సుబేదారి, జనవరి 5 : వరంగల్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన ఏవీ రంగనాథ్ నెల రోజుల్లో తనదైన మార్క్ చూపించారు. అవినీతి అక్రమాలు, విధి నిర్వహణలో నిర్లక్ష్యం, హద్దు మీరి అనైతిక కార్యకలాపాలకు పాల్పడిన పలువురు పోలీసు అధికారులపై కొరడా ఝుళిపించారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పారదర్శక సేవలు అందించడానికి ముందుకు సాగుతున్నారు. ఏవీ రంగనాథ్ వరంగల్ పోలీస్ కమిషనర్గా డిసెంబర్ 3న బాధ్యతలు చేపట్టారు. నెలలోనే అవినీతి, అనైతిక చర్యలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని పోలీసు శాఖపై ప్రజల్లో మరింత విశ్వాసం పెంచే దిశగా నిర్ణయాలు తీసుకున్నారు.
శాంతిభద్రతలు, ట్రాఫిక్ నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తూ బాధితుల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. సమస్యల మూలాలను తెలుసుకొని, బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కమిషనరేట్ పరిధిలోని 46 పోలీస్ స్టేషన్ల వారీగా అధికారులు, సిబ్బంది పనితీరుపై నిఘా పెడుతున్నారు. ఎస్సైలు, సీఐలు, ఏసీపీలు, డీసీపీల పనితీరుపై ఆరా తీస్తున్నారు. ఇన్స్పెక్టర్ల అవినీతి, వారికి సహకరిస్తున్న పై అధికారుల వివరాలను సేకరిస్తున్నారు.
అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్న పోలీసు అధికారులపై ప్రత్యేక నిఘా పెట్టారు. పోలీసు శాఖ పరువు తీసే విధంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని ఇటీవలి చర్యలతో సీపీ రంగనాథ్ అధికారులకు, సిబ్బందికి స్పష్టత ఇచ్చారు. శాఖాపరమైన సమీక్షలు, పోలీసు అధికారులకు నిర్దేశం చేస్తూ అందరి పనితీరును మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటున్నారు. నెల రోజుల సీపీ పనితీరుపై ప్రజల్లో హర్షం వ్యక్తమవుతున్నది. శాంతిభద్రల పర్యవేక్షణ విషయంలో కరుకుగా ఉంటున్నారు. అస్తవ్యవస్తంగా ఉన్న వరంగల్ ట్రైసిటీ ట్రాఫిక్ వ్యవస్థను చక్కబెట్టడానికి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. హైదరాబాద్లో స్థాయిలో ఆపరేషన్ రోప్ను అమలుచేయడానికి చర్యలు తీసుకున్నారు.
అవినీతికి పాల్పడిన అధికారులపై, హద్దు మీరి అనైతిక వ్యవహారాలతో పోలీసు శాఖకు మచ్చ తెచ్చిన పోలీస్ అధికారులపై కఠినంగా వ్యవహరించారు. గీసుగొండ సీఐ రాయల వెంకటేశ్వర్లు, దామెర ఎస్సై హరిప్రియ అనైతిక కార్యకలాపాలకు పాల్పడి డిపార్ట్మెంట్ పరువు తీశారు. ఎస్సై హరిప్రియ భర్త ఫిర్యాదు మేరకు విచారణ జరిపించిన పోలీసు కమిషనర్ ఇద్దరిని సస్పెండ్ చేశారు. లైంగిక వేధింపుల కేసులో ఓ యువతి సుబేదారి ఎస్సై పున్నం చందర్కు ఫిర్యాదు చేయగా నిందితుడిపై కేసు నమోదు చేయకుండా కేసు రాజీ చేసుకోవాలని బాధిత యువతిని బెదరించారు.
యువతి సీపీకి ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపించి ఎస్సై పున్నం చందర్ సస్పెండ్ చేశారు. నర్సంపేట పోలీస్ స్టేషన్లో ఏఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న నాగరాణి ఒకరి వద్ద అప్పు తీసుకుని, తిరిగి ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడడంతో బాధితుడు పోలీసులకు పిర్యాదు చేశాడు. ఆరోపణలు రాగానే ఏఎస్సై నాగరాణిని పోలీసు కమిషనరేట్కు అటాచ్డ్ చేశారు. విచారణ అనంతరం ఏఎస్సై నాగరాణిని పోలీసు కమిషనర్ సస్పెండ్ చేశారు. కేయూసీ పోలీసు స్టేషన్లో ఇటీవల దొంగ పరారైన కేసులో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్ మోహన్నాయక్ను సస్పెండ్ చేశారు.
తప్పించుపోయిన దొంగ రెండు రోజుల్లో దొరకడంతో తిరిగి పోస్టింగ్ ఇచ్చారు. ఇదే పోలీసు స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న సంపత్ను వ్యక్తిగత కేసు విషయంలో వీఆర్కు అటాచ్డ్ చేశారు.
డిపార్ట్మెంట్కు మచ్చ తెస్తే సహించేది లేదు : ఏవీ రంగనాథ్, వరంగల్ పోలీస్ కమిషనర్
ప్రజలకు మరింత పారదర్శకమైన పోలీసు సేవలు అందించడమే మా లక్ష్యం. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది ఎవరైనా డిపార్ట్మెంట్ పరువు తీసే విధంగా వ్యవహరిస్తే సహించేది లేదు. పనితీరులో నిర్లక్ష్యంగా వ్యవహరించినా, అవినీతి అక్రమాలకు పాల్పడినా, హద్దుమీరినా కఠిన చర్యలు ఉంటాయి.
పోలీసు స్టేషన్కు వచ్చే బాధితులకు సత్వర న్యాయం చేయాలన్నది మా లక్ష్యం. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ప్రజల్లో పోలీసు శాఖపై మరింత విశ్వాసం కల్పించడానికి మావైపు నుంచి తగిన చర్యలు తీసుకుంటున్నాం. నిజాయితీగా పనిచేయాలి, పారదర్శకంగా విచారణ జరగాలి. నేరాలు చేసే నిందితులకు కఠిన శిక్షలు పడాలి. దీని కోసం పోలీసు అధికారులు, సిబ్బంది పని చేయాలి. కొందరు పోలీసు అధికారులు బాధితులతో వ్యక్తిగతంగా సంప్రదింపులు జరుపుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. బాధితుల ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు లోతుగా విచారణ చేస్తున్నాం. తప్పులు చేసే పోలీసు ఆఫీసర్లు, సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. సహించేది లేదు.