ఖిలావరంగల్, నవంబర్ 13: ఎక్కడి నుంచో వచ్చి చెప్పే వారి మాయమాటలు నమ్మి మోసపోతే.. ఐదేళ్లు గోస పడ్తామని బీఆర్ఎస్ వరంగల్ తూర్పు నియెజకవర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ రైల్వే గూడ్స్ షెడ్లో సోమవారం శావుకారి రైల్వే హమాలీ సంఘం ఏర్పాటు చేసిన సమావేశానికి నన్నపునేని హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్కసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తేనే తూర్పు నియోజకవర్గం కేంద్రంలో కలెక్టరేట్, బస్ స్టేషన్, 24 అంతస్తుల ప్రభుత్వ దవాఖాన నిర్మాణంతోపాటు అనేక అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఇతర పార్టీల నాయకులు మనుషులకు కనీస మర్యాద, గౌరవం ఇవ్వరని విమర్శించారు. వారిని కలువాలంటే కూడా కష్టతరంగా మారుతుందన్నారు. ఇక్కడే పుట్టి.. ఇక్కడే పెరిగిన తాను అందరికీ నిత్యం అందుబాటులో ఉంటున్నట్లు తెలిపారు. తాను కూడా మందమర్రిలో హమాలీ పని చేశానని గుర్తుచేసుకున్నారు. 50 కార్మిక సంఘాలకు అధ్యక్షుడిగా కొనసాగిన తనకు కార్మికుల కష్టాలు తెలుసన్నారు. 90 శాతం పేదవాళ్లు ఉన్న తూర్పు నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటానన్నారు. ప్రతి కాలనీలో మౌలిక వసతులు కల్పించినట్లు వెల్లడించారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, గృహలక్ష్మి, కేసీఆర్ బీమా, సౌభాగ్యలక్ష్మి పథకాల కింద మహిళలకు రూ. 3 వేలు, గ్యాస్ రూ. 400, సన్న బియ్యం అందించేందుకు సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోలో ప్రకటించారన్నారు. ఈ నెల 30న జరిగే పోలింగ్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కారు గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాగా, ఎన్నికల ఖర్చు కోసం హమాలీ మొగిలన్న తన ఒకరోజు కూలి రూ. 500లను ఎమ్మెల్యే నరేందర్కు అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఈగ మల్లేశం, హమాలీ సంఘం గౌరవ అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ మేయర్ కక్కె సారయ్య, కార్పొరేటర్లు చింతాకుల అనిల్, సోమిశెట్టి ప్రవీణ్, చింతాకుల సునీల్, డివిజన్ అధ్యక్షుడు పోలెపాక యాకూబ్, ఆదినారాయణ, యాకూబ్ పాషా, ఆయుబ్ఖాన్ పాల్గొన్నారు.
ఖిలావరంగల్: చిన్నవడ్డేపల్లి సమీపంలోని ఎంహెచ్నగర్కు చెందిన సీపీఎం నాయకులతోపాటు 1600 కుటుంబాలు శివనగర్లోని సాయి కన్వెన్షన్ హాలులో బీఆర్ఎస్లో చేరాయి. వీరికి ఎమ్మెల్యే నరేందర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం గుడిసె కాలనీలను అభివృద్ధి చేస్తూ సౌకర్యాలు కల్పిస్తున్న నరేందర్కే ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేశారు. గుడిసెవాసుల కష్టాలు తెలుసుకున్న ఎమ్మెల్యే పట్టాలిప్పిచే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. అనంతరం నన్నపునేని మాట్లాడుతూ సీపీఎం నాయకులను నమ్మి గుడిసెవాసులు ఎంత మోసపోయారో తనకు తెలుసన్నారు. అకడున్న కొంతమంది నాయకులు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, గుడిసెవాసుల పక్షాన నిలబడి పట్టాలు అందించానని చెప్పారు. పార్టీలో చేరిన వారిలో సీపీఎం నాయకులు జన్ను సురేశ్, దిడ్డి సుమన్, కల్యాణి, సునీత, ముకేశ్తోపాటు సుమారు 1600 కుటుంబాలు ఉన్నాయి. కార్యక్రమంలో కార్పొరేటర్ వేల్పుగొండ సువర్ణ, నాయకులు బోగి సురేశ్, దుబ్బ శ్రీనివాస్, మర్రి శ్రీనివాస్ పాల్గొన్నారు.
