దేశ రాజకీయాలను కొత్త మలుపు తిప్పే ప్రక్రియ మొదలైంది. తెలంగాణ అభివృద్ధి ప్రదాత ఏర్పాటు చేసిన భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)తో మరో ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ ఏడాది దసరా నాడే బీఆర్ఎస్ ఏర్పాటైనా కేంద్ర ఎన్నికల కమిషన్ ఆమోదంతో టీఆర్ఎస్ జాతీయ పార్టీగా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ప్రభుత్వ ఆదాయం పెంచాలి.. దాన్ని పేదలకు పంచాలనే నినాదంతో పాలన సాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ మోడల్ను దేశవ్యాప్తంగా చాటే ప్రక్రియ బీఆర్ఎస్తో మొదలవుతుందని అన్ని వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలో శుక్రవారం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్ర తినిధులు సహా అభి మానులు రోడ్లపైకి తరలివచ్చి పటాకులు కాల్చి, స్వీట్లు పంచి ‘జై బీఆర్ఎస్.. జయహో కేసీఆర్’ అంటూ నినాదాలతో హోరె త్తించారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ను స్వాగ తిస్తూ గులాబీ శ్రేణులకు సంఘీభావం ప్రకటించారు.
వరంగల్, డిసెంబర్9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): భారత రాష్ట్ర సమితిని ఎన్నికల కమిషన్ గుర్తించడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సంబురాలు అంబర్నాంటాయి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, డీసీసీబీ, డీసీఎంఎస్, లైబ్రరీ చైర్మన్లు అందరూ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం కోసం హైదరా బాద్కు వెళ్లగా, మంత్రులు, ఎమ్మెల్యేల మార్గదర్శనంలో జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల్లో బీఆర్ఎస్ను స్వాగతిస్తూ స్థానిక నేతలు కార్యక్రమాలు నిర్వహించారు. సీఎం కేసీఆర్కు సంఘీభావం తెలుపుతూ ఊరు, వాడా అంతటా పాలాభిషేకాలు నిర్వహించారు. రైతులు, పేదల సాధికారతే లక్ష్యంగా దేశంలోనే ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ముఖ్య మంత్రి కేసీఆర్ బీఆర్ఎస్తో జాతీయ స్థాయిలోనూ రాణిస్తారని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజల ఆరు దశాబ్దాల ఆకాంక్షను నెరవే ర్చేందుకు టీఆర్ఎస్ను తీర్చిదిద్దినట్లుగానే దేశంలోని రైతులు, పేదల కోసం బీఆర్ఎస్ను ముందుకు నడిపిస్తారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
హనుమకొండ చౌరస్తాలో పటాకులు కాల్చి సంబురాలు చేసుకుంటున్న బీఆర్ఎస్ నాయకులు
పార్టీ ప్రస్థానమిలా..
తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001లో ఉద్యమ నేతగా కేసీఆర్ టీఆర్ఎస్ను స్థాపించారు. 13 ఏండ్ల ఉద్యమం తర్వాత రాష్ర్టాన్ని సాధించారు. అనంతరం రాష్ర్టంలో అన్ని వర్గాల ప్రజలు అభ్యున్నతి సాధించాలనే లక్ష్యంతో వందల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. లెక్కలేనన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. ప్రతి ఎకరాకు సాగునీరు, నిరంతరం ఉచితంగా కరెంటు, రైతు బంధు, రైతు బీమా, పంటల కొనుగోలుతో వ్యవసాయం రంగాన్ని లాభసాటిగా మార్చారు. పేదలకు ఉచిత విద్యతోపాటు ఆసరా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారు. అద్భుతమైన ఆర్థిక ప్రగతితో తెలంగాణను దేశంలోనే అగ్రస్థాయి రాష్ట్రంగా తీర్చిదిద్దారు. అందుకే ఇక్కడి ప్రజలు వరుసగా రెండుసార్లు కేసీఆర్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు.
