుల సుమతీయాదవరెడ్డి, బిల్ల రాధిక సుభాష్రెడ్డి, అయిత రాంచందర్, గాడిపల్లి వెంకన్న, బాద సారయ్య, కందికట్ల స్వామి, పూస మధు, నయీం, వనజారాణి, ఉస్మాన్, నర్సింహమూర్తి, రామారావు, సుధాకర్, అక్బర్, రామ్యాదవ్, సింహాద్రి పాల్గొన్నారు. అలాగే మండలంలోని మైలారం గ్రామంలో నవయుగ యూత్ అసోసియేషన్ ఆధ్యర్యంలో మహా అన్నదానం చేశారు.