కాశీబుగ్గ: వరంగల్ తూర్పు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి అభివృద్ధిలోనూ, కార్యకర్తలకు ఆపదలోనూ తానుంటానని, ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని నన్నపునేని కోరారు. 20వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ బయ్యాస్వామి ఆధ్వర్యంలో వివిధ పార్టీల నుంచి పలువురు బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్కు 20వ డివిజన్ కంచుకోట అని ఎమ్మెల్యే అన్నారు. కార్మిక, కర్షక వర్గాలు అధికంగా ఉండే ఈ ప్రాంతానికి సంక్షేమ పథకాలు పెద్ద సంఖ్యలో అందుతున్నాయన్నారు. గత పాలకులు ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తే.. తాను ప్రత్యేక చొరవతో అభివృద్ధి చేసినట్లు చెప్పారు. ఇక్కడ పోటీ చేసే కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు వర్ధన్నపేట, వంచనగిరి నుంచి వలస వచ్చారని, తాను లోకల్ అని తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీ సభ్యుడు మనోహర్, నాయకులు ముష్కే ప్రమీల, పెండ్యాల సోను, దూపం నరేశ్, క్రాంతికుమార్, కుసుమ నరేశ్ పాల్గొన్నారు. కాగా, 18వ డివిజన్కు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు జీలకర వీరస్వామి ఎమ్మెల్మే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఈగ మల్లేశం, చింతాకుల సునీల్ పాల్గొన్నారు.
కరీమాబాద్: కేసీఆర్ ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ సాధించేలా పార్టీ కార్యకర్తలందరూ శాయశక్తులా కృషి చేయాలని ఎమ్మెల్యే నరేందర్ పిలుపునిచ్చారు. 39వ డివిజన్లోని అన్నపూర్ణ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ఎన్నికల్లో ప్రచార శైలి, అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రతివ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. సమావేశంలో కార్పొరేటర్ సిద్ధం రాజు, పార్టీ డివిజన్ అధ్యక్షుడు బొరిగం నర్సింగం, మాజీ కార్పొరేటర్ మెడిద రజిత, మధు, సురేశ్, అబ్జల్, కొమ్మిని రాజేందర్, బత్తుల కిషన్ పాల్గొన్నారు.
వరంగల్చౌరసా: వరంగల్ తూర్పు నియోజకవర్గం మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 36వ డివిజన్ చింతల్లో నిర్వహించిన గ్యార్మీ షరీఫ్ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మతాన్ని అడ్డుపెట్టుకొని మైనార్టీలను కొందరు ఓటు బ్యాంకుగా భావిస్తే.. మరికొందరు నాయకులు మతరాజకీయాలు చేస్తున్నారని, వారితో అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే కోరారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలోని హిందూ ముస్లింలు సోదరభావంతో కలిసిమెలిసి ఉంటున్నారన్నారు. రాజకీయాల కోసం మతాన్ని అడ్డుపెట్టుకునే నాయకులను నియోజకవర్గంలో తిరగనివ్వొద్దని కోరారు. అనంతరం ముస్లిం మతపెద్దలు ఎమ్మెల్యేను పూలమాలతో సత్కరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఈగ మల్లేశం, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్, పార్టీ డివిజన్ అధ్యక్షుడు వేల్పుగొండ యాయ్య, గడల రమేశ్, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం మతపెద్దలు, గురువులు పాల్గొన్నారు.
పోచమ్మమైదాన్/గిర్మాజీపేట: వరంగల్ పోచమ్మమైదాన్లోని ఐపీసీ చర్చిలో తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను పాస్టర్లు ఆశీర్వదించారు. ఆయన వెంట కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి, పార్టీ డివిజన్ ఇన్చార్జి మావురపు విజయభాస్కర్రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు కంచర్ల శివ, పార్టీ నాయకులు ఉన్నారు. అంతేకాకుండా కృతజ్ఞతార్పణ పండుగ సందర్భంగా 25వ డివిజన్ మండిబజార్ సెంటినరీ ట్రినిటీ బాప్టిస్ట్ చర్చిలో ఎమ్మెల్యే నరేందర్ పాల్గొని ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బస్వరాజు శ్రీమాన్, జన్ను స్కైలాబ్, విల్సన్, బాబు, చిరంజీవి పాల్గొన్నారు. అలాగే, 33వ డివిజన్ పెరుకవాడకు చెందిన సీనియర్ బీజేపీ ఎస్సీ సెల్ జిల్లా మోర్చా ఉపాధ్యక్షుడు జిలకర వీరస్వామితోపాటు 41వ డివిజన్కు చెందిన అబ్దుల్, అఫ్జల్తోపాటు 50 మంది బీఆర్ఎస్లో చేశారు. కార్యక్రమంలో మైనారిటీ నాయకులు ఫిరోజ్, ముక్తర్ పాల్గొన్నారు.