హనుమకొండ చౌరస్తా, మే 9 : ముఖ్యమంత్రి కప్ పేరిట ఈ నెల 15 నుంచి 17 వరకు మండల స్థాయిలో నిర్వహించనున్న క్రీడాపోటీలను విజయవంతం చేయాలని జిల్లా యువజన క్రీడల అధికారి గుగులోతు అశోక్కుమార్ నాయక్ పిలుపునిచ్చారు. మంగళవారం హనుమకొండ జిల్లా పీఈటీ, పీడీలతో జవహర్లాల్ నెహూ ఇండోర్ స్టేడియంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడలకు సంబంధించిన తగు సూచనలు ఇచ్చారు. పోటీల్లో క్రీడాకారులు ఎక్కువ మంది పాల్గొనేలా వ్యాయామ ఉపాధ్యాయులు చూడాలని సూచించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహమ్మద్ అజీజ్ఖాన్ మాట్లాడుతూ మండల స్థాయి కమిటీలో ఉన్న వ్యక్తులందరూ పరస్పర సహకారంతో క్రీడలను విజయవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో పీఈటీలు, పీడీలు పాల్గొన్నారు.
15న మండల స్థాయి క్రీడలు
భీమదేవరపల్లి : సీఎం కప్లో భాగంగా మండల స్థాయి గ్రామీణ క్రీడలను ఈ నెల 15 నుంచి 17 వరకు భీమదేవరపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించనున్నట్లు ఎంపీడీవో భాస్కర్ తెలిపారు. అథ్లెటిక్స్, ఫుట్బాల్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీల్లో పాల్గొనేందుకు 15-36 వయస్సు గల యువత టీమ్ల ప్రకారం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఈ నెల 12లోపు పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ క్రీడలపై బుధవారం సన్నాహాక సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మండలంలోని సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు సకాలంలో హాజరుకావాలని కోరారు.