డోర్నకల్, డిసెంబర్ 12: డోర్నకల్ రైల్వే జంక్షన్లో గూడ్స్ రైలు వ్యాగన్ల మరమ్మతుల కోసం సిక్లైన్ షెడ్ నిర్మాణం పూర్తయింది. దీంతో పట్టణ ప్రజలు, రైల్వే ఉద్యోగుల ఎన్నో ఏళ్ల కల సాకారమైంది. సిక్ లైన్ షెడ్ నిర్మాణానికి 2015-16 సంవత్సర బడ్జెట్లో రూ.8.80 కోట్లు కేటాయించారు. కరోనా తదితర కారణాల వల్ల పనులు ఆలస్యంగా పూర్తి చేశారు. ఈ నె 13న డీఆర్ఎం ఏకే గుప్తా ప్రారంభించనున్నారు. సిక్ లైన్ షెడ్ ఏర్పాటుతో డోర్నకల్ రైల్వే జంక్షన్ మరింత అభివృద్ధికి చెందనున్నది. రైల్వేలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. గూడ్స్ రైళ్ల వ్యాగన్లు పట్టాలపై వెళ్లాంటే బీపీసీ ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలి. బ్రేక్ పవర్ సర్టిఫికెట్ లేని వ్యాగన్లను అనుమతించారు. గతంలో గూడ్స్ వ్యాగన్ల మరమ్మతుల కోసం సుమారుగా 200 కిలోమీటర్లు ఉన్న రామగుండం, సనత్నగర్, బెల్లంపల్లి రైల్వేల సిక్ లైన్ షెడ్కు తరలించేవారు. డోర్నకల్ రైల్వే జంక్షన్లో సిక్ లైన్ షెడ్ నిర్మించడంతో దూరాభారంతో పాటు రైల్వేకు ఖర్చు తగ్గనున్నది. షెడ్డు ఏర్పాటు చేయడంతో పట్టణ ప్రజలు, రైల్వే ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నో ఏళ్లుగా గూడ్స్ రైలు మరమ్మతులు చేసేందుకు సిక్ లైన్ షెడ్డు ఏర్పాటు చేయాలని కోరాం. షెడ్డు ఏర్పాటుతో డోర్నకల్ జంక్షన్ అభివృద్ధికి నాంది పలికినట్లయింది. ఇక్కడి రైల్వే స్టేషన్లో పలు ఎక్స్ప్రెస్స్ రైళ్ల హాల్టింగ్ కోసం జీఎం, డీఆర్ఎంకు కూడా వినతిపత్రాలు అందజేశాం. సిక్ లైన్ షెడ్డు ఏర్పాటు ఆనందంగా ఉంది. రైల్వే ఉద్యోగల సంఖ్య పెరుగుతుంది.
-ఖాదర్, డీఆర్యూసీసీ మెంబర్