కాశీబుగ్గ, మార్చి 22: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలోని కోల్డు స్టోరేజ్ల్లో మిర్చి భద్రపరిచేందుకు అవకాశం కల్పించాలని శుక్రవారం రైతులు ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు రైతులు మిర్చి బస్తాలు అమ్మేందుకు తీసుకొచ్చారు. ఖరీదుదారులు నిర్ణయించిన ధర మిర్చి రైతులకు నచ్చలేదు. వెంటనే పలువురు రైతులు తమ సరుకును కోల్డ్స్టోరేజ్ల్లో నిల్వ చేసుకుందామని చాంముండేశ్వరి కోల్డ్స్టోరేజ్కు వెళ్లగా.. వారు స్థలం లేదని ఇతరుల సరుకును దించుకున్నారు. దీంతో రైతులు సంబంధిత సిబ్బందిని కోరగా వారు నిరాకరించారు. దీంతో అక్కడే రైతులు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. కావాలనే రైతుల సరుకులు నిల్వ చేసుకొనివ్వడం లేదని, ఖరీదు వ్యాపారుల సరుకును మాత్రమే నిల్వ చేసుకుంటున్నారని ఆరోపించారు.
రైతులకు న్యాయం జరిగే వరకు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో ఎనుమాముల పోలీసు లు, మార్కెట్ కమిటీ అధికారులు చేరుకున్నారు. రైతుల సమస్యలు తెలుసుకొని సంబంధిత కోల్డ్ స్టోరేజ్ యజమానితో మాట్లాడి రైతులు మిర్చి బస్తాలు కోల్డులో వెసుకునేలా చేశారు. దీంతో రైతు లు ఆందోళన సద్దుమనిగింది. కాగా, రైతులు ఆందోళనతో జిల్లా మార్కెటింగ్ అధికారి పాలకుర్తి ప్రసాద్రావుతోపాటు గ్రేడ్-2 కార్యదర్శి రాము, గంగాధర్ కోల్డ్స్టోరేజ్లను తనిఖీ చేశారు. నిల్వ వివరాలను తెలుసుకున్నారు. కోల్డులు ఖాళీగా ఉంటే రైతులకు తప్పకుండా అవకాశం కల్పించాలని ఆదేశించారు. రైతులను ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.