రాష్ట్రంలోని ప్రతి పథకాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేసే లక్ష్యంతో ముందుకుసాగుతున్న కేసీఆర్కు ఇప్పుడు మరోసారి అండగా నిలిచేందుకు సిద్ధమ య్యారు. రైతుల అభ్యున్నతి, యువతకు ఉపాధి, పేదలకు సాధికారతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఇప్పుడు టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి దేశ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్ మార్చుతూ ఈ ఏడాది అక్టోబర్ 5న టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయం తీసుకున్నది. ఈ ప్రక్రియపై అన్ని వర్గాల ఆమోదం వచ్చింది. కేంద్ర ఎన్నికల కమిషన్ సైతం దీన్ని గుర్తించింది. టీఆర్ఎస్ కొత్తగా బీఆర్ఎస్గా మారిన నేపథ్యంలో గులాబీ అధినేత కేసీఆర్ హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. బీఆర్ఎస్ ప్రస్థానాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ ప్రక్రియ మొదలు కాగానే జిల్లాలు, నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో అన్ని వర్గాల వారు సంబురాలు చేసుకున్నారు. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లోని వార్డులు, గ్రేటర్ వరంగల్లోని డివిజన్లలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు.
వరంగల్ రైల్వేస్టేషన్ కాకతీయ కీర్తితోరణం వద్ద జై బీఆర్ఎస్ అని నినదిస్తున్న నాయకులు
జనగామ జిల్లా పెంబర్తి కాకతీయ తోరణం వద్ద సంబురాలు జరుపుకుంటున్న బీఆర్ఎస్ నాయకులు
దేశ ప్రగతికి సోపానం
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం దేశ ప్రగతికి సోపానంగా ఉండబోతుంది. దేశ్ కీ నేత కేసీఆర్ అని నినదిస్తూ రాష్ట్రం తరహాలో దేశ అభివృద్ధి జరగాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. తమ జీవితాల్లో గొప్ప మార్పు తీసుకువస్తుందని ఆశిస్తున్నారు. 2009 డిసెంబర్ 9 ఉద్యమ చరిత్రలో ఒక ప్రత్యేక మైన రోజు. రాష్ట్ర ఏర్పాటుపై అధికారిక ప్రకటన వెలువడిన రోజునే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం జరుగడం హర్షణీయం. అసాధ్యాలను సుసాధ్యం చేసిన ఉద్య మ నాయకుడికి దేశంలో సమూల మార్పులు తీసుకురా వడం అసాధ్యం ఏమీ కాదు. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ దేశ ప్రజల ఆకాంక్షలు తీరుస్తూ భవిష్యత్తులో అద్భుతమైన విజయాలు సాధిస్తుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. సమైక్య స్ఫూర్తికి, హకుల పరిరక్షణ ఉద్యమానికి బీఆర్ఎస్ పార్టీ ప్రారంభం ఒక కొత్త చరిత్ర సృష్టించబోతున్నది.
– పరిటాల సుబ్బారావు, ఉద్యోగ సంఘాల జేఏసీ మాజీ చైర్మన్
రైతు రాజ్యం వస్తుంది
రాష్ట్రం 8 ఏళ్లలో కేసీఆర్ నాయకత్వంలో ఎంతో అభివృద్ధి సాధించింది. ఇక్కడ జరిగిన అభివృద్ధిని బీఆర్ఎస్ పార్టీ ద్వారా దేశవ్యాప్తంగా అమలు చేయడానికి అవకాశం ఏర్పడింది. దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆదుకోవడానికి అనేక పథకాలను ప్రవేశపెట్టిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదే. అవే పథకాలు దేశంలో ఉన్న రైతులందరికీ బీఆర్ఎస్ అమలు చేస్తుందనే ప్రగాఢ విశ్వాసం కలిగింది. కేసీఆర్ నాయకత్వంలో రైతుబంధు, రైతు బీమా, గిట్టుబాటు ధర, 24గంటల విద్యుత్ లాంటి పథకాలు దేశంలో అందించడానికి మార్గం ఏర్పడింది.
