హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వానకాలం సీజన్లో సాగు చేసిన పంటల్లో అనుసరించాల్సిన యాజమాన్య పద్ధతులపై ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతులకు పలు సూచనలు చేసింది. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే పంటలను చీడపీడల నుంచి కాపాడుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచించారు. అన్ని పంటల్లో లోతు కాల్వల ద్వారా నీటిని బయటకు తీసివేయాలని చెప్పారు. సాధ్యమైనంత త్వరగా యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల కలుపును అదుపు చేయవచ్చని, మొక్కల వేర్లకు గాలి తగలడం వల్ల పెరుగుదల బాగా ఉంటుందని తెలిపారు. పంట విత్తిన నాటి నుంచి 20 రోజులు దాటినట్లయితే భాస్వరం, కాంప్లెక్స్ ఎరువులను వాడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. పంట తొందరగా కోలుకోవడానికి నీరు తగ్గిన తర్వాత సూచించిన మేరకు నత్రజనిని నేలపై వేయకుండా మట్టిలో కలిసేటట్లుగా జాగ్రత్త వహించాలని సూచించారు.
కంది
గతేడాది పోలిస్తే వర్షాకాలంలో కంది విస్తీర్ణం 1.5 లక్షల ఎకరాలు తక్కువగా ఉంది. దేశంలో 15లక్షల ఎకరాల సాగు లోటు ఉంది. ఈ సంవత్సరం కంది పంటకు ధర అధికంగా వచ్చే సూచనలున్నాయి. అందువల్ల ప్రస్తుతం కంది పంటను విత్తుకోవచ్చు. మధ్య, స్వల్పకాలిక కంది రకాలైన వరంగల్ 97 లాంటి రకాలను ఎంపిక చేసుకొని మొక్కల మధ్య ఎడం తగ్గించి(120-120 సెం.మీ) ప్రస్తుత సమయంలో విత్తుకోవచ్చు. నేలలో తేమ అధికంగా ఉన్నప్పుడు ఇనుప దాతువు లోపం వలన ఆకులు పసుపు రంగులోకి మారుతాయి. నివారణకు 5 గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్, 0.5 గ్రాముల సిట్రిక్ ఆసిడ్, 20 గ్రాముల యూరియాను లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పంటపై పిచికారీ చేయాలి. అధిక వర్షాల వల్ల ఫైటాప్తోర ఎండు తెగులు గమనిస్తే నివారణకు, 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 2 గ్రాముల మెటలాక్సిల్ మందును లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్లు బాగా తడిచేలా పిచికారీ చేయాలి.
చెరుకు
అధిక వర్షాలకు చెరుకు గడలు/మొక్కలు నేలవాలకుండా నివారించడానికి ఎండిన ఆకులతో మొక్కలను జడలు అల్లుకోవాలి. వానలు ఆగిన తర్వాత ఎకరాకు 50కిలోల పొటాష్, 50 కిలోల యూరియా మొక్కల మొదళ్ల వద్ద వేసి గుంటలు చేసి కప్పుకోవాలి.
పత్తి
పత్తి విత్తుకునే సమయం దాటిపోయింది. అందువల్ల పత్తి విత్తవద్దు. విత్తితే సరైన పెరుగుదల లేక పూత వచ్చి దిగుబడులు తగ్గుతాయి. అధిక వర్షాల వల్ల నేలలో తేమ అధికంగా ఉండడం వల్ల ఆంథోసయనిన్ పిగ్మెంట్ గాఢత పెరగడం వల్ల ఆకులు ఎరుపు లేదా గులాబీ రంగులోకి మారుతాయి. ఇది చూడడానికి మెగ్నీషియం ధాతువు లోపంలాగా కనబడుతుంది. అందువల్ల మెగ్నీషియం సల్ఫేట్ పిచికారీ చేయాల్సిన అవసరం లేదు. వర్షం వల్ల వేరు వ్యవస్థ దెబ్బతింటే 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్లు బాగా తడిసేటట్లు పిచికారీ చేయాలి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు తగ్గిన తర్వాత ఎకరాకు 25 కిలోల యూరియా, 10 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రసాయనిక ఎరువులను పైపాటుగా మొక్కలకు 3-5 సెం.మీ దూరంలో అంతే లోతులో వేసి మట్టితో కప్పాలి. కలుపు నివారించడానికి ఎకరాకు 500 మి.లీ క్విజలోఫాప్ ఇథైల్ 4శాతం ఈసీ, పైరిథాయోబ్యాక్ సోడియం 6శాతం ఈసీ లేదా 250మి.లీ ప్రోపాక్విజాఫాప్ 10శాతం ఈసీ, 250 మి.లీ పైరిథాయోబ్యాక్ సోడియం 10శాతం ఈసీ మిశ్రమం చేసి కలుపుమందును పిచికారీ చేయాలి.
