స్టేషన్ఘన్పూర్, జూన్ 4 : అర్హులకు ఇందిరమ్మ ఇండ్లివ్వాలని డిమాండ్ చేస్తూ బుధవారం స్టేషన్ఘన్పూర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అనర్హులను ఎంపిక చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. నిరుపేదలకు కాకుండా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, పైసలు ఇచ్చిన వారికే ఇందిరమ్మ ఇండ్లను కేటాయించారని వారు ఆరోపించారు.
మొదటి జాబితాలో అర్హులైన నిరుపేదల పేర్లు వచ్చాయని, వారు ఇంటి నిర్మాణానికి ముగ్గు పోసుకోవడానికి సిద్ధం కాగా, తుది జాబితాలో అనర్హులను ఎంపిక చేశారని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో పార్టీ శ్రేణుల ప్రమేయం లేదని, అధికారులే సమగ్ర విచారణ చేపట్టి నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేశారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనడం విడ్డూరమన్నారు.
మరోసారి విచార ణ చేపట్టి, అనర్హులను పేర్లను తొలగించి అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేనియెడల పేదలతో కలిసి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మునిగల రాజు, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు మారపల్లి ప్రసాద్, సీనియర్ నాయకులు పెసరు సారయ్య, బంగ్లా శ్రీనివాస్, కలకోల సమ్మయ్య, పార్శి రంగారావు, నక ప్రవీణ్, గోవింద్ అశోక్, వీరాసింగ్ పాల్గొన్నారు.