ఎల్కతుర్తి, సెప్టెంబర్ 6 : తెలంగాణ ఏర్పడితే కరెంటు ఉండదని, కరంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాలని నాటి ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి అసెంబ్లీలో చెప్పాడని, ఇప్పుడు కిరణ్కుమార్రెడ్డి, రేవంత్రెడ్డి వచ్చి కరెంటు తీగలపై బట్టలు ఆరేసి చూస్తే కరెంటు వస్తుందో, లేదో తెలుస్తదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ తెలిపారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ తన ఎన్నికల ప్రచారాన్ని బుధవారం మండలంలోని జగన్నాథపూర్ హనుమాన్ ఆలయంలో పూజలు నిర్వహించి, ప్రారంభించారు. మొదట ఎమ్మెల్యే సతీశ్కుమార్ ఎల్కతుర్తిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, తర్వాత 500 బైక్లతో ర్యాలీగా జీల్గులకు వచ్చారు. ఇక్కడ గ్రామస్తులు డప్పుచప్పుళ్లతో ఘనస్వాగతం పలికిన తర్వాత తెలంగాణతల్లి విగ్రహాన్ని బోయినపల్లి, జడ్పీ చైర్మన్ సుధీర్కుమార్తో కలిసి ఆవిష్కరించారు. తర్వాత గౌడ, మైనార్టీ కమ్యూనిటీ భవనాలను ప్రారంభించారు. అనంతరం జగన్నాథపూర్కు చేరుకొని ఎమ్మెల్యే సతీశ్కుమార్ దంపతులు, వినోద్కుమార్, సుధీర్కుమార్ ఆలయంలో పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు.
జగన్నాథపూర్, జీల్గుల గ్రామాల్లో ప్రచారం చేశారు. వాహనంపై సతీశ్కుమార్, వినోద్కుమార్ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకుసాగారు. ఆయాచోట్ల వినోద్కుమార్ మాట్లాడుతూ 23 ఏండ్ల కిందట తెలంగాణలో రక్తపాతం ఏరులై పారిందన్నారు. సాధించిన తెలంగాణను ఎలా అభివృద్ధి చేయాలనే తపనతో సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషిచేస్తూ ప్రాజెక్టులు కట్టి సాగునీటి గోస తీర్చారన్నారు. 44వేల చెరువులను మిషన్ కాకతీయతో బాగు చేసుకున్నామనారు. కేవలం 7778 మెగావాట్లు ఉన్న కరెంటును 25వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యానికి పెంచుకొని కొరతను కూడా తీర్చారన్నారు. రైతన్నలకు నీళ్లు, కరెంటు, రైతుబంధు లాంటి పథకాలు ఇస్తుండడంతో ఇప్పుడు దేశంలోనే ఎక్కువ వడ్లు పండించే రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందన్నారు. ఈ విషయాన్ని బీజేపీ నాయకులే చెప్తున్నారన్నారు. తెలంగాణ ఏర్పడిన కొత్తలో 200 గురుకులాలు మాత్రమే ఉండేవని, ఇప్పుడు 1000 గురుకులాలు ఏర్పాటు చేసి ఒక్కో విద్యార్థిపై రూ.1.25లక్షలు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇదివరకు 3మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండగా, ఒక్కో జిల్లాకు ఒక్కటి చొప్పున 33 ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కలుపుకొని 60 మెడికల్ కాలేజీలు తెలంగాణలో ఉన్నాయన్నారు. వచ్చే ఐదేండ్లు పేదవారికి సంక్షేమ పథకాలను మరింతగా అందించేందుకు వాటికి పెద్దపీట వేస్తామన్నారు. పనిచేసే నాయకులను, ప్రభుత్వాలను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.
95శాతం పనులు పూర్తి చేశా : ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్
2014, 2018 ఎన్నికల్లో హుస్నాబాద్ ఎమ్మెల్యేగా ఈ ప్రాంత ప్రజలకు నాకు అవకాశం ఇస్తే నిత్యం ప్రజల్లోనే ఉంటూ సీఎం కేసీఆర్, మంత్రుల సహకారంతో నియోజకవర్గంలో 95శాతం పనులు పూర్తి చేశానని ఎమ్మెల్యే సతీశ్కుమార్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయా సమావేశాల్లో మాట్లాడుతూ జగన్నాథపూర్ హనుమాన్ ఆలయంలో పూజలు చేశా కే ప్రచారం మొదలు పెడుతానన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచాక 456 చెరువులను పునర్నిర్మించినట్లు తెలిపారు. శనిగరం చెరువును నాటి ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదని, తాను రూ.23 కోట్లతో అభివృద్ధి చేశానని చెప్పారు. గౌరవెల్లి ప్రాజెక్టును 1.14టీఎంసీ నుంచి 8.2టీఎంసీకి పెంచి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశానన్నారు. నిర్వాసితులకు కూడా వారు కో రిన విధంగా పరిహారం అందించినట్లు తెలిపారు.
32మెగావాట్ల సామర్థ్యం ఉన్న 3 మోటర్లను బిగించామని, అవి 24గంటలు నీళ్లు ఎత్తిపోస్తాయని తెలిపారు. 1.06లక్షల ఎకరాలకు దేవాదుల ద్వారా నీళ్లు అందుతాయన్నారు. ఈ పనులను అప్పుడు ఎమ్మెల్యే, ఎంపీలుగా వారు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాలను హనుమకొండలో కలిపాక ఎంతో అభివృద్ధి చెందాయని, దేవాదుల నార్త్ కెనాల్ ద్వారా 17వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు వివరించారు. జీల్గుల, జగన్నాథపూర్లకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఎంపీపీ కోమల, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గొడిశాల సమ్మయ్యగౌడ్, సొసైటీ చైర్మన్ రవీందర్గౌడ్, వైస్ ఎంపీపీ నగేశ్, మార్కెట్ డైరెక్టర్ మహేందర్, రైల్వే బోర్డు మెంబర్ స్వామి, రైతుబంధు కో ఆర్డినేటర్ రవీందర్రెడ్డి పాల్గొన్నారు.