కమలాపూర్, జూలై 18 : రైతుల అభివృద్ధే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ‘మూడు గంటల కరంటు’పై మంగళవారం కమలాపూర్ రైతు వేదికలో శంభునిపల్లి, కానిపర్తి, దేశరాజ్పల్లి, కమలాపూర్ రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డి మాట్లాడుతూ ఏ రాష్ర్టాల్లో లేనివిధంగా రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంటు, కాళేశ్వరంతో సాగునీటిని అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్న పథకాలు మాకూ కావాలని మహారాష్ట్రలో రైతులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలతో డబ్బులు సంపాదించడమే రేవంత్రెడ్డి లక్ష్యమని, ఏనాడూ రైతుల కోసం పనిచేసింది లేదని మండిపడ్డారు. మూడు గంటల కరెంటన్న కాంగ్రెస్ కావాలా? మత పిచ్చి లేపే బీజేపీ కావాలా? మూడు పంటలకు నీళ్లు ఇచ్చే బీఆర్ఎస్ కావాలో రైతులు ఆలోచించుకోవాలన్నారు.
తెలంగాణ రాక ముందు కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతలతో రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో గుర్తు చేసుకోవాలన్నారు. కరెంటు కోసం హైదరాబాద్ బషీర్బాగ్లో ధర్నా చేస్తే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులను కాల్చిచంపింది నిజం కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటుతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కష్టపడి కరెంటు సమస్యను తీర్చి వ్యవసాయానికి 24 గంటలు ఇస్తున్నది నిజం కాదా? అని చర్చ పెట్టాలన్నారు. రైతులు ఒకేచోట సమావేశం పెట్టుకునేందుకు కేసీఆర్ రాష్ట్రంలో 2500 రైతువేదికలు నిర్మించినట్లు చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏనాడైన రైతుల కోసం ఆలోచన చేసిందా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి బీఆర్ఎస్ వస్తుందని, మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడన్నారు. కేసీఆర్ పాలనలో హుజూరాబాద్లో గులాబీ జెండా ఎగిరితే నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దే బాధ్యత నాదే అన్నారు.
హుజూరాబాద్లో ఎగిరేది గులాబీ జెండానే
రాబోయే ఎన్నికల్లో ఎవరెన్ని కుట్రలు చేసిన హుజూరాబాద్ నియోజకవర్గంలో గులాబీ జెండానే ఎగురుతుందని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 34వేల వ్యవసాయ కరెంటు కనెక్షన్లకు రూ.8 వందల కోట్ల సబ్సిడీ, 840 మంది రైతులకు రూ.42 కోట్ల రైతుబీమా, 10 వేల మందికి రూ.88కోట్ల కల్యాణలక్ష్మి, 26వేల మందికి కేసీఆర్ కిట్లు అందజేసినట్లు తెలిపారు. ఏడు సార్లు ఈటల రాజేందర్ను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేశాడని ప్రశ్నించారు. బీఆర్ఎస్ 9 ఏండ్ల పాలనలో జరిగిన అభివృద్ధిపై గ్రామాల్లో చర్చ పెట్టాలని రైతులను కోరారు.
నియోజకవర్గంలో కౌశిక్రెడ్డి తిరుగుతున్నాడని ఎక్కడా ప్రజల ఆదరణ వస్తుందోనని ఈటల రాజేందర్ కుట్రలు చేసి, కమలాపూర్ ముదిరాజ్ కులస్తులతో ధర్నా చేయాలని చెప్పినా వారు స్పందించలేదన్నారు. కౌశిక్రెడ్డి ముదిరాజ్లను ఎలాంటి మాట అనడని గట్టిగా నమ్మిన కమలాపూర్ ముదిరాజ్ కులస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మండలంలోని కమలాపూర్, మర్రిపెల్లిగూడెం గ్రామాల్లో పలువురు మృతుల కుటుంబాలను ఎమ్మెల్సీ పరామర్శించారు.
కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్, ఎంపీపీ తడక రాణి, జడ్పీటీసీ కల్యాణీ, సింగిల్ విండో చైర్మన్ సంపత్రావు, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు రవీందర్రెడ్డి, సర్పంచ్లు విజయ, రమేశ్, రవీందర్, ఎంపీటీసీ వెంకటేశ్వర్లు, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు అశోక్, లక్ష్మణ్రావు, శ్రీకాంత్, కార్యకర్తలు పాల్గొన్నారు.