కాజీపేట, జులై 10 : హనుమకొండ జిల్లాలోని కాజీపేట ఆర్ఓబి నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. గురువారం కాజిపేట ఫాతిమా నగర్ సమీపంలో కొన సాగుతున్న ఆర్ఓబి నిర్మాణ పనుల పురోగతిని అధికారుల తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఇప్పటి వరకు పూర్తయిన ఆర్ఓబి నిర్మాణ పనులను, ఇంకా పూర్తి చేయాల్సిన పనులను గురించి ఆర్ అండ్ బి శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సురేష్ బాబును కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
72 మీటర్ల బోస్ట్రింగ్ గడ్డర్స్ ఒకవైపు పూర్తయిందని, మరొకవైపు పనులు పురోగతిలో ఉన్నాయని ఈఈ సురేష్ బాబు కలెక్టర్ కు వివరించారు. ఆర్ఓబి పనులను మరింత వేగవంతం చేయాలన్నారు. ఆర్ఓబి నిర్మాణ పనులు పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేష్, కాజీపేట తహసీల్దార్ భావు సింగ్, తదితలు పాల్గొన్నారు.