సుబేదారి, ఫిబ్రవరి 6 : నగరంలోని చిట్ఫండ్ సంస్థల యాజమాన్యాల ఆగడాలు శృతిమించుతున్నాయి. ఖాతాదారులకు డబ్బులు చెల్లించకుండా మొండిగా వ్యహరిస్తున్నారు. చిట్టీ గడువు ముగిసి నెలలు, ఏళ్లు గడుస్తున్నా డబ్బులు ఇవ్వడం లేదు. ప్రధానంగా అక్షర, శుభనందిని, కనకదుర్గ, భవితశ్రీ, అచల చిట్ఫండ్ సంస్థల యాజమాన్యాలు ఏడాదిగా ఖాతాదారులకు డబ్బులు చెల్లించకవడంతో బాధితులు న్యాయం కోసం పోలీసు కమిషనరేట్ బాటపట్టారు. సీపీ అంబర్ కిశోర్ ఝాకు మొరపెట్టుకుంటున్నారు. అక్షర చిట్ఫండ్ నుంచి సుమారు 140 మంది, శుభనందిని 30, కనకదుర్గ 70, భవితశ్రీ నుంచి 40కి పైగా బాధితులు సీపీకి ఫిర్యాదు చేశారు. స్పందించిన సీపీ జనవరి 4న చిట్ఫండ్ సంస్థల యజమానులు, అసిస్టెంట్ రిజిస్ట్రార్, బాధితులతో సమావేశమయ్యారు. సుమారు 300పైగా బాధితులకు ఈ నాలుగు సంస్థలు రూ.4.50కోట్లు చెల్లించాలని తేలింది. ఈ డబ్బులను మూడు విడుతల్లో చెల్లించాలని సీపీ ఆదేశాలు జారీ చేశారు. సమావేశం తర్వాత ఈ నెల రోజుల్లో రూ.68 లక్షలు మాత్రమే చెల్లించినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
చిట్ఫండ్ సంస్థల ధోరణితో బాధితులు ఆ సంస్థల్లో పనిచేస్తున్న ఏజెంట్లు, ఉద్యోగులను డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలో కనకదుర్గ చిట్ఫండ్ సంస్థ మాజీ ఉద్యోగి భాస్కర్రెడ్డి ఆత్మహత్యతో చిట్ఫండ్ సంస్థల భాగోతం మరోసారి బయటపడింది. ఈ ఘటనపై సీపీ ఆరా తీశారు. మేనేజ్మెంట్ ధోరణితోనే భాస్కర్రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని అతడి కుటుంబ సభ్యులు సుబేదారి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అలాగే భాస్కర్రెడ్డి సూసైడ్నోట్ ఆధారంగా పోలీసులు కనకదుర్గ మాజీ ఎండీ తిరుపతిరెడ్డి, ప్రస్తుత ఎండీ కరుణాకర్రెడ్డిపై కేసు నమోదు చేశారు. తిరుపతిరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా, భాస్కర్రెడ్డి కుటుంబానికి ఆలేరు వెంచర్లో ప్లాట్, ఖర్చుల నిమిత్తం రూ.లక్ష ఇవ్వడానికి అంగీకరించినట్లు తెలిసింది. అలాగే ఖాతాదారులకు డబ్బుల చెల్లింపు విషయంలో ఆయా చిట్ఫండ్ సంస్థల మేనేజ్మెంట్లతో ఒకటి, రెండు రోజుల్లో సీపీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.