హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 1: హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈనెల 2, 3వ తేదీల్లో ‘షైన్ 8వ తెలంగాణ రాష్ట్ర యూత్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, షైన్ విద్యాసంస్థల చైర్మన్ ఎం కుమార్ తెలిపారు. హనుమకొండలోని జేఎన్ఎస్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పోటీలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. అండర్-18 బాయ్స్ అండ్ గర్ల్స్ పోటీల్లో 33 జిల్లాల నుంచి 450 మంది అథ్లెట్లు పాల్గొంటారని, మొత్తం 40 ఈవెంట్లలో పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉదయం 6 నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 3.15 గంటల వరకు ఈవెంట్స్ నిర్వహించనున్నట్లు, ఈ పోటీలను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, కుడా చైర్మన్ సుందర్రాజ్, హనుమకొండ ఏసీపీ కిరణ్కుమార్, ఒలింపిక్ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మహ్మద్ అజీజ్ఖాన్, కైలాశ్యాదవ్ ముఖ్యఅతిథులుగా పాల్గొని ప్రారంభిస్తారని తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభకనబర్చిన అథ్లెట్లు ఈనెల 17 నుంచి 20 వరకు భోపాల్లో జరిగే నేషనల్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో పాల్గొంటారని చెప్పారు. తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి మాట్లాడుతూ యూఎస్ఏలో జరిగిన వరల్డ్ చాంపియన్షిప్లో ఐదో స్థానంలో నిలిచిన మహబూబ్నగర్కు చెందిన ఏ నందిని, కల్లెడ దీప్తితో పాటు పలువురు నేషనల్ అథ్లెట్లు పాల్గొననున్నట్లు చెప్పారు. డీవైఎస్వో గుగులోత్ అశోక్కుమార్, హ్యాండ్బాల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్యామల పవన్కుమార్, బాక్సింగ్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి నర్సింహారాములు, అథ్లెటిక్స్ అసోసియేషన్ ములుగు జిల్లా కార్యదర్శి పగడాల వెంకటేశ్వర్లు, కోచ్ పాషా, ఐలి చంద్రమౌళిగౌడ్ పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర యూత్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలతో హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్) సందడిగా మారింది. రెండురోజుల పాటు నిర్వహించే ఈ పోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా అథ్లెట్లు రానుండడంతో కొత్త కళ సంతరించుకుంది. అథ్లెట్లు జేఎన్ఎస్లోని సింథటిక్ ట్రాక్పై ప్రాక్టీస్ చేస్తూ బిజీగా కనిపించారు.