హనుమకొండ చౌరస్తా, మే 24: క్రీడా రంగాన్ని ప్రోత్సహించేందుకే సీఎం కప్ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న హనుమకొండ జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు బుధవారం ముగిశాయి. ముఖ్యఅతిథిగా ఆయన lమాట్లాడుతూ రాష్ట్ర క్రీడా చరిత్రలో హనుమకొండ జిల్లాకు ప్రత్యేకత ఉందని, ఈ ఒరవడిని కొనసాగించేందుకు త్వరలో మెగా టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు చెప్పారు. అన్ని క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలనే స్పోర్ట్స్ క్యాలెండర్ రూపొందిస్తున్నట్లు, ఈ శతాబ్ది ఉత్సవాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, స్పోర్ట్స్ అధికారులు, సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించి ఆ తర్వాత నెలకో ఈవెంట్ నిర్వహించనున్నట్లు చెప్పారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజీజ్ఖాన్ మాట్లాడుతూ క్రీడాకారుల ప్రతిభ వెలుగులోకి వచ్చేందుకు సీఎం కప్ పోటీలు దోహదపడినట్లు చెప్పారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ అధికారులందరి సహకారంతో మండల, జిల్లాస్థాయిలో సీఎం కప్ పోటీలను విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు. సీఎం కప్ రాష్ట్రస్థాయి పోటీల్లో హనుమకొండ జిల్లాను ముందంజలో నిలపాలని కాంక్షించారు. జిల్లాలో సీఎం కప్ పోటీలను విజయవంతంగా నిర్వహించిన జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి గుగులోత్ అశోక్కుమార్ను అభినందించారు. విజేతలకు జ్ఞాపికలు, మెడల్స్, సర్టిఫికెట్స్ను చీఫ్ విప్, కలెక్టర్తోపాటు మున్సిపల్ కమిషనర్ షేక్ రిజ్వాన్బాషా అందజేశారు. ట్రెయినీ ఐపీఎస్ అంకిత్, డీఆర్వో వాసుచంద్ర, డీవైఎస్వో గుగులోత్ అశోక్కుమార్ నాయక్, డీఈవో అబ్దుల్ హై, డీసీపీ ఎంఎం బారి, ఏసీపీలు కిరణ్కుమార్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
కాశీబుగ్గ : వరంగల్ కాశీబుగ్గలోని ఓసిటీ స్టేడియంలో మూడు రోజులుగా జిల్లా యువజన, క్రీడల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎం కప్-2023 జిల్లాస్థాయి క్రీడా పోటీలు బుధవారం ముగిశాయి. చివరిరోజు హోరాహోరీగా జరిగాయి. ముఖ్య అతిథిగా కలెక్టర్ పీ ప్రావీణ్య హాజరై విజేతలకు సర్టిఫికెట్లు, జ్ఞాపికలు ప్రదానం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఓసిటీ మైదానంలో మూడు రోజులపాటు నిర్వహించిన ఈ క్రీడా పోటీల్లో 13 మండలాలకు చెందిన క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నట్లు తెలిపారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బాక్సింగ్, ఫుట్బాల్, స్విమ్మింగ్, అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్ విభాగాల్లో పెద్ద ఎత్తున క్రీడాకారులు పాల్గొన్నట్లు తెలిపారు. జిల్లాస్థాయిలో జరిగిన ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ప్రతిభ కనబర్చారని, ఇదే స్ఫూర్తితో రాష్ట్రస్థాయిలో రాణించాలని సూచించారు. సీనియర్ కోర్సులు, సీనియర్ క్రీడాకారులు, సీనియర్ ఆఫీసర్లతో సెలక్షన్ టీంగా ఏర్పాటు చేసి అందులో ఎంపికైన క్రీడాకారులను స్టేట్ లెవెల్కు పంపిస్తామన్నారు. వారందరికీ జిల్లా తరఫున ట్రాక్సూబ్ కూడా ఇస్తామన్నారు. ఈ క్రీడోత్సవాల విజయవంతానికి సహకరించిన సంబంధిత శాఖల అధికారులను ఆమె అభినందించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీవత్స కోట, డీవైఎస్వో ఎస్ ఇందిర, డీఆర్డీవో సంపత్రావు, డీఈవో వాసంతి పాల్గొన్నారు.