జయశంకర్ భూపాలపల్లి, మార్చి 23 (నమస్తే తెలంగాణ) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కాంట్రాక్టు ఉద్యోగాల దందా జోరుగా కొనసాగుతుంది. నిరుద్యోగుల అవసరాన్ని ఆసరా చేసుకొని దళారులు పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తూ ఉద్యోగాలు ఇప్పించక, డబ్బులు తిరిగి ఇవ్వక నరకం చూపిస్తున్నారు. దళారుల దందా ఒకవైపు, ఏజెన్సీ సంస్థల దందా మరోవైపు .. మధ్యలో నిరుద్యోగ యువతీ యువకులు నలిగిపోతున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఏజెన్సీ సంస్థలు రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు. చివరికి ఉద్యోగాల కోసం ఎదురుచూసి విసిగిపోయి రోడ్డెక్కుతున్నారు.
గ్రీవెన్స్ సెల్లో ఏజెన్సీ సంస్థపై ఫిర్యాదులు కూడా చేశారు. అయినా చర్యలు కరువయ్యాయి. జిల్లా కేంద్రాన్ని కేసీఆర్ ప్రభుత్వం ఊహించని విధంగా అభివృద్ధి చేసింది. వంద పడకల దవాఖాన (జిల్లా ఆసుపత్రి), సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్), మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి బాట చూపింది. కాగా, వంద పడకల వైద్యశాల, కలెక్టరేట్, మెడికల్ కళాశాలల్లో కాంట్రాక్టు ఉద్యోగాలు ఇప్పిస్తామని దళారులు, ఏజెన్సీ సంస్థలు నియోజకవర్గంలోని యువత, మహిళల వద్ద పెద్ద ఎత్తున వసూళ్ల పర్వం మొదలు పెట్టారు.
సెక్యురిటీ గార్డు, హౌస్ కీపింగ్, పేషెంట్ కేర్, వార్డు బాయ్లు, కంప్యూటర్ ఆపరేటర్స్ ఇలా పలు కాంట్రాక్టు ఉద్యోగాలకు ఒక్కొక్కరి వద్ద లక్షలాది రూపాయలు వసూళ్లు చేస్తున్నారు. డబ్బులు ఇచ్చినా పని కాకపోవడంతో బాధితులు దళారులు, ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారు. ఎలాంటి అర్హతలు లేకున్నా అధికారులకు ముడుపులు ఇచ్చి కొందరిని కాంట్రాక్టు ఉద్యోగాల్లో చేర్పించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు పనిచేస్తున్న వారి అర్హతలు, వారి నివాస ప్రదేశం వివరాలు పరిశీలిస్తే అవినీతి బాగోతం బయటపడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లా ఆసుపత్రి , కలెక్టరేట్, మెడికల్ కళాశాలల్లో కాంట్రాక్టు ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ. లక్ష నుంచి రూ.రెండు లక్షలు అడ్వాన్స్గా వసూలు చేసిన ఏజెన్సీ సంస్థపై బాధితులు కలెక్టర్కు గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. స్పార్క్ అండ్ సాయినాథ్ ఏజెన్సీ ప్రొప్రైటర్ ఎండీ ఖాజాపాషా తమ వద్ద డబ్బులు తీసుకుని మోసం చేశాడని బాధితులు జీ మల్లేశ్వరి, జీ మహేందర్, బీ లక్ష్మీనారాయణ, తిరుపతి, జీ రవీందర్, భద్రయ్య, రాజు, సంపత్, రాజేశ్వరి, సుమతి, సది తదితరులు వారు ఇచ్చిన డబ్బుల వివరాలతో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తమకు ఉద్యోగాలు కాదు తాము ఇచ్చిన డబ్బులు తిరిగి ఇప్పించి ఖాజాపై చర్యలు తీసుకోవాలని వారు వేడుకుంటున్నారు. స్పార్క్ అండ్ సాయినాథ్ ఏజెన్సీతో పాటు మరో ఏజెన్సీ నిర్వాహకులు సైతం ఉద్యోగాల దందా కొనసాగిస్తున్నారని బాధితులు పేర్కొంటున్నారు. దందాపై పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరుపాలని కోరుతున్నారు.