జిల్లాలోని గీసుగొండ మండలం మొగిలిచర్ల గ్రామానికి చెందిన పలు పశువులకు లంపీస్కిన్ వ్యాధి సోకినట్లు నిర్ధారణ కావడంతో పశుసంవర్ధక శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. వ్యాధి వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. మూగ జీవాలకు వ్యాధి సోకిన గ్రామం నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిలోని పశువులకు టీకాలు వేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే జిల్లాకు ఇరవై వేల టీకాలను సరఫరా చేయగా, సుమారు ఏడు వేల పశువులకు కొద్ది రోజుల నుంచి టీకాలు వేసినట్లు అధికారులు తెలిపారు. లంపీస్కిన్ వ్యాధిపై రైతులు ఆందోళన చెందొద్దని, వైరస్ నిర్మూలనకు కృషి చేస్తున్నట్లు జిల్లా పశుసంవర్ధక అధికారి డాక్టర్ బాలకృష్ణ చెప్పారు. వ్యాధి సోకిన పశువులను ఇతర జీవాల నుంచి వేరు చేసి వైద్యశాలకు తరలించాలని, లక్షణాలను బట్టి చికిత్స అందిస్తామని తెలిపారు.
వరంగల్, అక్టోబర్ 13(నమస్తేతెలంగాణ) : జిల్లాలో పశువులకు లంపీ స్కిన్ వ్యాధి సోకుతున్నది. రోజురోజుకీ ఈ వ్యాధి వ్యాప్తి చెందుతున్నది. కొద్ది రోజుల క్రితం గీసుగొండ మండలం మొగిలిచర్ల గ్రామంలో పశువులకు లంపీ స్కిన్ వ్యాధి సోకినట్లు పశుసంవర్ధక శాఖ అధికారులు గుర్తించారు. చికిత్స కోసం ఓ రైతు తన పశువులను దవాఖానకు తోలుకురాగా ఈ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు అనుమానం రావడంతో నిర్ధారణ కోసం రక్త నమూనాలను భోపాల్కు పంపారు. పరీక్షల్లో మూడు పశువులకు వ్యాధి సోకినట్లు వెల్లడైంది. దీంతో అప్రమత్తమైన అధికారులు జిల్లాలో వ్యాధి వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. వ్యాధి సోకిన పశువులకు ట్రీట్మెంట్ చేస్తున్నారు. జిల్లాలో నల్ల, తెల్ల జాతి పశువులు కలిపి రెండు లక్షలకుపైగా ఉన్నాయి. వ్యాధి తెల్ల జాతి పశువులకు ఎక్కువగా సోకుతున్నదని, నల్ల జాతి పశువుల్లో తక్కువగా ప్రబలుతున్నదని అధికారులు చెపుతున్నారు.
జిల్లాలో చివరిసారి ఈ వ్యాధి 2020లో పశువులకు సోకింది. ఆ సమయంలో కరోనా మహమ్మారి విజృంభించినప్పటికీ ఈ వ్యాధి సోకిన పశువులకు ట్రీట్మెంట్ చేశారు. మళ్లీ ఈ ఏడాది పశువులకు లంపీ స్కిన్ వైరస్ సోకడంతో అలర్ట్ అయ్యారు. ఒకవైపు వ్యాధి వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూనే, వైరస్ సోకిన పశువులకు చికిత్స అందిస్తున్నారు. మొగిలిచర్ల గ్రామంలో వెలుగులోకి వచ్చిన ఈ వ్యాధి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు వ్యాప్తి చెందినట్లు తెలిసింది. సంగెం, దుగ్గొండి, నల్లబెల్లి, నర్సంపేట, ఖానాపురం తదితర మండలాల్లోని పలు గ్రామాల్లో పశువులకు లంపీ స్కిన్ వ్యాధి సోకినట్లు అధికారులు కనుగొన్నారు. తెల్లజాతికి చెందిన ఆవులు, ఎద్దుల్లో అధికంగా సోకుతున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో వ్యాధి వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యగా పశువులకు టీకాలు వేస్తున్నారు.
లక్షణాలు ఇవే..
వ్యాధి సోకిన పశువుల్లో 105 డిగ్రీల జ్వరంతో పాటు కళ్లల్లో నీరు కారడం, ముక్కు నుంచి స్రావాలు, శరరీమంతా బొడిపెలు రావడం, లింపీ గ్రంథుల వాపు, కణతలు గుండ్రంగా, చర్మంపై ఉబ్బెత్తుగా 1-5 సెమీ వ్యాసంతో ఏర్పడడం, మేత తగ్గించడం, పాలు తగ్గించడం వంటి లక్షణాలు కన్పిస్తాయి. ఈ లక్షణాలు కనబడితే వ్యాధి సోకినట్లు రైతులు గుర్తించాలని పశు సంవర్ధక శాఖ జిల్లా అధికారి డాక్టర్ బాలకృష్ణ చెప్పారు. మెడ, పక్కటెముకలు, కాళ్లు, వెన్నెముక ఇరు ప్రాంతాలు, పొదుగు, ఇతర ప్రాంతాల్లో కనిపించే లక్షణాలను బట్టి కూడా ఈ వ్యాధి సోకినట్లు నిర్ధారించవచ్చని తెలిపారు. దీనిపై రైతులు ఆందోళన చెందొద్దని, ఈ వైరస్తో పశువులు చనిపోవన్నారు. ప్రధానంగా యాంటీ బయాటిక్స్, యాంటీ హిస్టమిస్ మందులను పశువైద్యుల సూచనల అందించాలని చెప్పారు. గుంతల వలె ఏర్పడిన గాయాలకు యాంటీ బయాటిక్స్తో కూడిన ఆయింట్మెంట్ పూయాలని, ఈగలు వాలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
పశువులకు టీకాలు వేస్తున్నాం..
– డాక్టర్ బాలకృష్ణ, పశుసంవర్ధక శాఖ
జిల్లా అధికారి
ప్రస్తుతం లంపీ స్కిన్ వ్యాధి సోకిన గ్రామంతో పాటు ఐదు కిలోమీటర్లలోపు ఉన్న గ్రామాల్లోని పశువులకు ముందు జాగ్రత్తగా టీకాలు వేస్తున్నాం. వ్యాధి సోకినట్లు నిర్ధారణ జరిగిన మొగిలిచర్ల గ్రామంతో పాటు బొడ్డుచింతలపల్లి, గొర్రెకుంట, రెడ్డిపాలెం, కొత్తపేట గ్రామాల్లోని పశువులకు టీకాలు వేశాం. త్వరలోనే జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది.
లంపీస్కిన్ వ్యాధితో దూడ మృతి
ఖానాపురం, అక్టోబర్ 13 : మండలంలోని బుధరావుపేటలో పశువులకు లంపీస్కిన్ వ్యాధి సోకింది. గ్రామానికి చెందిన రైతు గారె మల్లయ్యకు చెందిన లేగదూడ ఈ వైరస్తో గురువారం మృతిచెందింది. అలాగే, గ్రామంలోని పలు పశువులు ఈ వ్యాధి బారిన పడ్డాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే వైరస్ సోకకుండా పశువులకు టీకాలు వేయాలని కోరారు.