నమస్తే నెట్వర్క్ : ఆకట్టుకున్న వేషధారణలు, కట్టిపడేసే సంప్రదాయ నృత్యరీతులు, వినసొంపైన గాత్రంతో పాడిన పాటలు, ఆలోచింపజేసే ఏకపాత్రాభినయ ప్రదర్శనలు.. ఇలా ఎన్నో రకాల కళారూపాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. జాతీయ స్థాయి కళా ఉత్సవ్-2022 పోటీల్లో భాగంగా రాష్ట్రస్థాయికి ఎంపిక చేసేందుకు గాను విద్యాశాఖ ఆధ్వర్యంలో బుధవారం అన్ని జిల్లాకేంద్రాల్లో ఈ పోటీలు ప్రారంభమయ్యాయి.రెండు రోజల పాటు సాగే ఈ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించిన తీరు ఔరా అనిపించింది.
జనగామలోని శాస్త్రీయ సంగీత గాత్రం, వాయిద్యాలు, జానపద సంగీత గాత్రం, అభినయం, నృత్యం, శాస్త్రీయ నృత్యం, చిత్రలేఖనం, శిల్పం బొమ్మల తయారీ, ఏకపాత్రాభినయం పోటీల్లో 83 మంది విద్యార్థులు పాల్గొనగా విజేతలకు కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య ప్రశంసా ప్రతాలు అందించి అభినందించారు. విద్యార్థులు చదువుతో పాటు కళల్లో కూడా ప్రావీణ్యం సంపాదించాలని సూచించారు. హనుమకొండలో లోకల్ క్లాసికల్, లోకల్ ట్రెడిషనల్, ఫోక్, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్, సోలో డ్రామాలో ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.