వరంగల్, ఏప్రిల్ 22 : చారిత్రక ఓరుగల్లు నగరంలోని భద్రకాళి ఆలయంలో భద్రకాళీ భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలు కనుల పండువగా ప్రారంభమయ్యాయి. శనివారం ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ జ్యోతి ప్రజ్వలన చేసి బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. మే 3 వరకు బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. తొలి రోజు తెల్లవారుజాము 4 గంటలకు భద్రకాళి అమ్మవారికి నిత్యాహ్నికం నిర్వహించి, గణపతి పూజ, హోమం, బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. శ్రీకాళహస్తి నుంచి వచ్చిన కళాకారులు రెండు క్వింటాళ్ల పూలతో తయారు చేసిన గజమాలతో అమ్మవారిని అలంకరించారు. అక్షయతృతీయ పర్వదినం కావడంతో భక్తులు అమ్మవారి దర్శనానికి పోటెత్తారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాల ప్రారంభానికి విచ్చేసిన చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మేయర్ గుండు సుధారాణి, పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్, రోడ్లు, భవనాల అభివృద్ధి సంస్థ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాశ్కు ఈవో శేషుభారతి ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమానికి హాజరైన ప్రముఖులకు మహామండపంలో ఆశీర్వచనం చేసి, అమ్మవారి శేషవస్ర్తాలు, ప్రసాదం అందజేశారు. తొలిరోజు కల్యాణ బ్రహ్మోత్సవాలకు జిల్లా మున్నూరుకాపు సంఘం బాధ్యులు దాతలుగా వ్యవహరించారు. కార్యక్రమంలో మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్య, జిల్లా అధ్యక్షులు కటకం పెంటయ్య, బండి కుమారస్వామి, డాక్టర్ హరిరమాదేవి పాల్గొన్నారు.