హనుమకొండ, డిసెంబర్ 1 : హనుమకొండ జిల్లాలో శాసనసభ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ పూర్తకావడంతో జిల్లా యంత్రాంగం కౌంటింగ్ ప్రక్రియపై దృష్టిసారించింది. ఆదివారం ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ గోడౌన్లలో జరిగే సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అధికార యంత్రాంగం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నది. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. అయితే, ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి, అనంతరం ఈవీఎంల లెక్కింపు ప్రారంభించనున్నారు. ఇందుకుగాను ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సిబ్బందిని నియమించి, శిక్షణ కార్యక్రమం కూడా పూర్తి చేసిన అధికారులు రెండో విడతలో భాగంగా శనివారం ఎనుమాములలో శిక్షణ ఇవ్వనున్నారు. ఒక్కొక్క నియోజకవర్గానికి 14 కౌంటింగ్ టేబుళ్లతో పాటు ఒక రిటర్నింగ్ అధికారి టేబుల్ ఉంటుం ది. ఒక్కొక్క కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక అబ్జర్వర్, ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఒక కౌంటింగ్ అసిస్టెంట్ సూపర్వైజర్ ఉంటారని అధికారులు తెలిపారు. ఇలా ప్రతి నియోజక వర్గానికి ఉంటుందని పేర్కొన్నారు. అదే విధంగా ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు ప్రత్యేకించి మీడియా సెంటర్ను ఏర్పాటు చేశారు. అలాగే, మైక్రో అబ్జర్వర్స్ వద్ద ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తయిన అనంతరం ఈవీఎంలను లెక్కించనున్నారు. ఎప్పటికప్పుడు 17సీ ద్వారా ప్రొఫార్మా-2లో వివరాలు నమోదు చేయనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. కాగా, పరకాల నియోజక వర్గానికి సంబంధించి 17 రౌండ్లు 14 టేబుళ్లు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి 18 రౌండ్లలో 14 టేబుళ్ల ద్వారా ఓట్లు లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నట్లు అధికారులు వివరించారు.
కౌంటింగ్ ప్రక్రియను వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డు లో నిర్వహించేందుకు జిల్లా యంత్రాం గం ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తాపట్నాయక్, అదనపు కలెక్టర్ మహేందర్జీ, రిటర్నింగ్ అధికారులతో కలిసి మార్కెట్ యార్డులో క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు సిబ్బందికి సలహాలు, సూచనలుఇచ్చారు. అలాగే, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. పశ్చిమ నియోజక వర్గానికి సంబంధించి ఎంఎల్ఎస్ పాయింట్ గోడౌన్ నెంబర్.4/డీలో ఏర్పాటు చేశారు. పరకాల నియోజక వర్గానికిగాను 4/సీ గోడౌన్లో కౌంటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు.