రఘునాథపల్లి, అక్టోబర్ 11: ఆరు దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో చేయని అభివృద్ధిని బీఆర్ఎస్ సర్కారు తొమ్మిదేళ్లలో చేసి చూపించిందని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని స్టేషన్ఘన్ఫూర్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. ప్రజలు ఆశీర్వదిస్తే గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తానని పేర్కొన్నారు. మండలంలోని భాంజీపేట, శ్రీమన్నారాయణపురం, ఎల్లారెడ్డిగూడెం, పడమటిగూడెం, నిడిగొండ, గోవర్ధనగిరి గ్రామాల్లో బుధవారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు నీరాజనం పలికారు.
మహిళలు కోలాటాలతో, కళాకారులు డప్పుచప్పులతో స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా రాజకీయంలో ఉన్నానని, ఏనాడు అవినీతికి పాల్పడలేదన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రఘునాథపల్లి, లింగాలఘనపురం మండలాలు స్టేషన్ఘన్ఫూర్ నియోజకవర్గంలో లేకపోవడంతో ఈ రెండు మండలాలను అభివృద్ధి చేసే భాగ్యం దక్కలేదన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం రావడంతో అభివృద్ధి చేసే అవకాశం వచ్చిందన్నారు. ప్రజలు నిండుమనసుతో ఆశీర్వదిస్తే సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల సరసన నిలబెడుతానని శ్రీహరి అన్నారు.
వ్యవసాయాన్ని పండుగలా మార్చిన సీఎం కేసీఆర్
సమైక్య పాలనలో వ్యవసాయం అస్తవ్యస్తంగా మారగా పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పండుగలా మార్చారని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యుత్ ఇస్తున్నారని, రైతుబంధు, రైతుబీమా పథకాలు అందించడంతోపాటు ఎరువులు అందుబాటులో ఉంచారని తెలిపారు. పంటలకు గిట్టుబాటు ధరను కల్పిస్తూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. దీంతో ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే నంబర్వన్ రాష్ట్రంగా ఎదిగిందన్నారు. గతంలో అన్నమో రామచంద్ర అన్న తెలంగాణ నేడు గోదావరి జలాలతో రెండు పంటలు పండించే స్థాయికి ఎదిగిందని తెలిపారు.
ఆడబిడ్డల పెళ్లి కానుకగా కల్యాణలక్ష్మి, షాదీముబారఖ్ పథకాలతో రూ.లక్షా 116 చొప్పున అందిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో డెలివరీ అయితే కేసీఆర్ కిట్ అందించడంతోపాటు బాబు పుడితే రూ 12వేలు, పాప అయితే రూ.13 వేలు అందిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలు సమీపించిన తరుణంలో ప్రజలకు కాంగ్రెస్, బీజేపీ నాయకులు కల్లబొల్లి కబుర్లు చెబుతూ ఓట్లు దండుకునేందుకు యత్నిస్తున్నారని, దీనిని తిప్పికొట్టాలని శ్రీహరి అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న బీఆర్ఎస్ను మరోసారి ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ బొల్లం అజయ్, రైతుబంధు సమితి జిల్లా సభ్యులు మారుజోడు రాంబాబు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వారాల రమేశ్యాదవ్, సర్పంచ్లు గొరిగె భాగ్య-రవి, మధు, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు గొరిగె రవి, నాయకులు నామాల బుచ్చయ్య, చెంచు రమేశ్, వడ్లకొండ శివప్రసాద్, లోనె శ్రవణ్, కావటి రాజయ్య, పెండ్లి మల్లారెడ్డి, మల్కపురం లక్ష్మయ్య, మహిపాల్రెడ్డి, దొరగొల్ల యాదగిరి, గుడి రాంరెడ్డి, తాటికొండ వెంకటేశ్, బంద కుమారస్వామి, సుల్తాన్ దేవేందర్రెడ్డి, పెండ్లి సత్తిరెడ్డి, గైని శ్రీనివాస్, వెంకటేశ్వర్గౌడ్, బిర్రు మధు, రాంచందర్ పాల్గొన్నారు.