వరంగల్ రూరల్: పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామానికి చెందిన ఎదురుగట్ల సమ్మక్క అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అయితే ఈ విషయం బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ దృషికి వచ్చింది. దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే.. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ. 2లక్షల 50 వేల ఎల్ఓసిని మంజూరు చేయించారు. సోమవారం హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్కు స్వయంగా వెళ్లి బాధితురాలికి అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని అన్నారు. ఆరోగ్యశ్రీలో వర్తించని వ్యాధులకు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదల వైద్యానికి అయ్యే ఖర్చులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అందిస్తోందని అన్నారు. సీఎం సహాయ నిధి ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయని తెలిపారు.