వరంగల్(నమస్తే తెలంగాణ)/మహబూబాబాద్, ఏప్రిల్ 22: పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. సోమవారం మంచిరోజు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో పది మంది, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో నలుగురు నామినేషన్లు దాఖలు చేశారు. వరంగల్ కలెక్టరేట్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ అభ్యర్థి మారెపల్లి సుధీర్కుమార్ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి పీ ప్రావీణ్యకు అందజేశారు. పార్టీ శ్రేణులతో ర్యాలీగా వచ్చారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వెంట ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య నామినేషన్ పత్రాలను ఆర్వోకు అందజేశారు. భూపాలపల్లి, వర్ధన్నపేట, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, కేఆర్ నాగరాజు, నాయిని రాజేందర్రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు దొమ్మాటి సాంబయ్య ఆమె వెంట ఉన్నారు.
స్వతంత్ర అభ్యర్థులుగా తాళ్లపల్లి వెంకటయ్య, మంద నరేశ్, బొచ్చు రాజు, శనిగరపు రమేశ్బాబు, అశోక్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా ఇసంపల్లి వేణు, ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా మేకల సుమన్, విదుథలై చిరుథైగల్ కట్చి అభ్యర్థిగా మచ్చ దేవేందర్ పత్రాలను ఆర్వోకు అందజేశారు. పది మంది పదకొండు సెట్లు దాఖలు చేశారు. నామినేషన్ల ప్రక్రియ 25వ తేదీ వరకు కొనసాగనుంది. ఇప్పటి వరకు మొత్తం 19మంది 22 సెట్లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. కాగా, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థి అజ్మీరా సీతారాంనాయక్ సోమవారం మానుకోట కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్కుమార్ సింగ్కు నామినేషన్ పత్రాలను అందించారు. పాల్వంచ దుర్గ మరోసారి రెండు సెట్ల దాఖలు చేశారు. యూసీసీఆర్ఐఎంఎల్ పార్టీ అభ్యర్థిగా పగిడి ఎర్రయ్య, స్వతంత్ర అభ్యర్థిగా మైపతి అరుణ్కుమార్ నామినేషన్ వేశారు. ఇప్పటివరకు మొత్తం ఏడుగురు వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు.