భూపాలపల్లి రూరల్, జూలై 29: జిల్లాలోని అర్హులైన దివ్యాంగులకు ఉచిత సహాయ ఉపకరణాలను పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ జిల్లాలోని దివ్యాంగులకు ఉచిత ఉపకరణాల పంపిణీపై ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, జిల్లా సంక్షేమ శాఖ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈసీఐఎల్ హైదరాబాద్ వారి ద్వారా జిల్లాలో అర్హులైన దివ్యాంగులను ఎంపిక చేసి ఉచిత సహాయ ఉపకరణాలను పంపిణీ చేయడం జరుగుతుందని, విద్యార్థినుల కోసం సానిటరీ నాప్కిన్ మిషన్ను ఎంపిక చేసిన పాఠశాలలో ఏర్పాటు చేస్తామని అన్నారు.
ఈసీఐఎల్ బృందం జిల్లాలో రెండు రోజులపాటు పర్యటించి వివిధ పాఠశాలలను పరిశీలించి 21 పాఠశాలలను ఎంపిక చేయడం జరుగుతుందని, జిల్లాలోని 3వేల మంది విద్యార్థినిలకు సానిటరీ నాప్కిన్లను అందజేయడం జరుగుతుందని, జిల్లాలోని దివ్యాంగులకు మూడు రోజుల పాటు క్యాంపులు నిర్వహించి సుమారు 1000 మంది దివ్యాంగులకు ఉచిత సహాయ ఉపకరణాలను పంపిణీ చేస్తారని అన్నారు. జిల్లాలోని 14 ప్రభుత్వ ఆసుపత్రులలో ఈసీఐఎల్ బృందం మెడికల్ ఎక్విప్మెంట్ను సమకూర్చుతున్నారని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈసీఐఎల్ బృందం సభ్యులు సి.మునికృష్ణ, ఏజిఎం సునీల్ కుమార్, పర్సనల్ ఆఫీసర్ విశ్వనాథరెడ్డి, సీపీవో సామ్యూల్, సీనియర్ మెడికల్ ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొన్నారు.