జనగామ, జనవరి 6 (నమస్తే తెలంగాణ) : జనగామ జిల్లా పరిషత్ చైర్పర్సన్గా గిరబోయిన భాగ్యలక్ష్మి నియమితులయ్యారు. ఈ మేరకు జడ్పీ కార్యాలయంలో శనివారం ఆమె బాధ్యతలు స్వీకరించగా, సీఈవో అనిల్కుమార్, అధికారులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు శుభాకాంక్షలు తెలిపారు. మొన్నటి వరకు జడ్పీచైర్మన్గా ఉన్న పాగాల సంపత్రెడ్డి ఇటీవల గుండెపోటుతో మృతి చెందడంతో పంచాయతీరాజ్ నిబంధనల మేరకు బచ్చన్నపేట జడ్పీటీసీగా గెలుపొంది జడ్పీ వైస్ చైర్పర్సన్గా ఎన్నికైన భాగ్యలక్ష్మిని చైర్పర్సన్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త జిల్లాగా ఆవిర్భావించిన జనగామ జిల్లా పరిషత్ పాలకవర్గం 2019 జూన్ 8న ఎన్నికైంది. ఈఏడాది జూన్ వరకు అంటే మరో ఆరునెలల కాలానికి జడ్పీచైర్పర్సన్గా వ్యవహరించే అరుదైన అవకాశం భాగ్యలక్ష్మికి దక్కింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జనగామ జిల్లా అభివృద్ధి సమిష్టి బాధ్యతగా గుర్తించి కలిసి పనిచేద్దామన్నారు. భాగ్యలక్ష్మిని జనగామ, నర్మెట జడ్పీటీసీ సభ్యులు నిమ్మతి దీపిక మహేందర్రెడ్డి, శ్రీనివాస్, కోఆప్షన్ సభ్యులు గౌస్పాషా, జనగామ ఎంపీపీ మేకల కళింగరాజు, జడ్పీటీసీ డిప్యూటీ సీఈవో వసంత, అధికారులు అభినందించారు.