హనుమకొండ, అక్టోబర్ 8 : హనుమకొండ నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఆదివారం రాత్రి నిర్వహించిన భగవంత్ కేసరి ట్రైలర్ లాంచ్ ఫంక్షన్ నేత్ర పర్వంగా జరిగింది. శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించగా, జన సందోహంతో మైదానం దద్దరిల్లింది. సినిమా సెట్టింగ్లను తలపించేలా ఏర్పాట్లు చేశారు. సినీ హీరో నందమూరి బాలయ్య బాబు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. హీరోయిన్ కాజల్ అగర్వాల్, శ్రీలీల స్టెప్లతో అలరించారు. ఈ సందర్భంగా బతకమ్మ ఆట ఆడి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పెద్ద ఎత్తున అభిమానులు తరలి రావడంతో ఆర్ట్స్ కళాశాల మైదానం ఈలలు, కేరింతలతో మార్మోగింది. రచ్చరవి కుటుంబ సభ్యులు సినీ హీరో బాలకృష్ణకు అందించిన తలకాయ కూర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ఇంత పెద్ద ఎత్తున్న వరంగల్ నగరంతో పాటు చుట్టు పక్కల నుంచి తరలివచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. పుణ్యస్థలం ఓరగల్లులో భగవంత్ కేసరీ ట్రైలర్ రిలీజ్ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఎందరో మేధావులు, మహనీయులు పుట్టిన గడ్డ ఓరుగల్లు అన్నారు. వరంగల్తో తనకు చాలా అనుబంధం ఉందన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తీసిన ఈ సినిమా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా సినీ కళాకారులు చేసిన డ్యాన్స్లు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డైరెక్టర్లు అనిల్ రావిపూడి, బాబి, వంశీ పైడిపల్లి, గోపీచంద్, రచ్చ రవి, వరంగల్ వాస్తవ్యుడు రచయిత కాసర్ల శ్యాం, సినీ యూనిట్ బృంద సభ్యులు పాల్గొన్నారు.