నయీంనగర్, జూన్ 6 : ప్రభుత్వ ఉద్యోగిగా సేవలందించాల్సిన ఓ ఆఫీసర్ కార్యాలయ వేళలోనే ఫుల్ గా మద్యం సేవించాడు.. కన్నూమిన్నూ కానకుండా వీరంగం సృష్టించాడు.. తాగిన మత్తులో ఓ వాహనదారుడి ఆర్సీ చింపే ప్రయత్నం చేశాడు.. ఇదంతా ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు.. సాక్షాత్తు హనుమకొండ జిల్లా కేంద్రంలోని రవాణా శాఖ కార్యాలయంలో జరిగింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండలోని రవాణా శాఖ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఏవో)గా రెండు రోజుల క్రితం బాధ్యతలు స్వీకరించిన నరేందర్ కార్యాలయంలోనే తాగి హంగామా సృష్టించాడు.
శనివారం ఉదయం 10.30 గంటలకు తన స్నేహితుడితో కలిసి వచ్చిన ఆయన కార్యాలయ మైదానంలో కారులోనే కూర్చొని మధ్యాహ్నం 2 గంటల వరకు మందు తాగారు. ఈ క్రమంలో డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారు చాలాసేపు వేచి చూసిన అనంతరం ‘ఏవో సారూ.. ప్లీజ్ రండి.. చాలా దూరం నుంచి వచ్చాం..’ అన్నా వినలేదు. అక్కడున్న సిబ్బంది సైతం ‘సార్ రండి.. న్యూసెన్స్ అవుతుంది’ అని చెప్పినా వినకుండా వీరంగం సృష్టించాడు. వరంగల్ నుంచి రోజుల క్రితం హనుమకొండ ఆర్టీవో కార్యాలయానికి బదిలీపై వచ్చిన నరేందర్ మద్యం మత్తులో వాహనదారులను ఇబ్బందులకు గురి చేయడంతో అందరూ తిరగబడ్డారు.
గేట్కు తాళం.. ఏవో నరేందర్ చేయాల్సిన పని పెండింగ్ ఉండడం తో సిబ్బంది అతడితో డ్యూటీ చేయించే ప్రయత్నం చేశారు. అయితే మత్తు దిగని ఏవో వచ్చిన వాహనదారులపై ఆగ్రహం వ్యక్తం చేశా డు. ‘చెల్ ఇక్కడి నుంచి పోండి.. రేపు రండి చూస్తా’ అంటూ ఓ వ్యక్తి వాహనానికి సంబంధించిన ఒరిజనల్ ఆర్సీని చింపే ప్రయత్నం చేశాడు. ‘సంతకం పెట్టండి సారూ.. నేను దూరం నుంచి వచ్చిన.. పొద్దటి నుంచి చూస్తున్నా’ అని చెప్పినా వినకుండా దుర్భాషలాడాడు. ఏవో చేసిన తతంగం చూసిన అధికారులు, సిబ్బంది తమ పరువు పోతుందని భావించి కార్యాలయం ముందు గేట్కు తాళం వేశారు. వెనుక నుంచి దారి ఇచ్చారు. కస్టమర్లు ఎవరొచ్చినా కూడా లోనికి పంపించలేదు. ఏజెంట్లను మాత్రం వెనుక నుంచి అనుమతించి పనులు చేసి పంపించారు. దీంతో వాహనదారులకు సేవలందించాల్సిన అధికారులు ఏజెంట్లకే సహకరిస్తున్నారని పలువురు విమర్శించారు.