మక్కజొన్న
95 నుంచి 105 రోజుల మధ్యకాలిక సంకరాలైన డీహెచ్ఎం 117, 90-95 రోజుల పంటనిచ్చే డీహెచ్ఎం 121 లేదా స్వల్పకాలిక సంకరాలను ఎంచుకొని సాగుచేసుకోవచ్చు. ఆగస్టు నెలలో విత్తిన మక్కజొన్న పైరులో కత్తెర పురుగు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నివారణకు 6.0 మి.లీ సయాంట్రానిలిప్రోల్, థయోమిథాక్సాం మందును కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకొని విత్తుకోవాలి. వర్షాలు పూర్తిగా తగ్గిన తర్వాత ఎకరాకు 20కిలోల యూరియా, 15కిలోల పొటాష్ను వేసుకోవాలి. ఆగస్టు నెలలో విత్తన మక్కజన్న పంటలో కత్తెరపురుగు ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున, పురుగు నివారణకు 8-10 లింగాకర్షక బుట్టలను పంటకు ఒక అడుగు ఎత్తులో అమర్చుకోవాలి. మోకాలు ఎత్తు దశలో ఉన్న పైరులో ఒక కిలో సున్నం, 9 కిలోల ఇసుకను కలిపి మొక్క సుడులలో వేసి కత్తెర పురుగును నివారించుకోవచ్చు. రైతులు పంటను విత్తిన 15 రోజుల వ్యవధిలో కత్తెర పురుగు గమనించినట్లయితే, నివారణకు 0.4 మి.లీ క్లోరంట్రానిలిప్రోల్ లేదా 0.5 మి.లీ స్పైనటోరం మందును లీటర్ నీటికి కలిపి ఆకు సుడుల లోపల తడిసేలా పిచికారీ చేయాలి.
వరి
వరి సాగులో ఇప్పటి వరకు నార్లు పోసుకొని రైతులు దమ్ము చేసిన పొలాల్లో స్వల్పకాలిక వరి రకాలను ఎంపిక చేసుకొని నేరుగా విత్తనం వెదజల్లుకోవాలి. ఒకవేళ తప్పనిసరిగా నార్లు పోసుకోవాలనుకునే రైతులు ఎత్తైన నారుమడుల పద్ధతిలో సిఫారసు చేయబడిన రకాలను (దొడ్డు గింజల రకాలు జేజీఎల్ 24423, కేఎన్ఎం 118, జేజీఎల్ 18047, ఎంటీయూ 1010, సన్న గింజల రకాలు.. ఆర్ఎన్ఆర్ 15048, కేఎన్ఎం 1638, డబ్ల్యూజీఎల్ 962 రకాల ఎంపిక చేసుకొని ఎకరానికి 20-25 కిలోల వరి విత్తనాన్ని ఉపయోగించి 2 గుంటల నారుమడిలో నారు పెంచి 20-25 రోజుల వయస్సు గల నారుతో నాట్లు పూర్తి చేసుకోవాలి. వరి నాట్లు వేసుకునే వారం రోజుల ముందు ఎకరాకు సరిపడా నారుమడికి 800 గ్రాముల కార్బొఫ్యూరాన్ 3జీ గుళికలను ఇసుకలో కలిపి నారుమడిలో చల్లుకోవాలి. 40-45 రోజుల వయస్సు కల్గిన స్వల్పకాలిక రకాల ముదురు నారును ఉపయోగించి నాట్లు వేసుకోరాదు. తప్పనిసరి పరిస్థితుల్లో ముదురు నారుతో నాట్లు వేసినట్లయితే ప్రత్యేక యాజమాన్య పద్ధతులు పాటించాలి. కుదుళ్ల సంఖ్యను పెంచి కుదులుకు 6-8 మొక్కల చొప్పున నాటు వేయాలి. నత్రజని ఎరువును సిఫారసు కంటే 25శాతం పెంచి మూడు దఫాలుగా గాక రెండు దఫాలుగా అంటే 70 శాతం నాటే సమయంలో మిగతా 30శాతం అంట్లు కట్టే సమయంలో వేయాలి.
నువ్వులు
నీటి వసతి ఉన్న ప్రాంతాలు, కాల్వల ద్వారా నీరు వచ్చే ప్రాంతాల రైతులు ఆగస్టు 31 వరకు శ్వేత, జేసీఎస్1020, జేసీఎస్ 2454, హిమ రకాలను ఎంపిక చేసుకొని విత్తుకోవచ్చు. పంటను చీడపీడల నుంచి రక్షించేందుకు కిలో విత్తనానికి 3 గ్రాముల సింగిల్ సూపర్ పాస్పేట్, 13 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మందును వేసుకోవాలి.