పర్వతగిరి, సెప్టెంబర్ 25 : రైతు సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్తో కలిసి మంత్రి పలువురికి పంట నష్ట పరిహారం చెక్కులను పంపిణీ చేశారు. పర్వతగిరిలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. పలు గ్రామాలకు చెందిన 2810 మంది రైతులకు రూ. 2 కోట్ల 7 లక్షల 40 విలువైన చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పారు. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు భరోసా కల్పించాలని ఎకరాకు రూ.10 వేల నష్ట పరిహారాన్ని అందిస్తున్న గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్, సాగునీరు అందిస్తూ తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని తెలిపారు. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచనా విధానం యువతకు ఆదర్శమని మంత్రి అన్నారు.
నా బలం.. బలగం బీసీ, ఎస్సీ, ఎస్టీ, దళిత, మైనారిటీలేనని చెప్పారు. వారి అండదండలతోనే ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచానని చెప్పారు. కొత్తగా నిర్మించుకున్న సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టుకున్నామన్నారు. అంబేద్కర్ కృషి వల్లే దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటయ్యాయని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే అరూరి మాట్లాడుతూ.. అంబేద్కర్ స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలతో ముందుకు వెళ్తున్నారని చెప్పారు.
దేశంలోనే అత్యంత ఎత్తయిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసుకున్నామని వివరించారు. విగ్రహదాత ఎర్రబెల్లి ట్రస్టు చైర్మన్ ఉషా దయాకర్రావుకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పర్వతగిరి క్యాంపు కార్యాలయంలో 11 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ.4లక్షల 65వేల విలువైన చెక్కులను ఎమ్మెల్యే అరూరి అందజేశారు.
షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభం..
పర్వతగిరిలో రూ.కోటీ 5 లక్షలతో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్, గ్రంథాలయాన్ని మంత్రి, ఎమ్మెల్యే ప్రారంభించారు. అలాగే రూ.కోటీ 50 లక్షలతో చేపట్టిన అంగడి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో డీఆర్డీవో సంపత్రావు, ఎంపీడీవో చక్రాల సంతోష్కుమార్, ఎంపీపీ కమల, జడ్పీటీసీ సింగ్లాల్, పీఏసీఎస్ చైర్మన్లు మోటపోతుల మనోజ్కుమార్గౌడ్, గొర్రె దేవేందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఏకాంతంగౌడ్, శాంతిరతన్రావు, వైస్ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వర్రావు, సర్పంచ్ మాలతి, మాజీ జెడ్పీటీసీ జడిశెట్టి రాములు పాల్గొన్నారు.