వర్ధన్నపేట, మార్చి 19: అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ భరోసా ఇచ్చారు. మండలంలో దెబ్బతిన్న పంటలను ఆదివారం ఆయన రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లుతో కలిసి కట్య్రాల సమీపంలో దెబ్బతిన్న మక్కజొన్న పంటను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా అరూరి మాట్లాడుతూ పంట చేతికందే సమయంలో అకాల వర్షానికి దెబ్బతినడం బాధాకమన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మక్కజొన్న, మామిడి, మిర్చి, కూరగాయల పంటలు కూడా దెబ్బతిన్నాయని అన్నారు. సమగ్రంగా సర్వే నిర్వహించి నివేదికను తయారు చేయించనున్నట్లు చెప్పారు. నివేదిక పూర్తి కాగానే వ్యవసాయ శాఖ మంత్రి, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి రైతులకు పరిహారం అందేలా చూస్తామన్నారు. ఎమ్మెల్యే వెంట జడ్పీటీసీ మార్గం భిక్షపతి, ఏఎంసీ మాజీ చైర్మన్ గుజ్జ సంపత్రెడ్డి ఉన్నారు.