కాజీపేట/మడికొండ, జూలై 14 : ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. కాజీపేట పట్టణం 47వ డివిజన్లోని ఇంపీరిల్ కాలనీలో స్థానిక కార్పొరేటర్ సంకు నర్సింగరావు అధ్యక్షతన శుక్రవారం ప్రజలతో ముఖాముఖీ కార్యక్రమం నిర్వహించారు. పట్టణానికి చెందిన 47, 48, 61, 62, 63 డివిజన్లకు చెందిన ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని పలు సమస్యలపై వినతి పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు. అంబేద్కర్ నగర్కు మరో కమ్యూనిటీ హాల్ కావాలని, కాజీపేటలో ప్రసూతి దవాఖానను ఏర్పాటు చేయడంతోపాటు పలు సమస్కలను పరిష్కరించాలని కోరారు. వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికార యంత్రాంగం పాల్గొని ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. నగర మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టి మొదటి సారిగా కాజీపేటకు విచ్చేసిన షేక్ రిజ్వాన్ పాషాను స్థానిక కార్పొరేటర్ సంకు నర్సింగరావు శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు పోతున్నారన్నారు. సీఎం కేసీఆర్, ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం పాటుపడుతూ అనేక పథకాలను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానన్నారు.
నియోజక వర్గంలోని ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు సహకరించాలని కోరారు. కాలనీల్లో ప్రార్థనా మందిరాల నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు. గతంలో కొంతమంది ప్రభుత్వ స్థలాలు, శ్మశాన వాటిక స్థలాలను ఆక్రమించుకుంటే అడ్డుకున్నందుకు తమపై, బీఆర్ఎస్ శ్రేణులపై కేసులు పెట్టారన్నారు. ఎవ్వరైనా నోటీసులు పంపితే అధికారికంగా కోర్టును ఆశ్రయించాలని అధికారులకు సూచించారు. ప్రజల కష్ట సమయాల్లో కనిపించని వివిధ పార్టీలకు చెందిన నాయకులు ప్రస్తుతం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాలనీల్లో తిరుగుతున్నారన్నారు. ప్రజలు వారిని నిలదీయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అంబేద్కర్ కాలనీ వాసుల కోరిక మేరకు త్వరలో మరో కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తానన్నారు. కాజీపేట పట్టణ వాసుల అభ్యర్థన మేరకు ఆరోగ్యశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్రసూతి దవాఖాన ఏర్పాటుకు కృషి చేస్తానని చీఫ్విప్ హామీ ఇచ్చారు. నగరంలో అర్హులైన బీసీ కులవృత్తిదారులకు శనివారం నుంచి రూ.లక్ష అందజేయనున్నట్లు తెలిపారు. త్వరలో అర్హులైన మైనార్టీలకు కూడా రుణాలు అందజేయనున్నట్లు చెప్పారు.
కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ షేక్ రిజ్వాన్ పాషా, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, కార్పొరేటర్లు ఎలకంటి రాములు, మాసన రాంప్రసాద్, గ్రేటర్ డిప్యూటీ కమిషనర్ జోనా, ఎంహెచ్వో డాక్టర్ రాజేశ్, తహసీల్దార్ కిరణ్కుమార్, ఆర్ఐ దశరథ రామిరెడ్డి, మాజీ కార్పొరేటర్లు రావుల సదానందం, తండమల్ల వేణు, గోల్కొండ రాంబాబు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నార్లగిరి రమేశ్, సుంచు కృష్ణ, కాటపురం రాజు, దువ్వ కనకరాజు, పాలడుగుల శివకుమార్, మర్యాల కృష్ణ, సిరల్ లారెన్స్, నయీం జుబేర్, రామస్వామి, రాబర్టు, విజయ్, ప్రసాద్, శంకర్, బొట్టు రాజు, సాంబయ్య, మహమూద్, కుమారస్వామి, ఇమ్మడి రవి, బోళ్ల కుమారస్వామి, శ్రీనివాస్తో పాటు, కాలనీ అధ్యక్షుడు బుచ్చయ్య, ఈఈ రాజయ్య, డీఈ సంతోష్, ఏఈ వెంకటేశ్వర్లు , ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.