కాశీబుగ్గ, ఫిబ్రవరి 4 : క్యాన్సర్లను తొలిదశలోనే గుర్తిస్తే నివారించొచ్చని, వాటి లక్షణాలు కనబడితే వెంటనే వైద్యులను సంప్రదించాలని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సర్వీసెస్, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ వరంగల్ చైర్మన్ జడ్జి రాధాదేవి అన్నారు. శనివారం 3వ డివిజన్ ఆరెపల్లిలోని ప్రతిమ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్లో క్యాన్సర్పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసి రోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుత జీవన విధానం, ఆహారపు అలవాట్లు, అధిక ఒత్తిడి, పంటలపై రసాయన ఎరువులు వాడకం పెరగడంతో ఎంతో మందికి క్యాన్సర్ తదితర జబ్బులు వస్తున్నాయని పేర్కొన్నారు. నగరంలో అత్యాధునిక సదుపాయాలతో ఇంత పెద్ద దవాఖానను నిర్మించడం అభినందనీయమన్నారు.
ప్రతిమ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్, అంకాలజిస్ట్ మద్ది రాహుల్ నారాయణ మాట్లాడుతూ.. క్యాన్సర్ కణాలు జీర్ణ, నాడీ, ప్రసరణ వ్యవస్థలను ప్రభావితం చేసే అవకాశం ఉందని తెలిపారు. సర్జికల్ అంకాలజిస్ట్ తిప్పని అవినాశ్ మాట్లాడుతూ.. స్కానింగ్ ద్వారా ముందస్తుగా క్యాన్సర్లను గుర్తించే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. ప్రతిమ క్యాన్సన్ దవాఖానలో అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నట్లు చెప్పారు. ట్రిపుల్ ఎఫ్ టెక్నాలజీ కలిగిన ఐఎంఆర్టీ, ఐజీఆర్టీ, వీఎంఏటీ, ఎస్ఆర్ఎస్, ఎస్బీఆర్టీ రేడియేషన్ తదితర అత్యాధునిక వైద్య పరికరాలు ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ జే ఉపేందర్రావు, ప్రిన్సిపల్, జిల్లా సెషన్స్ జడ్జి, జిల్లా న్యాయ సేవల అథారిటీ హనుమకొండ చైర్మన్ ఎం కృష్ణమూర్తి, ప్రతిమ దవాఖాన డైరెక్టర్ డాక్టర్ ప్రతీక, క్యాన్సర్ వైద్యులు హర్షిణి, సుమిత్ర, వినీత్, అనిల్ జంపాని,విష్ణువర్ధన్రెడ్డి, హజ్రత్ నంద్యాల్, అభినవ్ పాల్గొన్నారు.