జనగామ చౌరస్తా, మార్చి 17: ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు, పెట్రోల్ బంకులు ఇప్పిస్తామని చెప్పి అమాయక ప్రజలను మోసం చేసి, వారి నుంచి రూ.1.06కోట్లు వసూలు చేసిన నలుగురు నిందితుల ముఠాను అరెస్ట్ చేసినట్లు జనగామ ఏసీపీ పండేరి చేతన్ నితిన్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం అర్బన్ పీఎస్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ వివరాలు వెల్లడించారు. ఏసీపీ కథనం ప్రకారం.. జనగామ జిల్లా కేంద్రంలోని పూర్ణిమ కాలనీకి చెందిన పురోహితుడు బెలిగిని శివకుమార్, కరీంనగర్ జిల్లా దమ్మక్కపేటకు చెందిన (ప్రస్తుతం ఆదిలాబాద్ టౌన్) ఎస్ఎస్ కన్సల్టెన్సీ నిర్వాహకుడు ఇల్లందుల శ్రీనివాస్, చిగురుమామిడికి చెందిన పురోహితుడు ఆకవరం సాయిచరణ్, భూపాలపల్లి జిల్లా చిట్యాలకు చెందిన ఫొటోగ్రాఫర్ ధరావత్ రాజేశ్ ముఠాగా ఏర్పడి అమాయకుల అవసరాలను ఆసరాగా చేసుకొని నట్టేట ముంచేవారు. వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవారు.
జనగామకు చెందిన పురోహితుడు శివకుమార్ తనకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖ, స్పీకర్ గడ్డం ప్రసాద్తోపాటు పోలీసుశాఖలో సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్తో చాలా దగ్గరి సంబంధాలున్నాయని అమాయక ప్రజలను నమ్మించేవారు. వారికి స్థానిక ప్రభుత్వ కార్యాలయాల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు, పెట్రోల్ బంకులు ఇప్పిస్తానని చెప్పి నలుగురు బాధితుల నుంచి రూ.1.06కోట్ల నగదు వసూలు చేశారు. ఇలా మోసపూరితంగా సంపాదించిన డబ్బులను శివకుమార్ తన అల్లుడు సాయిచరణ్, ఇల్లందుల శ్రీనివాస్, ధరావత్ రాజేశ్కు పంపేవాడు.
ఆ తర్వాత ఈ నలుగురు కలిసి ఆ డబ్బులను తమ వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకొని, విలాసవంతమైన జీవితం గడిపేవారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు, పెట్రోల్ బంకులకు ఆశపడి జనగామ చెందిన నలుగురు బాధితులు రూ.1.06కోట్లు కోల్పోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు జిల్లా కేంద్రంలోని హనుమకొండ రోడ్డు పెట్రోల్ బంకు వద్ద నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఏసీపీ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభకనబర్చిన అర్బన్ సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్సై భరత్, సిబ్బందిని వరంగల్ సీపీ సన్ప్రీత్సింగ్, వెస్ట్జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్ అభినందించారు.