– చల్లా శ్రీనివాస్, న్యాయవాది
మంచి రోజులు వచ్చాయి
టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ ఆవిర్భవించిన సందర్భంలో దేశానికి మంచి రోజులు వచ్చాయని చెప్పవచ్చు. విజన్ ఉన్న నాయకుడు చేతిలో రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో అదే తరహాలో దేశం కూడా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు, రైతు బంధు, దళిత బంధు, రైతు బీమా, ఆసరా పింఛన్లు ఇంకా అనేక పథకాలు సీఎం కేసీఆర్ అందిస్తున్నారు. ఆ సంక్షేమ పథకాలు దేశంలో ఉన్న అట్టడుగు వర్గాలకు బీఆర్ఎస్ ద్వారా అందుతాయి. అదేవిధంగా అన్ని రాష్ట్రాలను సమానంగా అభివృద్ధి చేసుకోవడానికి బాటలు పడుతాయి. భారతరాష్ట్ర సమితి ఆవిర్భవించడం దేశానికి శుభ సూచికం అని చెప్పవచ్చు.
– బొల్లికొండ వీరేందర్, సామాజిక విశ్లేషకులు
జాతీయస్థాయిలోనూ రాణిస్తారు
మరిపెడ: ఉద్యమనేత, సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోనూ తన చరిష్మా ప్రదర్శిస్తారు. టీఆర్ఎస్ను భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించడం హర్షణీయం. రాష్ట్ర సాధన అనంతరం మహాత్ముడు కలలు గన్న గ్రామస్వరాజ్యం ప్రతి పల్లెల్లోనే కనిపిస్తోంది. అణగారిన వర్గాల అభ్యున్నతికి, అంబేద్కర్ ఆశయ సాధన కేసీఆర్ ప్రభుత్వంతోనే సాధ్యం. జాతీయస్థాయిలోనూ సాగు, జల విధానంపై సీఎం కేసీఆర్ స్పష్టమైన విధానంతో ముందుకుపోవడం వల్ల వివిధ రాష్ర్టాల్లో ఆయనకు మద్దతు లభిస్తుంది.
– డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్
వైద్య విధానంలో సమూల మార్పులు
సీఎం కేసీఆర్ ఎనిమిదేళ్ల పాలనలో వైద్య విధానంలో అనేక మార్పులు తెచ్చారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు, నిరుపేదలకు దేశంలో ఎక్కడా లేని విధంగా నాణ్యమైన వైద్యం అందిస్తున్నారు. తెలంగాణ వైద్య విధాన మోడల్ను పేదలకు అందిస్తారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు కల్పించడంతో ప్రజలు అటువైపు వెళ్తున్నారు. గత జాతీయ పార్టీలు పేదలను ఓటు బ్యాంకుగా వాడుకున్నాయే తప్ప వారి అభివృద్ధి కోసం పాటుపడలేదు. బీఆర్ఎస్తో పేదలకు మంచి వైద్యం అందుతుందని భావిస్తున్నా.
– డా. నల్ల సురేందర్ రెడ్డి, పిల్లల వైద్య నిపుణులు
జాతీయ రాజకీయాల్లో కీలకభూమిక
మరిపెడ: సీఎం కేసీఆర్ సారథ్యంలో భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) జాతీయ రాజకీయాల్లో కీలకభూమిక పోషించనుంది. బీఆర్ఎస్ను ఎన్నికల సంఘం గుర్తించడం హర్షణీయం. జీవం కోల్పోయిన సాగునీటి రంగానికి సీఎం కేసీఆర్ పునర్జీవం పోసి రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేశారు. రాష్ట్రలో అమలవుతున్న రైతు, వ్యవసాయ, మహిళ, కులవృత్తుల సంక్షేమంతో పాటు తదితర పథకాలకు జాతీయస్థాయిలో అమలు కేసీఆర్తోనే సాధ్యం. దళితబంధు, రైతుబంధు, వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ తదితర పథకాలు అమలు చేసిన తొలి రాష్ట్రం, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.
– నవీన్రావు, గ్రంథాలయం చైర్మన్, మహబూబాబాద్