రెండో విడుత గొర్రెలను పంపిణీ చేసేందుకు వరంగల్ జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్రలో కొనుగోలు చేసి లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవాలను రవాణా చేసేందుకు టెండర్ల ప్రక్రియను కూడా చేపట్టింది. ఏ గ్రూపులో ఉన్న 12,957 మందికి మొదటి విడుత అందజేయగా, బీ గ్రూపులో ఉన్న 12,783 మందికి ఏప్రిల్ నుంచి ఆగస్టులోగా గొర్రెలను అందించనున్నారు. 21 గొర్రెల యూనిట్కు రూ.1,31,250 సబ్సిడీ ఇవ్వనుంది. మిగిలిన రూ.43,750 లబ్ధిదారుడు తన వాటాగా డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.
వరంగల్, ఏప్రిల్ 1(నమస్తేతెలంగాణ) : రెండో విడుత గొర్రెల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇతర రాష్ర్టాల నుంచి గొర్రెల రవాణా కోసం టెండర్ల ప్రక్రియ చేపట్టింది. ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ల నియామకం కోసం నోటిఫికేషన్ జారీ చేయనుంది. ప్రక్రియ పూర్తికాగానే లబ్ధిదారులకు గొర్రెలను పంపిణీ చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. రెండో విడుత పంపిణీని ఏప్రిల్లో మొదలుపెట్టి ఆగస్టులోగా పూర్తి చేయాలని ఇటీవల సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.4,463 కోట్లు మంజూరు చేసిం ది. కొద్దిరోజుల క్రితం సీఎం కేసీఆర్ గొర్రెల పంపిణీని వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో గొర్రెల పెంపకందారుల జాబితాలను రూపొందించారు.
ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీపోగా మిగతా మొత్తాన్ని డీడీ రూపంలో చెల్లించాలని వారికి చెబుతున్నారు. తొలివిడుతలో ఒక్కొక్కరికి 20 ఆడ గొర్రెలు, ఒక పొట్టేలు మొత్తం 21 గొర్రెలతో కూడిన యూనిట్ను ప్రభుత్వం అందజేసింది. అప్పట్లో ఒక్కో యూనిట్ విలువ రూ.1.25 లక్షలు ఉండగా రూ.93,250 సబ్సిడీ ఇచ్చింది. లబ్ధిదారుడు తన వాటాగా రూ.31,250 డీడీ రూపంలో చెల్లించాడు. తొలివిడుత 12,957 మందికి సబ్సిడీ గొర్రెల పంపిణీ జరిగినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో చాలా మంది గతంలో పాలేరుగా పనిచేసి ఇపుడు ఓనర్లుగా మారడం విశేషం. గొర్రెల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో వీరు ఆదాయాన్ని పొందుతున్నారు.
ఇప్పుడు 12,783 మందికి..
తొలి విడుత గొర్రెల పంపిణీ సమయంలోనే అధికారులు జిల్లాలో గొర్రెల పెంపకందారులను గుర్తించి ఏ, బీ గ్రూపులుగా విభజించారు. ఏ గ్రూపులోని వారికి తొలి విడుత గొర్రెల పంపిణీ జరిగింది. బీ గ్రూపులో ఉన్న మరో 12,783 మందికి పంపిణీ జరగాల్సి ఉంది. ప్రభుత్వ ఆదేశాలతో వీరికి ఈ నెల నుంచి ఆగస్టు నెలాఖరులోగా గొర్రెల యూనిట్లను అందజేసేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. కరోనా తర్వాత గొర్రెల ధరలు పెరిగినందున ప్రభుత్వం యూనిట్ ధరను రూ.1.25 లక్షల నుంచి రూ.1.75 లక్షలకు పెంచింది. యూనిట్కు రూ.1,31,250 సబ్సిడీ ఇవ్వనుంది. మిగతా రూ.43,750 లబ్ధిదారుడు డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే కొందరు రెండో విడుత గొర్రెల యూనిట్ల కోసం పశుసంవర్ధక శాఖ అధికారులకు డీడీలు అందజేశారు.
టెండర్లకు నోటిఫికేషన్..
రెండోవిడుత లబ్ధిదారులకు పంపిణీ చేసే సబ్సిడీ గొర్రెలను ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్రలో కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సదరు రాష్ర్టాల్లో కొనుగోలు చేసే గొర్రెలను జిల్లాకు రవాణా చేయడానికి ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లను టెండర్ల ద్వారా నియమించే ప్రక్రియను పశుసంవర్ధక శాఖ అధికారులు చేపట్టారు. టెండర్ల ప్రక్రియ నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ప్రక్రియ పూర్తికాగానే జిల్లాలో రెండోవిడుత గొర్రెల పంపిణీ మొదలు కానుంది. రెండోవిడుత గొర్రెల పంపిణీ కార్యక్రమం అమలుపై శనివారం ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. త్వరలో తమకు గొర్రెల యూనిట్లు అందనుండడంతో గొర్రెల పెంపకందారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.