తెలుగు వత్సరాది.. ఉగాది వచ్చింది.. శోభకృత్ నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ శుభకృత్ నామ సంవత్సరం వెళ్లిపోయింది. తమ జీవితాల్లో కోటి కాంతులు నిండాలని కోరుకుంటూ ‘ఉగాది’ని నేడు ఘనంగా నిర్వహించుకునేందుకు జిల్లా ప్రజానీకం సిద్ధమైంది. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో పంచాంగ పఠనాలు, పచ్చళ్ల పంపిణీ, ఆలయాల్లో ప్రత్యేక పూజల కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి.
నర్సంపేట రూరల్, మార్చి 21: ఉగాదిని బుధవారం ఘనంగా జరుపుకొనేందుకు జిల్లావాసులు సిద్ధమయ్యారు. ఇళ్లను మామిడి తోరణాలతో అలంకరించి, ఉగాది పచ్చడిని స్వీకరించి, బూరెలు లాగించి, కబుర్లలో మునిగితేలనున్నారు. దేవాలయాలు ప్రత్యేక శోభను సంతరించుకోగా, వేద పండితుల పంచాంగ పఠణాలు చేసి భవిష్యత్ను ఆవిష్కరించనున్నారు. ఉగాది వేడుకల్లో ఆధ్యాత్మిక, ధార్మిక చింతన భావాలతో పాటు ఆరో గ్య సూత్రాలూ మిళితమై ఉన్నాయి.
ఈ వసంత రుతువులో కఫం ప్రకోపిస్తుంది. దాన్ని నివారించేందుకు కటు, తిక్త, కషాయ రసాలు ఉపకరిస్తాయి. అందుకే ఉగాదిన సంపూర్ణ ఆరోగ్యానికి షడ్రుచులను పచ్చడి రూపంలో స్వీకరిస్తారు. భిన్నమైన రుచులను ఒక చోట చేర్చడం జీవితంలోని సమన్వయత్వానికి సంకేతం. ఈ పండుగ వచ్చేటప్పటికి రుతువుల్లోని తేడా వల్ల కొంత అనారోగ్యం కలుగుతుంది. ఆ అనారోగ్యాన్ని తొలగించేదే ఉగాది పచ్చడి. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణం అనే ఐదు అంశాలు గల శాస్త్రం పంచాం గం. ఈ పర్వదినాన వివిధ ప్రాంతాలు, ఆలయాల్లో పంచాంగ పఠనాలు కొనసాగనున్నాయి.
కొత్తసాలుకు శ్రీకారం…
తొలుత వచ్చే ఉగాదితోనే రైతులు వ్యవసాయ పనులు మొదలుపెడుతారు. ఎద్దులను కడిగి శుభ్రం చేసి బొట్లుపెట్టి అలంకరిస్తారు. వ్యవసాయ పనిముట్లకు పూజలు చేస్తారు. తెల్లవారుజామునే అరక కట్టి ఐదు సార్లు దుక్కి దున్నుతారు. చేలల్లోని మొక్కల కొమ్మలను కొట్టేసి ఒక చోట చేర్చుతారు. నాగలికట్టుకొని తొలిసాలు పెట్టడాన్నే ‘కొత్తసాలు’ అంటారు. మహిళలు పత్తి, మక్క, ఇతర పంటల మొదళ్లు, చెత్తను తొలగిస్తారు. విశ్వబ్రాహ్మణులు ఈ పండుగను మూడురోజుల పాటు ఘనంగా జరుపుకొంటారు. తమ పనిముట్లు దేవుళ్ల వద్ద పెట్టి పూజలు చేసి పూర్తిగా ఆధ్యాత్మికంలో లీనమవుతారు.