అర్హులందరికీ భూమి హక్కు పత్రాల పంపిణీకి ఏర్పాట్లు అత్యధికంగా మహబూబాబాద్ జిల్లాలో 70 వేల ఎకరాలు అత్యల్పంగా హనుమకొండ జిల్లాలో 65 ఎకరాలు ఐదు జిల్లాల్లో లబ్ధిదారుల ఎంపిక.. ప్రభుత్వ నిర్ణయంతో గిరిజనుల్లో సంతోషం త్వరలో గిరిపుత్రులకు పోడు పట్టాలు అడవి బిడ్డలకు రాష్ట్ర సర్కారు భరోసా అడవి బిడ్డల ఏళ్లనాటి కల నెరవేరే తరుణం రానేవచ్చింది. దశాబ్దాలుగా నలుగుతున్న పోడు భూముల సమస్యకు తెలంగాణ సర్కారు పరిష్కారం చూపింది. అటవీ భూములను సాగు చేసుకుంటున్న అర్హులందరికీ భూమి హక్కు పత్రాలు పంపిణీ చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ఐదు జిల్లాల్లో లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేశారు. అత్యధికంగా మహబూబాబాద్ జిల్లాలో 70 వేల ఎకరాలు, అత్యల్పంగా హనుమకొండ జిల్లాలో 65 ఎకరాలు పోడు భూములు ఉన్నట్లు గుర్తించారు. ఈ లెక్కన మహబూబాబాద్ జిల్లాలో దాదాపు 25 వేల మంది, ములుగు జిల్లాలో 7,413, వరంగల్ జిల్లాలో 3,654, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 3,428, హనుమకొండ జిల్లాలో 70 మందికి లబ్ధి చేకూరనుంది. సర్కారు నిర్ణయంతో గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లూ సాగు చేసుకుంటున్న భూములకు హక్కు పత్రాలు వస్తున్నాయని సంబుర పడుతున్నారు.
వరంగల్, మే 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అడవి బిడ్డలకు బీఆర్ఎస్ సర్కారు అండగా నిలుస్తున్నది. దశాబ్దాలుగా అటవీ భూమిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న వారికి హక్కులు కల్పిస్తున్నది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గిరిజనులకు పోడు పట్టాలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. జూన్ 24 నుంచి 30 వరకు పోడు పట్టాల పంపిణీ ప్రక్రియ పూర్తి కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2845 గ్రామాలు, తండాలు, గూడేల పరిధిలో ఆదివాసీ గిరిజనుల ఆధ్వర్యంలో ఉన్న 4,01,405 ఎకరాల పోడు భూములకు పట్టాలు అందచేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు జిల్లాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. పట్టాలు అందించిన వెంటనే ప్రతి లబ్ధిదారుడి పేరుపై ప్రభుత్వమే బ్యాంకు ఖాతాను తెరిపించనుంది. కలెక్టర్ల ఆధ్వర్యంలో గిరిజన సంక్షేమ శాఖ ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నది.
ఈ ఖాతాల ద్వారా పోడు పట్టాల లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధును అందజేయనున్నది. ఉమ్మడి జిల్లా పరిధిలోని ఐదు జిల్లాల్లో పోడు భూముల పంపిణీ జరుగనున్నది. మహబూబాబాద్ జిల్లాలో అత్యధికంగా 70 వేల ఎకరాలు, ములుగు జిల్లాలో 18 వేల ఎకరాలు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 8,537 ఎకరాలు, వరంగల్ జిల్లాలో 8,366 వేల ఎకరాలు, హనుమకొండ జిల్లాలో 65 ఎకరాలకు ప్రభుత్వం హక్కులు కల్పించనున్నది. మహబూబాబాద్ జిల్లాలో లబ్ధిదారులు ఎక్కువగా ఉన్నారు. ఈ జిల్లాలో దాదాపు 25 వేల మందికి పోడు భూముల హక్కు పట్టాలు అందనున్నాయి. ములుగు జిల్లాలో 7,413 వేల మంది, వరంగల్ జిల్లాలో 3,654 మంది, జయశంకర్ జిల్లాలో 3,428 మంది, హనుమకొండ జిల్లాలో 70 మంది లబ్ధిదారులు ఉన్నారు.
దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న పోడు భూముల పట్టాల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం పక్కాగా నిర్వహిస్తున్నది. అర్హులైన గిరిజనులకు ఇబ్బంది లేకుండా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది. గ్రామపంచాయతీల పరిధిలోని అటవీ హక్కుల కమిటీలు నెలలపాటు క్షేత్ర స్థాయిలో సర్వే చేసి లబ్ధిదారులను గుర్తించాయి. పట్టాల పంపిణీకి సంబంధించి రెవెన్యూ, అటవీ, గిరిజన సంక్షేమ శాఖ అధికారుల సంతకాలు పూర్తయ్యాయి. హక్కు పత్రాల పంపిణీ తర్వాత అడవులు అన్యాక్రాంతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం గిరిజన ఆధీనంలో ఉన్న భూములు, అటవీ భూములను వేరు చేసేలా పాలిగన్ సాంకేతిక పరిజ్ఞానంతో సర్వేలు నిర్వహించింది.
భవిష్యత్లో భూమి హద్దు వివాదాలు రాకుండా, పక్కన ఉన్న అటవీ భూములు ఆక్రమణకు గురి కాకుండా ఈ పాలిగన్ విధానం పని చేస్తుంది. భూమి సర్వే నంబర్, ఆ భూమి ఉన్న అక్షాంశాలు, రేఖాంశాలు, చుట్టూ ఉన్న హద్దులతో గూగుల్ మ్యాపింగ్ వివరాలతో హోలోగ్రామ్ను పోడు పట్టాల్లో పొందుపరిచారు. అడవుల్లోని తమ ఆధీనంలో ఉన్న భూములు అధికారికంగా తమ చేతికి వస్తుండడంతో గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల కల నెరవేరిందని చెబుతున్నారు.