పేదలకు మరింత మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 2వేల పడకల సామర్థ్యంతో వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను నిర్మిస్తున్నది. ఇటీవల సీఎం కేసీఆర్ దవాఖాన నిర్మాణ పనులను పరిశీలించారు. తర్వాత హైదరాబాద్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి బెడ్స్ కెపాసిటీని 2,458కి పెంచాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి సూచనలతో అధికారులు హాస్పిటల్ నిర్మాణ పనుల్లో మార్పులు చేశారు. దవాఖాన చుట్టూ రెండు అంతస్తుల ఎత్తుతో కొత్తగా పోర్టికో నిర్మిస్తున్నారు. ప్లింత్ ఏరియా కూడా 16.55 నుంచి 19.83 లక్షల చదరపు అడుగులకు పెరిగింది. దసరా వరకు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో అధికారులు నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచారు. ఇటీవలే డ్రైనేజీ, గార్డెన్ నిర్మాణ పనులనూ ప్రారంభించారు.
వరంగల్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) : మెడికల్ రంగంలో దేశంలోనే అతిపెద్దదైన వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన పడకల కెపాసిటీని మరింత పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2,458 పడకల సామర్థ్యంతో ఈ హాస్పిటల్ నిర్మాణ పనులు జరగాలని రహదారులు, భవనాల (ఆర్అండ్బీ) శాఖ అధికారులను ఆదేశించింది. దీంతో హాస్పిటల్ భవనం ప్లింత్ ఏరియా 19.83 లక్షల చదరపు అడుగులకు పెరిగింది. ఈ మేరకు హాస్పిటల్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సూచనలతో ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. హెల్త్సిటీలో భాగంగా వరంగల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.1,116 కోట్లతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేపట్టింది. సెంట్రల్ జైల్ స్థలం నుంచి ఈ దవాఖాన నిర్మాణం కోసం 56.39 ఎకరాలను కేటాయించింది.
ఇందులో సుమారు 42.42 ఎకరాల విస్తీర్ణంలో రెండు వేల పడకల సామర్థ్యంతో కూడిన 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి ఆర్అండ్బీ ఇంజినీర్లు డిజైన్ రూపొందించారు. నిర్మాణ పనులను ఈపీసీ మోడ్లో ఎల్అండ్టీ సంస్థ దక్కించుకుంది. హాస్పిటల్ నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఎల్అండ్టీ సంస్థ పద్దెనిమిది నెలల్లో ఈ దవాఖాన నిర్మాణ పనులను పూర్తి చేయడానికి గత సంవత్సరం మే నెల 8న ప్రభుత్వంతో అగ్రిమెంటు కుదుర్చుకుంది. ఈ మేరకు 2023 నవంబర్ 8లోగా పూర్తి చేసే లక్ష్యంతో ఎల్అండ్టీ సంస్థ మే నెలలో ఈ హాస్పిటల్ నిర్మాణ పనులను మొదలుపెట్టింది. పగలు రాత్రి నిరంతరం షిప్టుల పద్ధతిలో పనులు కొనసాగుతున్నాయి. జెట్ స్పీడ్తో నడుస్తున్న ఈ పనులను ఆర్అండ్బీ ఇంజినీర్లు పర్యవేక్షిస్తున్నారు. వచ్చే దసరాలోగా పనులను పూర్తి చేసే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది.
సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు హాస్పిటల్ నిర్మాణ పనులపై ఉన్నత స్థాయి సమీక్ష జరుపుతూ సూచనలు చేస్తున్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పలుమార్లు ఈ దవాఖాన నిర్మాణ పనులను పరిశీలించారు. గత అక్టోబర్ ఒకటిన సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటనలో మంత్రులతో కలిసి హాస్పిటల్ను సందర్శించారు. క్షేత్రస్థాయిలో నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులు ఇక్కడ ఏర్పాటు చేసిన చిత్రాలను పరిశీలించి కొంత అసహనం వెలిబుచ్చారు. తాను సూచించిన రీతిలో హాస్పిటల్ నిర్మాణ పనులు జరగడం లేదన్నారు.
నిర్మాణ పనుల్లో మార్పులు..
సీఎం కేసీఆర్ సందర్శన అనంతరం వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనుల్లో మార్పులు జరిగాయి. పర్యటన తర్వాత ముఖ్యమంత్రి హైదరాబాద్లో ఈ దవాఖాన నిర్మాణ పనులపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆయన సూచనలతో అధికారులు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనుల్లో మార్పులు చేశారు. ఈ మేరకు ఇటీవల ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో ఈ హాస్పిటల్ పడకల సామర్థ్యం రెండు వేల నుంచి 2,458కి పెరిగింది. వీటిలో 12 రికవరీ, 30 డేకేర్, 39 ఎమర్జెన్సీ, 385 ఐసీయూ, 38 పోస్టు ఓపీ, 34 ప్రీ ఓపీ, 1,608 వార్డ్సు, 40 సెమీ, ప్రైవేట్, 6 వీఐపీ, 10 డీలక్స్, 6 ప్రైవేట్, 250 పీఎంఎస్ఎస్వై బెడ్స్గా నిర్ణయించింది. పడకల సామర్థ్యం పెరుగడంతో ఈ హాస్పిటల్ నిర్మాణానికి సంబంధించి ప్లింత్ ఏరియా పెరిగింది.
మొదట రెండు వేల పడకల కెపాసిటీతో 24 అంతస్తుల హాస్పిటల్ను 16,55,923 చదరపు అడుగుల ప్లింత్ ఏరియాతో నిర్మించేందుకు ఆర్అండ్బీ ఇంజినీర్లు డిజైన్ చేశారు. తాజాగా బెడ్స్ కెపాసిటీ పెరుగడంతో ప్లింత్ ఏరియా 19,83,172 చదరపు అడుగులకు ఎగబాకింది. హాస్పిటల్ బ్లాక్ 18,77,556 చదరపు అడుగులు, దర్శనం 45,779, కిచెన్, డైనింగ్ 22,109, లాండ్రీ 5,920, యుటిలిటీ బ్లాక్ 31,539, సెక్యూరిటీ క్యాబిన్ 269 చదరపు అడుగులతో నిర్మాణం జరుగనుంది. సీఎం కేసీఆర్ సందర్శించడానికి ముందు అధికారులు ఈ హాస్పిటల్ ముందు భాగంలో ఎమర్జెన్సీ, వెనుక భాగంలో ఓపీటీ వద్ద మాత్రమే పోర్టికో నిర్మించేందుకు డిజైన్ చేశారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ సూచనలతో హాస్పిటల్ చుట్టూ రెండంతస్తుల ఎత్తు వరకు పోర్టికో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దవాఖాన బ్లాక్ను ఆనుకుని కూడా అదనంగా భవన నిర్మాణ పనులను చేపట్టారు.