గిర్మాజీపేట, మే 20 : సీఎం కేసీఆర్ రాష్ట్రంలో సంక్షేమ పాలన అందిస్తున్నారని మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. ఆత్మీయ సమ్మేళనాలకు అపురూప స్పందన వస్తుందని, తరలివస్తున్న ప్రజలను చూస్తుంటే దసరా, సద్దుల బతుకమ్మల పండుగ జరుపుకొంటున్నట్లు కనిసిస్తుందని పేర్కొన్నారు. శనివారం కాశీబుగ్గలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అధ్యక్షతన 13,20,21,26 డివిజన్ల కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహారాష్ట్రలో బీఆర్ఎస్ వడివడిగా అడుగుల వేస్తున్నదని, దేశ వ్యాప్తంగా కేసీఆర్, బీఆర్ఎస్పై చర్చ జరుగుతున్నదని, 9 ఏండ్ల పాలనలో సీఎం కేసీఆర్ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతున్నదని తెలిపారు. ఏకకాలంలో అన్ని జిల్లాలకు మెడికల్ కళాశాలలను అందించిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. ప్రపంచ స్థాయి మల్టీ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణం తుదిదశలో ఉండడం గర్వపడే విషయమని చెప్పారు.
సీఎం కేసీఆర్ ఏ ఆలోచనతో ఆత్మీయ సమ్మేళనం పెట్టారో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్న ఎమ్మెల్యే నరేందర్ అభినందనీయుడన్నారు. వర్షంలోనూ దాదాపు 2 వేల మంది సమ్మేళనానికి తరలిరావడం ప్రశంసనీయమన్నారు. ఆజంజాహీ మిల్ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల మూతపడిందని. ఆ లోటును భర్తీ చేసేందుకు సీఎం కేసీఆర్ సంగెంలో టెక్స్టైల్స్ పార్కును ఏర్పాటు చేశారని, తద్వారా అనేక మందికి జీవనోపాధి కలుగుతున్నదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే నన్నపునేని మాట్లాడుతూ.. కార్యకర్తలే పార్టీకి బలం, బలగమన్నారు. తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ఆర్ అండ్ బీ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాలను దేశంలోని అన్ని రాష్ర్టాలు ఆచరణలో పెడుతున్నాయని.. దేశ్ కీ నేత కేసీఆర్ అని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో మెజారిటీ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో 13,20,21, 26 డివిజన్ల కార్పొరేటర్లు సురేశ్జోషి, గుండేటి నరేందర్, ఫుర్ఖాన్, బాలిన సురేశ్ పాల్గొన్నారు.