స్టేషన్ఘన్పూర్, సెప్టెంబర్ 18: బీఆర్ఎస్ మ్యానిఫెస్టోతో బరిలో నిలిచి, పార్టీ శ్రేణుల శ్రమతో గెలిచి, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోని ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాజీనామా చేయాలంటూ జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్లో గులాబీ శ్రేణులు పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. గురువారం స్టేషన్ఘన్పూర్లోని మున్సిపాలిటీ బీఆర్ఎస్ కన్వీనర్ కనకం గణేశ్ ఆధ్వర్యంలో కడియం రాజీనామా చేయాలంటూ హనుమకొండలోని ఆయన ఇంటి అడ్రస్కు బీఆర్ఎస్ శ్రేణులు పోస్టు కార్డులు పంపించారు.
ఈ సందర్భంగా గణేశ్, మున్సిపాలిటీ కో కన్వీనర్ పెసరు సారయ్య మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిపించమని కడియం వేడుకోగా, అధిష్ఠానం ఆదేశాల మేరకు గెలిపించామన్నారు. అధికార దాహంతో, తన కూతురును ఎంపీ చేయాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ను, శ్రేణులను మోసం చేసి కడియం కాంగ్రెస్లో చేరారని విమర్శించారు. పార్టీ ఫిరాయింపుల కేసు విషయం లో తను ఏ పార్టీలో ఉన్నాడో స్పీకర్కు వివరణ ఇచ్చే ధైర్యం కడియంకు లేదన్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచిన కడియం ఇప్పటికైనా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని, లేని పక్షంలో నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి కడియం ఇంటికి, స్పీకర్కు కూడా పోస్టు కార్డు లు పంపించే ఉద్యమాన్ని ఉధృతం చేయడమే కాకుండా, గ్రామాల్లో తిరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. సమస్యల పరిష్కారంలో ప్రజలకు కడియం అండగా ఉంటాడని నమ్మి గెలిపించామని, నెల రోజులుగా రైతులు యూరియా కోసం తిండీతిప్పలు లేకుండా నానా ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ కారు గుర్తుపై గెలిచిన కడియం వారసత్వ రాజకీయాల కోసం పార్టీ మారినప్పటి నుంచి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీ గుర్తుతో గెలవాలని ఎన్నిమార్లు డిమాండ్ చేసినా పట్టించుకోవడం లేదన్నారు. కడియం రాజీనామా చేసే వరకు అవసరమైతే మరో సకల జనుల సమ్మె చేపడతామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సురేశ్ కుమార్, ఒగ్గు రాజు, పార్శి రంగారావు, గుండె మల్లేశ్, మారపల్లి ప్రసాద్, గాదె రాజు, గోవిందు అశోక్, బంగ్లా శ్రీనివాస్, గుర్రం శంకర్, ఆకారపు అశోక్, చిట్టిబాబు, తాటికొండ అనిల్ తదితరులు పాల్గొన్నారు.